నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించ తలపెట్టిన రైతు ర్యాలీ, బహిరంగ సభకు పోలీసులు అనుమతి నిరాకరించారు. శాంతిభద్రతలు, ట్రాఫిక్ సమస్యలను కారణంగా చూపుతూ కేటీఆర్ ర్యాలీ, మీటింగ్కు అనుమతి ఇవ్వలేమని తిరస్కరించారు.
సెప్టెంబర్ 3న మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఫ్లైఓవర్ బ్రిడ్జి నుంచి రాజీవ్ చౌక్ వరకు రైతు ర్యాలీ నిర్వహించడంతో పాటు రాజీవ్ చౌక్లో బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించారు. ఈ ర్యాలీలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో ర్యాలీకి అనుమతి కోరుతూ బీఆర్ఎస్ మిర్యాలగూడ నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు పోలీసులకు దరఖాస్తు చేసుకున్నారు. వ్యవసాయ రంగం, సాగునీరు, విద్యుత్, యూరియా కొరత, రైతు భరోసా తదితర రైతుల సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు దరఖాస్తులో పేర్కొన్నారు. దీనిపై మిర్యాలగూడ సబ్ డివిజనల్ పోలీస్ అధికారి అనుమతి నిరాకరిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
అయితే రాజీవ్ చౌక్ ప్రధాన కూడలి కావడంతో భారీ సంఖ్యలో బీఆర్ఎస్ కార్యకర్తలు, రైతులు తరలివస్తే అన్ని వైపుల నుంచి ట్రాఫిక్ నిలిచిపోయే అవకాశం ఉందని పోలీసులు పేర్కొన్నారు. రాజీవ్ చౌక్కు వచ్చే రహదారులు ఇరుకుగా ఉండటంతో పాటు ఈ ప్రాంతంలో రోజంతా భారీగా వాహనాల రాకపోకలు సాగుతుంటాయని తెలిపారు. అక్కడ ట్రాఫిక్ను మళ్లించేందుకు తగిన ప్రత్యామ్నాయ మార్గాలు కూడా లేవని, వాహనాల పార్కింగ్కు సరిపడా స్థలం అందుబాటులో లేదని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. రోడ్లపై వాహనాలను నిలిపితే ట్రాఫిక్ సమస్య మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందని తెలిపారు.
మరోవైపు కోదాడ-జడ్చర్లను కలిపే జాతీయ రహదారి-167 రాజీవ్ చౌక్ మీదుగా వెళ్తుందని పోలీసులు గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహిస్తే జాతీయ రహదారిపై కూడా రాకపోకలకు అంతరాయం కలిగే అవకాశం ఉందని పేర్కొన్నారు.
రాజీవ్ చౌక్ పరిసరాల్లో పలు ప్రభుత్వ, ఇతర ముఖ్య కార్యాలయాలు ఉన్నందున బహిరంగ సభ వల్ల వాటి సాధారణ కార్యకలాపాలకు ఇబ్బంది కలగవచ్చని పోలీసులు తెలిపారు. ర్యాలీ, సభకు అనుమతి ఇస్తే ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందని పేర్కొంటూ అనుమతిని తిరస్కరించారు.
అయితే ప్రజలకు అసౌకర్యం కలగకుండా ఇతర ప్రాంతాల్లో ఫంక్షన్ హాల్, గ్రౌండ్ వంటి ప్రదేశాల్లో ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన కార్యక్రమం నిర్వహించుకునేందుకు అవకాశం కల్పిస్తామని పోలీసులు ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.