నస్రుల్లాబాద్, నవంబర్ 19 : ‘సొంత నియోజకవర్గంలో సేవ చేయని నాయకులు ఇక్కడకు వచ్చి మనకు మంచి చేస్తారా?’ అని బాన్సువాడ బీఆర్ఎస్ అభ్యర్థి, స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి ఏనుగు రవీందర్రెడ్డి ఎల్లారెడ్డి నియోజకవర్గం నుంచి వలస వచ్చారని, అక్కడ అభివృద్ధి చేయని ఆయన, ఇక్కడేం చేస్తారని ప్రశ్నించారు. ఆదివారం కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్ మండలంలోని పలు గ్రామాల్లో పోచారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 1994లో మొదటిసారిగా ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు కనిపించిన స్పందన మళ్లీ ఇప్పుడు కనిపిస్తున్నదని అన్నారు. అసైన్డ్ భూములపై నియంత్రణ ఎత్తివేసి క్రయ, విక్రయాలకు వీలు కల్పిస్తామని తెలిపారు.
బీఆర్ఎస్ మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలు అమలు చేయాలంటే దమ్మున్న, సమర్థుడైన కేసీఆర్ లాంటి ముఖ్యమంత్రి ఉండాలని సూచించారు. 2018 ఎన్నికల్లో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ తరపున పోటీచేసిన తొమ్మిది మందిలో ఏనుగు రవీందర్ రెడ్డి ఒక్కడే ఓడిపోయాడని తెలిపారు. ప్రజలకు సేవ చేయకపోవడంతోనే అక్కడి ప్రజలు చిత్తుగా ఓడించినట్టు చెప్పారు. ఎల్లారెడ్డిలో చెల్లని రూపాయి బాన్సువాడలో చెల్లుతుందా? ప్రజలు ఆలోచించాలని కోరారు. ప్రచారంలో డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.