ఏడేండ్లలో ముఖ్యమైన బిల్లులన్నీ
మూజువాణితోనే పాస్
హైదరాబాద్, ఫిబ్రవరి 8 : ఎంతో హడావుడిగా తెలంగాణ ఏర్పాటు బిల్లును చర్చించకుండానే ఆమోదింపజేశారని ప్రధాని మోదీ మంగళవారం రాజ్యసభలో కాంగ్రెస్ను విమర్శించారు.2014లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడిననాటి నుంచి ఎన్నో కీలక బిల్లులను మూజువాణి ఓటుతోనే ప్రతిపక్షాలకు చర్చకు అవకాశం ఇవ్వకుండా ఆమోదించారు. మొట్టమొదటి క్యాబినెట్ సమావేశంలోనే ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలు ఏపీలో కలుపుతూ నిర్ణయం తీసుకొన్నారు. లోక్సభలో ఈ చట్ట సవరణను మూజువాణి ఓటుతోనే మమ అనిపించేశారు..
రైతు చట్టాలపై చెంపలేసుకొన్నారు
కార్పొరేట్ శక్తులకు వత్తాసు పలికేలా నూతన వ్యవసాయ చట్టాలు రూపొందించడంలో మోదీ ప్రభుత్వం అవలంబించిన ధోరణి అందరికీ తెలిసిందే. కనీస చర్చకు కూడా అవకాశం లేకుండా నిమిషాల వ్యవధిలోనే లోక్సభ ఈ బిల్లులను ఆమోదించిన మోదీ సర్కార్ ఏడాది తరువాత చెంపలేసుకొని వెనక్కి తీసుకొన్నది.
మూజువాణి ఓటుతోనే ట్రిపుల్ తలాక్
ట్రిపుల్ తలాక్ బిల్లును సైతం లోక్సభలో మూజువాణి ఓటుతోనే ఆమోదించారు. ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్తోపాటు ఆర్జేడీ, బీజేడీ, ఏఐఏడీఎంకే, ముస్లింలీగ్ సభ్యులంతా చర్చకు అవకాశం ఇవ్వాలని డిమాండ్చేసినా పట్టించుకోకుండా ఏకపక్షంగానే బిల్లుకు ఆమోద ముద్ర వేశారు.
అత్యంత గోప్యంగా కశ్మీర్ విభజన అంశం
ఆర్టికల్ 370 రద్దు సమయంలోనూ బీజేపీ అత్యంత గోప్యత పాటించింది. ఆర్టికల్ 370 రద్దుచేస్తూ లోక్సభ, రాజ్యసభలు ఆమోదించడం.. రాష్ట్రపతి ఆమోదంతో ఆర్టికల్ 370 రద్దుచేస్తూ తక్షణమే అమల్లోకి వచ్చేలా గెజిట్ కూడా జారీచేశారు.