హైదరాబాద్, నవంబర్ 16 (నమస్తే తెలంగాణ): ఉత్పత్తిని ఎప్పుడో ప్రారంభించిన రామగుండం ఎరువులు, రసాయనాల కర్మాగారాన్ని (ఆర్ఎఫ్సీఎల్) ఇటీవల మళ్లీ ప్రారంభించి.. అదేదో తమ గొప్పతనంగా చెప్పుకొంటున్న ప్రధాని నరేంద్రమోదీ వైఖరిపై తెలంగాణ సమాజం మండిపడుతున్నది. ‘ప్రభుత్వ ఎరువుల కంపెనీల పునరుద్ధరణపై మీ చిత్తశుద్ధి ఏపాటిదో మాకు తెలుసునని’ నెటిజన్లు సోషల్మీడియాలో బీజేపీ నిజ స్వరూపాన్ని ఎండగడుతున్నారు. ఆర్ఎఫ్సీఎల్కు అవసరమైన అన్ని వసతులు తెలంగాణ ప్రభుత్వం కల్పిస్తే.. ఇప్పుడొచ్చి అంతా తామే చేశామని బీజేపీ నేతలు చెప్పుకోవటంపై వ్యంగ్యాస్ర్తాలు సంధిస్తున్నారు.
ఎనిమిదేండ్లుగా వాయిదా
నైట్రోజన్, ఫాస్పరస్, పొటాషియం వంటి ఎరువులు ఉత్పత్తి చేసే కర్మాగారాలు ఉత్తర ఆఫ్రికాలోని మొరాకోలో భారీగా ఉన్నాయి. 2000వ దశకంలో అక్కడి నుంచి భారత్ ఎరువులను దిగుమతి చేసుకొనేది. నష్టాలు వస్తున్నాయన్న కారణంతో వాజపేయి, యూపీఏ హయాంలో దేశంలోని 11 ప్రభుత్వరంగ ఎరువుల కర్మాగారాలను మూసేశారు. 2014 ఎన్నికల ప్రచారానికి ముందు ఆ కర్మాగారాలను తిరిగి ప్రారంభిస్తామని నరేంద్రమోదీ హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత రెండున్నరేండ్లపాటు వాటి జోలికి పోలేదు. పైగా గుజరాత్, ఉత్తరప్రదేశ్లో పెద్ద ఎత్తున ప్రైవేట్ ఎరువుల ఫ్యాక్టరీలు ప్రారంభించేందుకు అనుమతులిచ్చారు. మూతబడిన కర్మాగారాలను తెరిపిస్తామంటూ పార్లమెంట్ సమావేశాల్లో డెడ్లైన్లతోనే పబ్బం గడిపిన మోదీ సర్కారు.. 11 ఫ్యాక్టరీల్లో మూడింటిని మాత్రమే ప్రారంభించింది. అందులో ఒకటైన యూపీలోని హెచ్యూఆర్ఎల్-గోరఖ్పూర్ కర్మాగారాన్ని గత ఏడాది డిసెంబర్లో ప్రారంభించగా, జార్ఖండ్లోని హెచ్యూఆర్ఎల్-సింద్రీని ఈ నెల 9నే పునఃప్రారంభించింది.
నెలలో 15 రోజులే కార్యకలాపాలు
యూపీలోని హెచ్యూఆర్ఎల్-గోరఖ్పూర్ కర్మాగారం నెలలో 15 రోజులు మూతబడే ఉంటున్నది. విద్యుత్తు, నీటి సరఫరాల్లో అవాంతరాల వల్లే కారణమని కార్మిక సం ఘాల ఆరోపణ. 3 రోజుల క్రితమే ప్రారంభమైన జార్ఖండ్లోని హెచ్యూఆర్ఎల్-సింద్రీ ఎలా నడుస్తుందో ఇప్పటికిప్పుడు చెప్పలేం.
తెలంగాణ సర్కారు వల్లే..
రామగుండం ఎరువులు, రసాయనాల కర్మాగారం (ఆర్ఎఫ్సీఎల్)లో 11 శాతం వాటా కోసం రాష్ట్రప్రభుత్వం రూ.160 కోట్లకు పైగా ఈక్విటీగా చెల్లించి షేర్లు పొం దింది. రూ. 80 కోట్లతో మిషన్ భగీరథ పైపులైను వేయించి శుద్ధమైన నీటిని సరఫరా చేస్తున్నది. వెయ్యి ఎకరాల్లో నిర్మించిన ఈ పరిశ్రమ అవసరాల కోసం టీఎస్ఐపాస్ ద్వారా యూనిట్కు రూపాయి చొప్పున రాయితీ ఇచ్చింది. రూ.14 కోట్లతో విద్యుత్తు లైన్లు, రహదారులు నిర్మించింది. 2015 నుంచి ప్లాంట్లో చేపట్టిన పలు పునరుద్ధరణ పనుల కోసం రూ. 600 కోట్ల వరకు ఖర్చు చేసింది.
మోదీది అంతా అబద్ధమే
ఎరువుల కోసం గతంలో విదేశాలపై ఆధారపడేవాళ్లమని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదని రామగుండం ప్రసంగంలో మోదీ చెప్పుకొచ్చారు. ‘ఆత్మనిర్భర్ భారత్’తోనే ఇది సాధ్యమైందని తెలిపారు. కానీ, ఇప్పటికీ భారత్ ఎరువుల కోసం విదేశాలపై ఆధారపడుతూనే ఉన్నది. ఏడాదికి 25 లక్షల టన్నుల అమ్మోనియా, డీఏపీ, ఎన్పీకే ఎరువులను దిగుమతి చేసుకోవడానికి గత ఆగస్టులోనే సౌదీ అరేబియాతో కేంద్రం ఒప్పందం కుదుర్చుకొన్నది. ఈ వివరాలను కేంద్రమంత్రి మన్సుఖ్మాం డవీయానే స్వయంగా వెల్లడించారు.