ఖైరతాబాద్, మార్చి 19 : కన్నపేగుకు గుక్కెడు పాలు ఇవ్వలేని దయనీయ స్థితి ఆమెది. పుట్టిన తర్వాత బిడ్డ ముఖం కూడా చూడలేని దయనీయ పరిస్థితి. శిశువుకు జన్మనివ్వగానే ఆరోగ్యం విషమించి ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడింది. విషయం తెలుసుకున్న సీఎం కేసీఆర్ రాజకీయ కార్యదర్శి ఎమ్మెల్సీ శేరి శుభాశ్ రెడ్డి, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ సునీతాలక్ష్మారెడ్డి చొరవతో అత్యంత విషమ పరిస్థితిలో నిమ్స్ దవాఖానలో చేర్పిస్తే ప్రత్యేక వైద్య చికిత్సతో 18 రోజుల పాటు కంటికి రెప్పలా కాపాడి ఆమెకు ఊపిరి పోశారు వైద్యులు. ఏం జరిగింది.. నిజామాబాద్కు చెందిన మదన్కుమార్ సతీమణి మానస నిండు గర్భిణి. నెలలు నిండడంతో గత నెల 21న పురుడు కోసం స్థానిక దవాఖానలో చేర్చారు. పరీక్షించిన వైద్యులు సీజేరియన్ చేసి బిడ్డను బయటకు తీసేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. మత్తు మందు ఇచ్చి శస్త్రచికిత్స ప్రారంభించగా, గర్భంలో ఉన్న శిశువు అవయవాలు గర్భ సంచి నుంచి బయటకు వచ్చినట్లు గుర్తించారు. వెంటనే ఆపరేషన్ను నిలిపివేసి హైదరాబాద్లోని నిలోఫర్కు రిఫర్ చేయగా, కుటుంబ సభ్యులు అక్కడికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు శిశువు పరిస్థితి ఆందోళనకరంగా ఉందని కుటుంబ సభ్యులకు చెప్పడంతో ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. విషయం తెలుసుకున్న మానస బిడ్డ దక్కదేమోనని గుండెలవిసేలా రోధించింది. కొద్ది సేపటికే అపస్మారక స్థితిలోకి వెళ్లగా, తప్పని సరి పరిస్థితుల్లో అత్యవసర శస్త్ర చికిత్స చేసి బిడ్డను సురక్షితంగా బయటకు తీశారు. శిశువు జన్మించిన కొద్ది సేపటికే మానస తీవ్ర అనారోగ్యానికి గురైంది. ఆమె పరిస్థితి విషమించడంతో పరీక్షించిన వైద్యులు తాము ఏమీ చేయలేమని స్పష్టం చేశారు. స్పృహలేని స్థితిలో బిడ్డకు పాలు ఇవ్వలేక, కనీసం ముఖం చూడలేని పరిస్థితి నెలకొంది.
స్పందించి సాయమందించారు..
మానస పరిస్థితిని ప్రసార మాద్యమాల ద్వారా తెలుసుకున్న మహిళా కమిషన్ చైర్మన్, మాజీ మంత్రి సునీతాలక్ష్మా రెడ్డి, సీఎం కేసీఆర్ రాజకీయ కార్యదర్శి, మెదక్ ఎమ్మెల్సీ శేరి సుభాశ్ రెడ్డి సీఎం కార్యాలయ ఓఎస్డీ ద్వారా రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ దృష్టికి తీసుకెళ్లారు. ఆయన ఆదేశాల మేరకు మానసను గతనెల 28న ఉస్మానియా దవాఖానకు తరలించారు. అప్పటికే మానస ఆరోగ్య పూర్తిగా క్షీణించింది. మరింత మెరుగైన చికిత్స కోసం ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు ఆదేశాల మేరకు ఈ నెల 1న నిమ్స్ దవాఖనకు తరలించారు.
18 రోజుల పాటు కంటికి రెప్పలా
నిమ్స్ దవాఖానలో చేర్చగానే నిమ్స్ వైద్యులు వరుణ్, ముకుందా, రూపం, రుక్మిణి, మృదులతో పాటు అనేక మంది వైద్యుల పర్యవేక్షణలో మానసకు ప్రత్యేక చికిత్సలు ప్రారంభించారు. సుమారు 18 రోజుల పాటు ఆమెను కంటికి రెప్పలా కాపాడారు. ఎట్టకేలకు వైద్యుల కృషి ఫలించి ఆమె సంపూర్ణ ఆరోగ్యవంతురాలైంది. గర్భస్త సమయంలో ఓ వ్యాధి వల్ల ఇలాంటి పరిస్థితి ఏర్పడిందని నిమ్స్ వైద్యులు డాక్టర్ ముకుందా తెలిపారు. ప్రస్తుతం కొవిడ్ కేసులు విస్తరిస్తున్న క్రమంలో సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నట్లు తేల్చిన తర్వాతే గురువారం రాత్రి మానసను డిశ్చార్జి చేశారు.
జీవితాంతం రుణపడి ఉంటా: మానస
నా బిడ్డను చూస్తానో లేదో అనుకున్నాను. నా చికిత్సకు సహకారం అందించిన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్, మహిళా కమిషన్ చైర్మన్ సునీతాలక్ష్మా రెడ్డి, సీఎం కేసీఆర్ రాజకీయ కార్యదర్శి, మెదక్ ఎమ్మెల్సీ శేరి సుభాశ్ రెడ్డి, నిమ్స్ వైద్య బృందానికి రుణపడి ఉంటా.