హైదరాబాద్, ఏప్రిల్ 29 (నమస్తే తెలంగాణ): కరోనావేళ రాష్ట్రంలో అత్యవసర మందులు, ఆక్సిజన్ సిలిండర్లను బ్లాక్ మార్కెట్కు తరలించేందుకు యత్నిస్తున్న కేటుగాళ్లపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. సీఎం కేసీఆర్ ఈ బ్లాక్ దందాపై సీరియస్గా ఉన్నారని, దీన్ని అణచివేయాలని బుధవారం నాటి సమీక్షలో హోంమంత్రి మహమూద్అలీ ఆదేశాలిచ్చారు. దీంతో నకిలీ మందులు, నల్లబజార్ వ్యాపారాలను అడ్డుకోవడంపై క్షేత్రస్థాయిలో పోలీసులు మరింత దృష్టిపెట్టారు. ఇప్పటికే హైదరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో పలువురిపై కేసులు నమోదుచేశారు. రెమ్డెసివిర్ ఇంజెక్షన్లు బ్లాక్లో అమ్ముతున్నవారి గురించి 94906 17111 నంబర్కు వాట్సాప్ ద్వారా సమాచారం ఇవ్వాలని కోరారు. సమాచారం ఇచ్చినవారి వివరాలు గోప్యంగా ఉంచుతామని చెప్పారు. బ్లాక్ మార్కెట్ దందా చేస్తున్నవారి పనిపడతామని రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్ హెచ్చరించారు. ఈ నంబర్కు ఇప్పటికే పలు ఫిర్యాదులు వచ్చాయి.
రూ.3,490 ధర ఉన్న రెమ్డెసివిర్ ఇంజెక్షన్ను రూ.30 వేలకు విక్రయిస్తున్న ఎలిశెట్టి శేషుబాబును కుషాయిగూడ పోలీసులు బుధవారం అరెస్టుచేశారు. సరూర్నగర్ స్టేషన్ పరిధిలోనూ ఇద్దర్ని అదుపులోకి తీసుకున్నారు. వీరంతా మెడికల్ రిప్రజెంటేటివ్లు, మెడికల్ ఏజెన్సీలు, కొన్ని ప్రైవేటు దవాఖానలతో లింకులు పెట్టుకొని అధిక ధరలకు విక్రయిస్తున్నారని దర్యాప్తులో తేలినట్టు ఓ అధికారి తెలిపారు. ప్రత్యేక బృందాలతో ఇలాంటి ముఠాలను ట్రాప్ చేసి పట్టుకుంటున్నట్టు చెప్పారు.