నిర్మల్ : పోడు భూముల సమస్యలకు త్వరలోనే శాశ్వత పరిష్కారం లభిస్తుందని, ఈ దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తుందని రాష్ట్ర అటవీ, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. శనివారం నిర్మల్ కలెక్టరేట్లో మంత్రి ఎమ్మెల్యేలు, అఖిలపక్ష నేతలు, జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అటవీ విస్తీర్ణం, పోడు భూముల సమస్యలను అధికారులు వివరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అర్హులైన లబ్ధిదారులను గుర్తించి, వారి జీవనోపాధికి ఇబ్బంది కలుగకుండా చూడడంతో పాటు సమస్యకు ఓ ముగింపు పలకాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. భవిష్యత్ తరాలను దృష్టిలో ఉంచుకొని అడవులు అన్యాక్రాంతం కాకుండా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.
గతంలో ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు జారీ చేసిన నేపథ్యంలో.. ప్రస్తుతం ఇంకా ఎంత మందికి, ఎన్ని ఎకరాలకు పట్టాలు అందించాలనే విషయమై సమగ్ర సమాచారం సేకరించాలని.. దీనిపై గ్రామ, డివిజనల్, జిల్లా స్థాయి కమిటీలు కసరత్తు చేయాలని ఆదేశించారు. పోడు భూములు, అడవుల సంరక్షణ విషయాలపై ప్రభుత్వ నిబంధనలు, ఆర్ఓఎఫ్ఆర్ యాక్ట్లోని అంశాలను తప్పకుండా పాటించాలన్నారు. నవంబర్ 8 నుంచి డిసెంబర్ 8 వరకు పోడు వ్యవసాయం చేస్తున్న గిరిజనులు, తదితరుల నుంచి క్లెయిమ్స్ స్వీకరించాలని సీఎం ఆదేశించి నేపథ్యంలో నవంబర్ 8లోగా వివిధ స్థాయిల్లో సన్నాహక సమావేశాలు ఏర్పాటు చేసి ఆర్ఓఎఫ్ఆర్ చట్టం ప్రకారం.. గ్రామ కమిటీల నియామకం చేపట్టాలన్నారు.
రాష్ట్రంలో పోడు వ్యవసాయం ఎక్కువగా ఉన్న జిల్లాల్లో ఉమ్మడి ఆదిలాబాద్ ఒకటని పేర్కొన్నారు. ఈ ప్రాంతంలో అటవీ భూమి ఎక్కువ ఉన్న క్రమంలో వాటిని కాపాడడంతో పాటు సమస్యను ప్రజలకు వివరించి.. సామరస్యపూర్వకంగా పరిష్కారం చూపాలన్నారు. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి.. ఎవరెవరు వ్యవసాయం చేస్తున్నారనే వివరాలు పకడ్బందీగా సేకరించాలని సూచించారు. అటవీ, రెవెన్యూ, గిరిజన సంక్షేమ శాఖ అధికారులు సమన్వయంతో వ్యవహరించాలని స్పష్టం చేశారు. సమగ్ర అధ్యయనం తర్వాత సీఎం కేసీఆర్ నిర్ణయం మేరకు అర్హులకు భూములపై హక్కులు కల్పిస్తామని స్పష్టం చేశారు.
సమస్య పరిష్కారమైన అనంతరం అడవుల పరిరక్షణ, పునరుజ్జీవ చర్యల్లో భాగంగా ఇంచు భూమి కూడా అన్యాక్రాంతం కాకుండా చూస్తామని మంత్రి ఇంద్రకరణ్రెడ్డితో పాటు ప్రజాప్రతినిధులు, అఖిలపక్ష నేతలు, అధికారులు ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేశారు. సమావేశంలో ఎమ్మెల్యేలు విఠల్ రెడ్డి, రేఖా శ్యాంనాయక్, జడ్పీ చైర్ పర్సన్ కే విజయలక్ష్మి రెడ్డి, కలెక్టర్ ముషారఫ్ ఫారూఖీ అలీ, అఖిలపక్ష నేతలు, జిల్లా అటవీ, గిరిజన, రెవెన్యూ, పోలీస్ శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.