కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఫారెస్ట్ రేంజ్ అధికారి శ్రీనివాస రావు హత్యకేసులో ఇద్దరు గుత్తికోయలను పోలీసులు అరెస్టు చేశారు. హత్యకు ఉపయోగించిన కత్తులను స్వాధీనం చేసుకున్నారు. కాగా, ఘటనలో ఇద్దరు వ్యక్తులు మాత్రమే పాల్గొన్నారని జిల్లా ఎస్పీ తెలిపారు. గుత్తికోయలు అధిక సంఖ్యలో ఉన్నారన్నది అవాస్తవమని చెప్పారు. శ్రీనివాసరావును హత్యచేసిన వారిని ఉపేక్షించేది లేదని, నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
కాగా, ఇలాంటి దాడులను సహించేది లేదని మంత్రులు పువ్వాడ అజయ్ కుమార్, ఇంద్రకరణ్ రెడ్డి స్పష్టం చేశారు. ఆయన దాడిచేసి హత్యచేసినవారిని వదిలిపెట్టమని చెప్పారు. ఈర్లపుడిలో జరిగిన శ్రీనివాసరావు అంత్యక్రియల్లో మంత్రులు పాల్గొన్నారు. అంతిమయాత్రలో పాడమోశారు. అంతకుముందు శ్రీనివాస రావు కుటుంబ సభ్యులకు మంత్రుల చేతులమీదుగా ఎంపీ వద్దిరాజు రవిచంద్ర రూ.2 లక్షల ఆర్థికసాయం అందజేశారు.
శ్రీనివాసరావు అంత్యక్రియల్లో ఎంపీ రవిచంద్ర, ఎమ్మెల్సీ తాత మధు, ఎమ్మెల్యే రేగ కాంతరావు, సీఎంఓ అధికారులు స్మితా సబర్వాల్, ప్రియాంక వర్గీస్, అటవీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శాంతకుమారి, ఖమ్మం, భద్రాద్రి జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర అధికారులు పాల్గొన్నారు.