సుల్తానాబాద్, జూన్ 23 : ప్రభుత్వ ధాన్యాన్ని పక్కదారి పట్టించి రూ.7 కోట్ల భారీ కుంభకోణానికి పాల్పడ్డ ఇద్దరు రైస్మిల్ యజమానులను పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. పెద్దపల్లి డీసీపీ భూక్యారాంరెడ్డి మంగళవారం సుల్తానాబాద్ పోలీస్ సర్కిల్ కా ర్యాలయంలో ఏసీపీ గజ్జి కృష్ణతో కలిసి విలేకరులకు వివరాలను వెల్లడించారు. కరీంనగర్లోని భగత్నగర్కు చెందిన బం డారి మా రుతి, హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం కన్నూరు గ్రామానికి చెందిన సొక్కం అంజయ్య, సుల్తానాబాద్ మున్సిపల్ పరిధిలోని పూసాలలోని సౌభాగ్య ఇండస్ట్రీస్ యజమానులిద్దరూ రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ పెద్దపల్లి జిల్లా మేనేజర్ ముప్పిడి శ్రీకాంత్తో 2023-24కు కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) సరఫరా కోసం 2023 నవంబర్ 25న ఒప్పందం కుదుర్చుకున్నారని తెలిపారు.
ఒప్పందంలో భాగంగా ప్రభుత్వం వీరికి 3116. 360 మెట్రిక్ టన్నుల వరిధాన్యాన్ని అప్పగించిందని పేర్కొన్నారు. 2024 సెప్టెంబర్ 30లోపు 2119.125 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని తిరిగి ప్రభుత్వానికి డెలివరీ చేయాల్సి ఉండగా, కేవలం 515.158 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని మాత్రమే అందించినట్టు వెల్లడించారు. ప్రభుత్వ ధాన్యాన్ని బహిరంగ మార్కెట్లో అమ్ముకొని సొమ్ము చేసుకున్నారని వివరించారు. దీంతో మారుతి, అంజయ్యను కరీంనగర్లో అరెస్టు చేసి నిందితులను రిమాండ్కు తరలించినట్టు చెప్పారు.