హైదరాబాద్ సిటీబ్యూరో, మే 28 (నమస్తే తెలంగాణ): పోక్సో కేసు నిందితుడు బండి భగీరథ్ విచారణ పోలీసు కస్టడీలో రెండో రోజు ప్రత్యేక దర్యాప్తు అధికారి, కూకట్పల్లి డీసీపీ రితిరాజ్ పర్యవేక్షణలో జరిగింది. కోర్టు అనుమతితో తమ కస్టడీలోకి తీసుకున్న పేట్బషీరాబాద్ పోలీసులు గురువారం అతడిని విచారించారు. పోక్సో కేసును నీరుగార్చేందుకు సాక్ష్యాలను మాయం చేసినట్టు ఆరోపణలు రావడంతో పోలీసులు ఆ దిశగా ఫోకస్ పెట్టినట్టు తెలిసింది. సాక్ష్యాలు లేకుండా కుట్ర చేసేందుకు సహకరించిందెవరు, బాధితులను బెదిరించిందెవరు? తదితర అంశాలపై నిందితుడి నుంచి సమాచారం రాబట్టేందుకు పోలీసులు ప్రశ్నల వర్షం కురిపించారు. అయితే భగీరథ్ సమాధానం చెప్పకుండా మౌనంగా ఉన్నట్టు తెలిసింది.
సాంకేతికపరమైన సాక్ష్యాలు లేకుండా ఫోన్లను ఫార్మాట్ చేయడం, సోషల్మీడియా అకౌంట్స్ను డిలీట్ చేయడం వంటి విషయాలను కూడా ప్రస్తావించారు. మొదటి రోజు మొయినాబాద్ ఫామ్హౌస్ వద్ద విచారణ చేసిన పోలీసులు ఇప్పటివరకు సేకరించిన ఆధారాలతో రెండోరోజు మరింత సమాచారం రాబట్టినట్టు తెలిసింది. బాధితురాలి కుటుంబసభ్యులు ఇచ్చిన ఫిర్యాదులో భగీరథ్ స్నేహితుల పేర్లను కూడా ప్రస్తావించిన నేపథ్యంలో పోలీసులు వారిలో కొందరిని ఇప్పటికే విచారించి, ఈ కేసుతో వారికున్న సంబంధాలను ఆరా తీశారు.
స్నేహితులు చెప్పిన విషయాలు, నిందితుడు చెప్పిన విషయాలను సరిపోల్చుతూ విచారించినట్టు తెలిసింది. నిందితుడిపై కేసు నమోదు కాగానే అతడి ఫోన్ ఫార్మాట్ అయినట్టు, అదేరోజు అతడి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా డిలీట్ అయినట్టు ఆరోపణలు వచ్చాయి, పోలీసులు ఆ సమాచారాన్ని సేకరించి, అందుకుగల కారణాలను ఆరా తీసి ఆ మేరకు కేసులో సెక్షన్లను కూడా జోడించారు. విచారణకు హాజరుకావాలంటూ ఈ నెల 12న పోలీసులు ఇచ్చిన నోటీసుపై రెండు రోజుల గడువు కోరుతూ భగీరథ్ ఈమెయిల్ ద్వారా సమాచారం పంపించాడు. ఆ ఈమెయిల్ పంపిందెవరు? నోటీసు ఇచ్చిన సమయంలో భగీరథ్ ఎక్కడున్నాడని ప్రశ్నించినట్టు తెలిసింది. సాక్ష్యాధారాలను తొలగించడం, పోలీసులకు దొరుకకుండా అజ్ఞాతంలో ఉండటానికి ఎవరెవరు సహకరించారనే అంశాలను కూడా నిందితుడి నుంచి పోలీసులు రాబట్టినట్టు తెలిసింది.
పోలీసులకు ఫిర్యాదు చేయకుండా బాధితురాలి కుటుంబాన్ని భయభ్రాంతులకు గురిచేసిందెవరు? వారిని బెదిరించింది ఎవరు? బాధితురాలు విషయం బయటపెట్టకుండా ఉండేందుకు రాజీ ప్రయత్నాలు ఎవరు చేశారు? తదితర అంశాలపై పోలీసులు వివరాలు సేకరించినట్టు తెలిసింది. బాధితురాలు మైనర్ అని తెలిసి పోలీస్స్టేషన్కు వెళ్లకుండా అడ్డుకున్నదెవరు? నిందితుడిని ఈ కేసు నుంచి కాపాడేందుకు ప్రయత్నించిన వారు ఎవరు అన్న వివరాలను కూడా సేకరించినట్టు సమాచారం.
ఈ నెల 8న బాధితురాలి కుటుంబం పేట్బషీరాబాద్ పోలీస్స్టేషన్కు ఫిర్యాదు చేయడానికి వచ్చిన సమయంలోనే.. కరీంనగర్ టూటౌన్ పోలీస్స్టేషన్లో భగీరథ్ బాధితురాలిపై ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. కరీంనగర్లో పోలీస్స్టేషన్కు వెళ్లి నేరుగా ఫిర్యాదు చేశావా? లేక పోలీసులు వచ్చి ఫిర్యాదు తీసుకున్నారా? ఆ రోజు నీవు ఎక్కడున్నావు? మీరు ఫిర్యాదు ఇవ్వగానే కేసు నమోదు చేయడానికి అక్కడి పోలీసులపై ఒత్తిళ్లు చేశారా? అనే అంశాలను నిందితుడి ముందు ఉంచినట్టు తెలిసింది. అలాగే నిర్మల్ పోలీసులకు ఫిర్యాదు చేయించి, బాధితురాలిని బెదిరించి, ఆమె ఫోన్ను బలవంతంగా తీసుకోవడానికి ప్రయత్నించినట్టు వచ్చిన ఆరోపణలను సైతం ప్రస్తావించినట్టు తెలిసింది. అయితే వీటన్నింటికి నిందితుడు సరైన సమాధానాలు చెప్పకుండా మౌనంగా ఉన్నట్టు సమాచారం.