PM Fasal Bima | హైదరాబాద్, మార్చి 1 (నమస్తే తెలంగాణ): కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని పంటల బీమా పథకం ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన (పీఎంఎఫ్బీవై)లో రాష్ట్ర ప్రభుత్వం తిరిగి చేరింది. సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, పీఎంఎఫ్బీవై సీఈవో, కేంద్ర సంయుక్త కార్యదర్శి రితేశ్హాన్ శుక్రవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పీఎంఎఫ్బీవైలో 2016 నుంచి 2020 వరకు తెలంగాణ కొనసాగిన విషయం, ఆ తర్వాత నాటి ప్రభుత్వం దాని నుంచి ఉపసంహరించుకున్న తీరుపై చర్చ జరిగింది.
పీఎంఎఫ్బీవైలోకి రాష్ట్ర ప్రభుత్వం తిరిగి చేరడంతో వచ్చే పంట కాలం నుంచి తెలంగాణ రైతులు పంటల బీమా పొందనున్నారు. ఈ సందర్భంగా రేవంత్రెడ్డి మాట్లాడుతూ.. రైతులకు దన్నుగా నిలుస్తూ సాగు రంగాన్ని బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధిలో రైతు కేంద్రిత విధానాల అమలుకు ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు. పీఎంఎఫ్బీవైతో రైతులకు ప్రయోజనం కలుగుతుందని, పంటలు నష్టపోయినప్పుడు సకాలంలోనే పరిహారం అందుతుందని రితేశ్హాన్ తెలియజేశారు. సమావేశంలో ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి రామకృష్ణారావు, ముఖ్యమంత్రి కార్యదర్శి చంద్రశేఖర్రెడ్డి, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్రావు, డైరెక్టర్ గోపి తదితరులు పాల్గొన్నారు.