బాన్సువాడ, ఏప్రిల్ 14: ఎమ్మెల్యేలు ఫోన్లు చేస్తే నాయకులు లేపకపోతే ఏమనాల? ఎవరికి చెప్పాలా? అని ఎమ్మెల్యే, ప్రభుత్వ సలహాదారు పోచారం శ్రీనివాసరెడ్డి ఆవేదన వ్యక్తంచేశారు. సిద్ధ్దాపూర్ రిజర్వాయర్ నిర్మాణ పనులకు నిధులు మంజూరు చేయకపోవడంపై రెండ్రోజుల క్రితం పోచారం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. కామారెడ్డి జిల్లా బాన్సువాడలో మంగళవారం నిర్వహించిన అంబేద్కర్ జయంతి వేడుకల్లో పాల్గొన్న అనంతరం ఆయన మాట్లాడుతూ సిద్ధాపూర్ రిజర్వాయర్ అంశంపై మరోమారు స్పందించారు. ఫోన్లు చేసినా కొంతమంది నాయకులు లేపకపోతే బాధ కలిగిందని అన్నారు.
‘మాకు అర్ధరాత్రి ఒంటి గంటకు ఫోన్ వస్తే లేపుతాం. ఏదైనా ఎమర్జెన్సీ ఉంటదని మాట్లాడుతాం. నాయకులే ఫోన్లు లేపకపోతే ఇగ ఎవరికి చెప్పుకోవాలి? ఎమ్మెల్యేలు ఫోన్లు చేసినా లేపకపోతే ఏం గావాలా? అని ప్రశ్నించారు. ‘ప్రస్తుతం పొద్దున లేస్తే ఈయన్ని ఆయన తిట్టుడు, ఆయన్ను ఈయన తిట్టుడు. ఇదే పని అయిపోయింది. ప్రాజెక్టులు, లిప్టులు కట్టాలి. రైతాంగానికి చివరి ఆయకట్టు వరకు పుష్కలంగా నీళ్లు ఇయ్యాలి. పంట పండకపోతే రైతుల పరిస్థితి ఏంది? మనం రెండు రోజులు ఉపాసం ఉంటే తెలుస్తది.
ఎవరూ ఉపాసం ఉండకుండా అన్నంపెట్టే వాడే రైతు’ అని పోచారం అన్నారు. తన నియోజకవర్గంలో జరిగే అభివృద్ధికి సీఎం, మంత్రులు, కలెక్టర్లు, అధికారుల సహకారం కావాలని కోరారు. తానొక్కడినే ఏమీ చేయలేను కదా? అని వ్యాఖ్యానించారు. తాను చెబుతాను, పనుల గురించి ప్రతిపాదిస్తాను తప్పితే.. అవి చేసేవి ప్రభుత్వంలో ఉన్నవారేనని స్పష్టంచేశారు.