హైదరాబాద్, ఆగస్టు 1 (నమస్తే తెలంగాణ): అసెంబ్లీ సమావేశాలు దేశానికే ఆదర్శమని శాసనసభాపతి పోచారం శ్రీనివాస్రెడ్డి అన్నారు. శాసనసభ పనితీరు అద్భుతంగా ఉందని ఢిల్లీలోనూ మాట్లాడుకుంటున్నారని పేర్కొన్నారు. గురువారం నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఏర్పాట్లపై ప్రభుత్వ, పోలీసు ఉన్నతాధికారులతో మంగళవారం శాసనసభ భవనంలోని కమిటీహాల్లో స్పీకర్ పోచారం, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, శాసనసభ వ్యవహారాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి సమావేశమయ్యారు. మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్ ముదిరాజ్, శాసనసభ చీఫ్విప్ దాస్యం వినయ్భాసర్, మండలి చీఫ్విప్ భానుప్రసాదరావు, లెజిస్లేటివ్ సెక్రటరీ వీ నరసింహా చార్యులు పాల్గొన్నారు. సమావేశాలకు ముందు శాసనసభ భవనంలో నూతనంగా ఏర్పాటు చేసిన రెండు లిఫ్ట్లను పోచారం, గుత్తా ప్రారంభించారు. అనంతరం స్పీకర్ మాట్లాడుతూ.. అసెంబ్లీ సమావేశాలు పారదర్శకంగా జరిగి ప్రజలకు అన్ని విషయాలు తెలియాల్సిన అవసరముందని పేర్కొన్నారు.
సమాచారాన్ని తెలుగు, ఉర్దూ, ఇంగ్లిష్ భాషల్లో ముద్రించి ముందస్తుగా సభ్యులకు అందిస్తే వారు సన్నద్ధం కావడానికి ఉపయోగపడుతుందని తెలిపారు. శాసనసభ, మండలి సమావేశాలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సజావుగా జరిగేందుకు పోలీసు శాఖ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి మాట్లాడుతూ.. దేశంలో మరే రాష్ట్రం నిర్వహించని విధంగా అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ప్రొటోకాల్ విషయంలో వివాదాలు తలెత్తకుండా తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. శాసనసభ వ్యవహారాల మంత్రి వేము ల ప్రశాంత్రెడ్డి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ఆలోచనలకు అనుగుణంగా దేశంలోనే అత్యం త ఉన్నతంగా, ఆదర్శంగా తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయన్నారు. ప్రభు త్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు రామకృష్ణారావు, ఆర్వింద్కుమార్, డీజీపీ అంజనీకుమార్, హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జితేందర్, హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సీవీ అనంద్, రాచకొండ కమిషనర్ డీఎస్ చౌహన్, సైబరాబాద్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర తదితరులు సమావేశానికి హాజరయ్యారు.