చందుర్తి, జూన్ 21 : రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం బండపల్లికి చెందిన బీఆర్ఎస్ కార్యకర్త న్యాత సురేశ్ అనే దివ్యాంగుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ధాన్యం కుంభకోణం విషయంలో పోలీసులు పలువురిని అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
పలు వార్తాకథనాలను న్యాత సురేశ్ వైరల్ చేస్తున్నారంటూ తమకు ఫిర్యాదులు అందాయని వేములవాడ పట్టణ పోలీసులు ఆదివారం రాత్రి బండపల్లికి వెళ్లి సురేశ్ను అదుపులోకి తీసుకున్నారు. దివ్యాంగుడని కూడా చూడకుండా వేములవాడ పోలీస్స్టేషన్ తరలించగా, పెద్దఎత్తున బీఆర్ఎస్ శ్రేణులు చేరుకొని నిరసన తెలిపారు. దీంతో సురేశ్ను సొంత పూచీకత్తుతో విడుదల చేశారు.
హైదరాబాద్, జూన్21 (నమస్తే తెలంగాణ): చేవెళ్ల డిక్లరేషన్ పేరిట ఇచ్చిన హామీలు అమలు చేయకుండా దగా చేసిన కాంగ్రెస్ పార్టీ.. ఇప్పుడు బస్సుయాత్ర పేరిట మరోసారి మోసం చేసేందుకు సిద్ధమైందని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ సభ్యుడు ముడావత్ రాంబల్నాయక్ మండిపడ్డారు. ఈ మేరకు ఆదివారం ప్రకటన విడుదల చేశారు. బస్సుయాత్ర పేరిట ప్రజ ల దగ్గరికి వస్తే తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు.
కాంగ్రెస్ అధికారంలో కి వచ్చి 30 నెలలైనా దళిత గిరిజనులకు ఇచ్చిన ఒక హామీ ఒక్కటి కూడా నెరవేర్చలేదని ధ్వజమెత్తారు. చేవెళ్ల డిక్లరేషన్ అమలు సంగతేమో కానీ.. ఉన్న పథకాలకు కూడా నిధులు ఇవ్వడం లేదని నిప్పులు చెరిగారు. అమాయకులపై అక్రమంగా కేసులను బనాయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హామీలను అమలు చేయకుండా గ్రామాల్లోకి వచ్చే కాంగ్రెస్ నేతలకు గుణపాఠం చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు.