మహబూబ్నగర్ : మైనర్ బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోక్సో కేసులో మహబూబ్నగర్ జైలులో ( Mahabubnagar District Jail ) రిమాండ్ ఖైదీగా ఉన్న నిందితుడు ఒకరు జైలు నుంచి పారిపోయిన (Accused Escapes) విషయం జిల్లాలో సంచలనం కలిగించింది. వనపర్తి జిల్లా అమరచింత మండలం నందిమల్ల గ్రామానికి చెందిన కిషోర్ రెడ్డి( Kishore Reddy ) మైనర్ బాలికను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని అమ్మాయి తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో అతడిపై పోక్సో కేసు నమోదు అయింది.
దీంతో అతడు 25 రోజులుగా మహబూబ్నగర్ జిల్లా జైలులో రిమాండ్లో ఉన్నాడు. ఇదిలా ఉండగా జైలు నుంచి పరారీ కావడానికి కిషోర్ అనేక సార్లు రెక్కి నిర్వహించినట్లు తెలుస్తోంది. తోటి ఖైదీల టవళ్లను( Towels ) తీసుకొని బాత్రూం ఎక్కి అక్కడి నుంచి గోడ మీదకు చేరి టవళ్లను ఒకదానికొకటి కట్టి 18 ఫీట్ల గోడ దాటుకొని కిందికి దిగి పరారీ అయినట్లు జైలు సిబ్బంది గుర్తించారు.
అనంతరం జైలు అధికారులు వెంటనే స్థానిక వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా అటు జైలు సిబ్బంది, పోలీసులు సమీప ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టారు. నిందితుడు స్వగ్రామానికి చేరుకుని ఉంటాడని ఆత్మకూరు పోలీసులకు సమాచారం అందించారు. ఇదిలా ఉండగా జైలు నుంచి పరారైన కిషోర్ తల్లిదండ్రులకు ఫోన్కాల్ చేసినట్లు గుర్తించారు. జైలు నుంచి పారిపోయి ఇంటికి వస్తున్నానని సమాచారం ఇవ్వగా తల్లిదండ్రులు వారించారు.
పరారీ విషయం తెలుసుకున్న జైళ్ల శాఖ డీఐజీ గోప్యంగా విచారణ జరిపి వెళ్లినట్లు సమాచారం. అయితే మహబూబ్నగర్ జైలు నుంచి ఖైదీ పరారైనట్లు జైలు శాఖ నుంచి తమకు ఫిర్యాదు అందిందని వన్ టౌన్ ఎస్సై శీనయ్య మీడియాకు వివరించారు.