హైదరాబాద్, జూలై 22 (నమస్తే తెలంగాణ)/రవీంద్రభారతి: కవులు, రచయితలు తెలంగాణకు రెండు కండ్ల వంటి వారని సాంస్కృతిక, పర్యాటక, క్రీడల శాఖల మంత్రి శ్రీనివాస్గౌడ్ చెప్పారు. తెలంగాణ రాక ముందు ఉన్న దుస్థితిపై కలాలను ఎత్తిన కవులు, రచయితలు, నేడు తెలంగాణ వచ్చాక జరిగిన అభివృద్ధిని ప్రజలకు వివరించాలని కోరారు. దాశరథి కృష్ణమాచార్య 98వ జయంతి, సాహితీ పురస్కార ప్రదానోత్సవాన్ని తెలంగాణ భాష, సాంస్కృతికశాఖ శుక్రవారం రవీంద్రభారతిలో నిర్వహించింది. దీనికి ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి శ్రీనివాస్గౌడ్ మాట్లాడుతూ.. చనిపోయేంత వరకు తెలంగాణ గడ్డను, జాతిని ప్రేమిస్తూ.. మన సంస్కృతి, సంప్రదాయాలను ప్రపంచానికి చాటిన మహనీయులు దాశరథి అన్నారు.
ప్రముఖ కవి వేణు సంకోజు దాశరథి విశిష్ఠ పురస్కారం అందుకోవడం మనందరికీ గర్వకారణమని చెప్పారు. నిజాం పాలనకు వ్యతిరేకంగా సాగిన ఉద్యమంలో దాశరథి ఎలాంటి పాత్ర పోషించారో.. మలి దశ తెలంగాణ ఉద్యమంలో వేణు సంకోజు దాదాపు అలాంటి పాత్రే పోషించారని కితాబిచ్చారు. ఈ పురస్కారానికి సీఎం కేసీఆర్ ఆయనను ఎంపిక చేశారంటే తెలంగాణ కోసం ఆయన చేసిన కృషి, రచనలే కారణమని పేర్కొన్నారు. తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం కోసం, సాంస్కృతిక రంగం కోసం కలం పట్టుకొని తిరిగిన వేణు సంకోజును దాశరథి పురస్కారానికి ఎంపిక చేయడం సీఎం కేసీఆర్ గొప్పతనమన్నారు. అనంతరం వేణు సంకోజుకు అవార్డు, రూ.1,01,116 నగదు పురస్కారం ప్రదానం చేశారు. శాలువా, జ్ఞాపికతో సత్కరించారు. కార్యక్రమంలో ప్రభుత్వ, సాంస్కృతిక సలహాదారులు కేవీ రమణాచారి, దాశరథి కుమారుడు లక్ష్మణ్, సాంస్కృతికశాఖ సంచాలకుడు మామిడి హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ తల్లికి రుణపడి ఉంటా
తెలంగాణ తల్లికి, ఈ నేలకు రుణపడి ఉంటా. నేను పుట్టింది నల్లగొండ జిల్లా చండూరులో అయినా నా చిన్నతనంలోనే సికింద్రాబాద్కు వచ్చి స్థిరపడ్డాం. తాత నానమ్మ, తల్లిదండ్రులు కష్టాన్నే నమ్ముకొని బతికారు. హైదరాబాద్లో తొలిసారి అద్భుతమైన షోలాపూర్ బాయిలర్లు తయారు చేసిన వ్యక్తి మా నాన్న. ఆయనను చూసే నేను కొత్తగా ఆలోచించడం, నమ్మిన దాన్ని ఆచరించడం నేర్చుకున్నా. నా శక్తి కొద్దీ ఇప్పటి వరకు 11 పుస్తకాలు రాశాను. నా జీవిత ప్రయాణంలో ఎప్పుడు లబ్ధి పొందలేదు కానీ ఉపలబ్ధి పొందాను. ఈ రోజు మీ అందరి ప్రేమ, ఆదరణ అలానే లభించింది. చేత గొప్పదైతే రాత గొప్పది అవుతుందని నేను బలంగా విశ్వసిస్తా. ఈ రోజు నాకు ఈ పురస్కారం రావడానికి కారణం నా తల్లిదండ్రులే కాదు.. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ.
– వేణు సంకోజు, దాశరథి కృష్ణమాచార్య సాహితీ పురస్కార గ్రహీత