ధర్మారం, డిసెంబర్ 11: పెద్దపల్లి జిల్లా ధర్మారం లో కాంగ్రెస్ ఫ్లెక్సీలను చింపారన్న అనుమానంతో ఆ పార్టీ నాయకుల ఫిర్యాదు మేరకు మండల కేంద్రానికి చెందిన ఏడుగురు బీఆర్ఎస్ యూత్ నాయకులను ఆదివారం పోలీసులు అదుపులోకి తీసుకున్నా రు. చేయని తప్పునకు పోలీసులు తమను చిత్రహింసలు పెట్టారని ఆరోపిస్తూ ఓ యువ నాయకుడు సోషల్ మీడియాలో రాయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసుల తీరును వ్యతిరేకిస్తూ సోమవారం ధర్మారంలోని రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు.
తనతోపాటు పలువురు యువకులను ఆదివారం ఉదయం 5 గంటలకు పోలీసులు అదుపులోకి తీసుకున్నారని బీఆర్ఎస్వై నాయకుడు చిదుగు సంపత్ చెప్పారు. 17 ఏండ్ల బాలుడు వేడుకున్నప్పటికీ విచక్షణా రహితంగా కొట్టారని ఆరోపించారు. తాము కాంగ్రెస్ ఫ్లెక్సీలను చింపలేదని, సీసీ ఫుటేజీలను పరిశీలించి చర్యలు తీసుకోవాలని విన్నవించినా వినకుండా చితకబాదారని ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ నాయకులపై కక్ష సాధింపు మొదలైందని, ఈ పద్ధతి మంచిది కాదని బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రాచూరి శ్రీధర్ సూచించారు.
ఏడుగురు యువకులపై కేసు
ధర్మారం కాంగ్రెస్ నాయకుల ఫిర్యాదు మేరకు బీఆర్ఎస్ నాయకులు చిదుగు సంపత్, దేవి అరవింద్, సంకోజి సాయికిరణ్, కొమ్మ అనిల్, రేగుల సాయికుమార్, కూనారపు విజయ్కుమార్, ఆరెల్లి దేవదాస్పై కేసు నమోదు చేసినట్టు ఎస్సై సత్యనారాయణ తెలిపారు.