హైదరాబాద్, జూలై 22 (నమస్తే తెలంగాణ): పోలవరం ప్రాజెక్టు ఫలితంగా చారిత్రక భద్రాచలం పట్టణానికి తీవ్రమైన ముప్పు పొంచి ఉన్నది. గతంలో కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) చేయించిన అధ్యయనం సైతం ఇదే విషయాన్ని వెల్లడిస్తున్నది. తెలంగాణ సర్కారు ఈ విషయంపై బలంగా వాదిస్తున్నది. ఒకవైపు సుప్రీంకోర్టును ఆశ్రయించడంతోపాటు, మరోవైపు సీడబ్ల్యూసీకి, పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ)కి పట్టువిడవకుండా లేఖలను రాస్తూనే ఉన్నది. గత నెలలో కూడా కిన్నెరసాని, ముర్రేడు వాగులపై బ్యాక్వాటర్ ఎఫెక్ట్ను వివరిస్తూ లేఖ రాసింది. ఇప్పటివరకు 15కు పైగా ఉత్తరాలను రాసింది. అయినప్పటికీ బ్యాక్వాటర్ అధ్యయనంపై ఏపీ మాత్రం స్పందించడంలేదు. కేంద్ర జలసంఘం మాత్రం బ్యాక్వాటర్ ఎఫెక్ట్పై అధ్యయనం చేయాలని పీపీఏను నిర్దేశించింది.
ఇదీ సుప్రీంకోర్టు కేసు..
పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి 1969లో ఏర్పాటయిన బచావత్ ట్రిబ్యునల్ స్పష్టమైన మార్గదర్శకాలను జారీ చేసింది. ప్రాజెక్టు ఎత్తు 150 ఫీట్లకు మించకూడదని, 36 లక్షల క్యూసెక్కుల డిశ్చార్జి కెపాసిటీతో మాత్రమే స్పిల్వేను నిర్మించాలని నొక్కిచెప్పింది. ప్రాజెక్టు గేట్లను ఏ లెవల్లో ఎలా నిర్వహించాలనే విషయంపైనా మార్గదర్శకాలిచ్చింది. ప్రాజెక్టు నిర్మాణాన్ని సైతం సీడబ్ల్యూసీనే పర్యవేక్షించాలని షరతు విధించింది. ముంపు నివారణ చర్యలు పకడ్బందీగా చేపట్టాలని నిర్దేశించింది. కానీ అవార్డుకు విరుద్ధంగా ఏపీ ప్రభుత్వం 1980 నుంచి ప్రాజెక్టు స్వరూపాన్ని పలుమార్లు మార్చుకుంటూ వచ్చింది. 500 ఏండ్ల వరదకు బదులు మొత్తం వెయ్యేండ్ల వరదను అంచనా వేసి ప్రాజెక్టు డిశ్చార్జి కెపాసిటీని 50 లక్షల క్యూసెక్కులకు పెంచింది. పోలవరం రెండు కాల్వల సామర్థ్యాన్ని 11,500 నుంచి ఏకంగా 18 వేల క్యూసెక్కులకు పెంచింది. 2005లో ఆయా పనులను చేపట్టేందుకు టెండర్లు పిలిచింది.
మొత్తం ప్రాజెక్టు స్వరూపాన్ని మార్చడాన్ని వ్యతిరేకిస్తూ ఏకంగా ప్రాజెక్టునే నిలిపేయాలని 2006 లో ఒడిశా, 2007లో ఛత్తీస్గఢ్ సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. నిర్మాణ సామర్థ్య మార్పులపై అధ్యయనానికి సీడబ్ల్యూసీ రిటైర్డ్ చీఫ్ ఇంజినీర్ గోపాలకృష్ణను సుప్రీం కోర్టు నియమించింది. ఆయన కూడా ప్రాజెక్టు నిర్మాణ సామర్థ్యం మార్పును అంగీకరించారు. దీంతో సుప్రీంకోర్టు ప్రాజెక్టు పనులను చేపట్టకుండా 2013లో స్టే ఇచ్చింది. 2010 పర్యావరణ పరిరక్షణ చట్టం ప్రకారం ముంపుపై రివైజ్డ్ అనుమతులు తీసుకోవాలని, ఒడిశా, ఛత్తీస్గఢ్ ముంపు గ్రామాల్లో సభలు నిర్వహించాలని ఆదేశించింది.
అటు తరువాత ఏపీ పునర్విభజన సందర్భంగా ప్రాజెక్టుకు కేంద్రం జాతీయ హోదా ప్రకటించింది. ఆ తరువాత కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ సర్కారు కనీస సమాచారం ఇవ్వకుండా, ఏమాత్రం సంప్రదించకుండా తెలంగాణకు చెందిన 7 మండలాలను ఏపీలో విలీనం చేసింది. వీటిలో 324 గ్రామాలున్నాయి. దీనిపై తెలంగాణ ప్రభుత్వం అప్పుడే తీవ్రంగా వ్యతిరేకింది. తరువాత ఒడిశా, ఛత్తీస్గఢ్ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లో తెలంగాణ సైతం ఇంప్లీడ్ అయ్యింది. ఏడాది గడువుతో ఇచ్చిన స్టే ఆర్డర్ను కేంద్రం ఏటికేడు పొడిగించుకొంటూ వస్తున్నదే తప్ప ఇప్పటికీ ముంపు సమస్య పరిష్కారానికి చొరవ మాత్రం చూపడం లేదు.
లేఖలపై లేఖలు..
పోలవరం ప్రాజెక్టు డిశ్చార్జి కెపాసిటీని 36 లక్షల క్యూసెక్కుల నుంచి 50 లక్షలకు పెంచిన విషయం తెలిసిందే. ఇక్కడే ప్రాజెక్టు ఎత్తును పెంచకుండా, వెడల్పును విపరీతంగా పొడిగించారు. ఫలితంగా నీటి నిల్వ సామర్థ్యం కూడా పెరుగుతుంది. ఈ నేపథ్యంలోనే మరింత ముంపు ఏర్పడుతుందని తెలంగాణ వాదిస్తున్నది. మొత్తంగా మార్చిన ప్రాజెక్టు సామర్థ్యం మేరకు ముంపుపై అధ్యయనం చేయించి రక్షణ చర్యలు చేపట్టడంతో పాటు రిహాబిలిటేషన్ అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నది.
ఇదే విషయాన్ని వివరిస్తూ 2016, నవంబర్ 4 న పోలవరం ప్రాజెక్టు అథారిటీకి లేఖను రాసింది. స్పందన రాకపోవడంతో తెలంగాణ ప్రభుత్వమే స్వయంగా 2017లో ఐఐటీ హైదరాబాద్తో పోలవరం బ్యాక్ వాటర్ ఎఫెక్ట్పై అధ్యయనం చేయించింది. సామర్థ్యం మార్పు వల్ల అదనంగా పలు గ్రామాలు ముంపునకు గురవుతున్నాయని గుర్తించింది. ఈ నేపథ్యంలో మరింత లోతుగా అధ్యయనం చేయించాలని నిర్ణయించింది.
భద్రాచలంతో పాటు పలు ముఖ్యమైన ప్రాంతాల్లో పోలవరం బ్యాక్ వాటర్ లెవల్ను కంప్యూటేషన్ చేయాలని 2019, ఫిబ్రవరి 12న పుణెలోని సెంట్రల్ వాటర్, పవర్ రిసెర్చ్ సెంటర్ (సీడబ్ల్యూపీఆర్ఎస్)కు విజ్ఞప్తి చేయగా అందుకు ఆ సంస్థ నిరాకరించింది. ఇప్పటికే సీడబ్ల్యూసీ అదే తరహా స్టడీ చేసిందని వెల్లడించింది. దీంతో తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
న్యూట్రల్ ఏజెన్సీ ద్వారా పోలవరం బ్యాక్వాటర్పై స్టడీ చేయించాలని, ఈ మేరకు ఏపీ, సీడబ్ల్యూసీకి ఆదేశాలను జారీచేయాలని విజ్ఞప్తి చేసింది. 2020లో పీపీఏకు మరోసారి ఇదే విషయమై లేఖ రాసి విజ్ఞప్తి చేసింది. సీడబ్ల్యూసీ చేసిన స్డడీ రిపోర్టును అందజేయాలని, ఏపీ చేపట్టిన ప్రొటెక్షన్ చర్యలను వివరించాలని కోరింది. అక్కడితో ఆగకుండా గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు (జీఆర్ఎంబీ) 8,9 వ సమావేశాల్లో ముంపుపై అధ్యయనం చేయించాల్సిన ఆవశ్యకతపై తెలంగాణ బలంగా వాదించింది.
ఎప్పటికప్పుడు చేసిన ఒత్తిడి ఫలితంగానే సీడబ్ల్యూసీ చేసిన అధ్యయన నివేదికను పీపీఏ తెలంగాణకు అందజేసింది. ఆ అధ్యయనంలోని లోపాల పైనే తెలంగాణ తిరిగి అనేక లేఖలు రాసింది. గత నెల 15న సైతం పీపీఏకు మరోసారి లేఖను రాసింది. పోలవరం ప్రాజెక్టు వల్ల ప్రధాన గోదావరిలో ఎక్కువ మొత్తంలో నీరు నిలిచి ఉంటుందని, తత్ఫలితంగా ముర్రేడువాగు, కిన్నెరసాని నదులు గోదావరిలో సంగమించే అవకాశం లేకుండా పోతుందని వివరించింది. వాటిల్లోనూ డ్రైనేజ్ స్టాగ్నేషన్ ఏర్పడుతున్నదని, అక్కడ కూడా ముంపు నివారణచర్యలు చేపట్టాల్సి ఉంటుందని వెల్లడించింది. పోలవరం ముంపుపై అధ్యయనం కోసం, రక్షణ చర్యలను చేపట్టేందుకు తెలంగాణ సర్కారు అవిశ్రాంతంగా కృషి చేస్తున్నది.