పెద్దపల్లి, మార్చి 18(నమస్తే తెలంగాణ)/సుల్తానాబాద్: పెద్దపల్లి జిల్లాలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలే లక్ష్యంగా అక్రమ దాడులు జరుగుతున్నాయి. అందులో భాగంగానే.. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపల్ కౌన్సిలర్ గొట్టం లక్ష్మిపై పోలీసులు దౌర్జన్యానికి దిగారు. ఎలాంటి సెర్చ్ వారెంట్ ఇవ్వకుండానే ఇంట్లోకి చొరబడి సోదాలు నిర్వహించారు. మహిళా కానిస్టేబుళ్లు లేకుండానే గురువారం ఉదయం 11 గంటల ప్రాంతంలో గొట్టం లక్ష్మి ఇంటికి పోలీసులు చేరుకున్నారు. ఆ సమయంలో ఇంట్లో ఇద్దరు పిల్లలు, కౌన్సిలర్ లక్ష్మి, కోడలు స్వప్న మాత్రమే ఉన్నారు. తన కొడుకు వచ్చే వరకూ ఇంట్లోకి రావొద్దని చెప్పినా వినిపించుకోకుండా.. సుల్తానాబాద్ ఎస్సై శ్రావణ్ ఆధ్వర్యంలో నలుగురు కానిస్టేబుళ్లు ఇంట్లోకి ప్రవేశించి పత్రాలన్నీ పరిశీలించారు.
ఈ సందర్భంగా ‘మా ఇంట్లో తనిఖీలు ఎందుకు చేస్తున్నారని కౌన్సిలర్ కుమారుడు గొట్టం మహేశ్ ప్రశ్నించగా.. ప్రశ్నలు అడిగితే బైండోవర్ చేస్తాం. నీవు అక్రమంగా ఫైనాన్స్ వ్యాపారం చేస్తున్నావని ఫిర్యాదులు వచ్చాయి’ అని బెదిరించారు. దాదాపు మూడు గంటల పాటు బీరువాలు, ర్యాకులు, కప్బోర్డ్స్ను తనిఖీలు చేసి, ప్రతి పుస్తకాన్ని, పత్రాన్ని క్షుణ్ణంగా పరిశీలించి వెళ్లిపోయారు. ఎన్నడూ లేని విధంగా పోలీసుల తమ ఇంట్లోకి చొరబడి సోదాలు చేస్తుండటంతో లోబీపీతో బాధపడుతున్న కౌన్సిలర్ లక్ష్మి ఒక్కసారిగా కుప్పకూలారు.
ఎస్సై అదేమీ పట్టించుకోకుండానే ‘ఏం కాదు.. కంగారు పడొద్దు.. ఆమె బాగానే ఉంటుంది.. మీరు తనిఖీలకు సహకరించండి’ అంటూ సోదాలు కొనసాగించారు. పరిస్థితి విషమిస్తుండటంతో ఆమెను కుటుంబ సభ్యులు ప్రభుత్వ దవాఖానకు తరలించారు. అక్కడి నుంచి కరీంనగర్ ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా.. చికిత్స పొందుతూ రాత్రి వరకు కోలుకున్నది. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసే విధంగా పోలీసులు పక్కా స్కెచ్ వేసుకున్నారు. శుక్రవారం బీఆర్ఎస్ పెద్దపల్లి అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ నామినేషన్ దాఖలు కార్యక్రమానికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జిల్లాకు రానున్న సందర్భంగా.. గురువారం పోలీసులు భయానక వాతావరణాన్ని సృష్టించారు. పార్టీ శ్రేణుల్లో అలజడి సృష్టించేందుకే పోలీసులు సోదాల ప్రక్రియకు శ్రీకారం చుట్టారని సర్వత్రా విమర్శలొస్తున్నాయి.