హైదరాబాద్, డిసెంబర్ 5 (నమస్తే తెలంగాణ): పోడు భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు సర్కార్ వడివడిగా అడుగులు వేస్తున్నది. క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించి, ఆ సర్వే ఆధారంగా గ్రామసభలు నిర్వహించాలనే ప్రభుత్వ ఆదేశానికి అనుగుణంగా అటవీ, గిరిజన సంక్షేమశాఖల అధికారులు సమన్వయంతో ముందుకు సాగుతున్నారు. రాష్ట్రంలోని 23 జిల్లాల్లో 4,953 గిరిజన ఆవాసాల్లో పోడుభూముల సమస్య ఉన్నట్టు అధికారులు గుర్తించారు. అటవీ, గిరిజన సంక్షేమశాఖ అధికారులు ఇప్పటివరకు 4,908 (99.09 శాతం) ఆవాసాల్లో గ్రామసభలు నిర్వహించా రు. ఆదిలాబాద్, ఖమ్మం, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల్లోని మిగిలిన 45 ఆవాసాల్లో గ్రామసభలు నిర్వహించాల్సి ఉన్నది. గ్రామసభల అనంతరం షెడ్యూల్ ప్రకారం సబ్డివిజనల్ స్థాయి సమావేశాలు, ఆపై జిల్లా స్థాయి సమావేశాలు నిర్వహించి ప్రభుత్వానికి నివేదిక సమర్పించాలి. ఈ నెల 8 నుంచి 12 వరకు సబ్డివిజనల్ స్థాయి సమావేశాలు, 14 నుంచి 19 వరకు జిల్లా స్థాయి సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం ఇప్పటికే షెడ్యూల్ ప్రకటించింది.
నిరంతర పర్యవేక్షణ
పోడుభూముల సమస్యకు శాశ్వత పరిష్కారం కనుగొనాలని సీఎం కేసీఆర్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేయటంతో సంబంధిత శాఖమంత్రులు సత్యవతి రాథోడ్, ఇంద్రకరణ్రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్, అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఏ శాంతికుమారి, పీసీసీఎఫ్ పర్గేన్, గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి క్రిస్టినా జెడ్ చొంగ్తూ నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. నిర్దేశిత షెడ్యూల్ ప్రకారం ఏ రోజుకారోజు జరిగే కార్యక్రమాలపై సమీక్షిస్తున్నారు. పోడు పర్యవేక్షణ అధికారులకు ప్రభుత్వం ట్యాబ్స్ అందజేసింది. పోడు భూముల సర్వే కార్యక్రమాల తీరుతెన్నులను ఎప్పటికప్పుడు పరిశీలించి పర్యవేక్షణలో వేగం పెంచేందుకు ట్యాబ్స్ను వినియోగించుకోవాలని క్షేత్రస్థాయి సిబ్బందిని ఆదేశించింది.
23 జిల్లాల్లో 100 శాతం గ్రామసభలు
గ్రామసభలు ఇప్పటికే 23 జిల్లాల్లో పూర్తయ్యాయి. హనుమకొండ, జగిత్యాల, జయశంకర్-భూపాలపల్లి, కుమ్రంభీం-ఆసిఫాబాద్, మహబూబాబాద్, మహబూబ్నగర్, మంచిర్యాల, మెదక్, ములుగు, నాగర్కర్నూల్, నారాయణపేట, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, రాజన్న-సిరిసిల్ల, సంగారెడ్డి, సిద్దిపేట, సూర్యాపేట, వికారాబాద్, వనపర్తి, వరంగల్, యాదాద్రి-భువనగిరి, కామారెడ్డి జిల్లాల్లో గ్రామసభలు నిర్వహించారు. రాష్ట్రంలోని 295 మండలాల్లో పోడుభూముల ప్రభావం ఉన్నదని గుర్తించిన ప్రభుత్వం ముందుగా క్షేత్రస్థాయిలో ఫిర్యాదులను స్వీకరించింది. 2856 గ్రామ పంచాయతీల నుంచి ఎఫ్ఆర్సీలకు ఫిర్యాదులు అందాయి. రాష్ట్రంలోని 12,49,296 ఎకరాలకు సంబంధించి 4,14,353 క్లెయిమ్స్ (ఫిర్యాదులు) వచ్చాయి. ఈ ఫిర్యాదుల్లో గిరిజనుల నుంచి 62 శాతం, గిరిజనేతరుల నుంచి 38 శాతం ఫిర్యాదులు ప్రభుత్వానికి అందాయి.