Statue Of Equality | ముచ్చింతల్లో సమతామూర్తి విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర మోదీ శనివారం సాయంత్రం 6:30 గంటలకు ఆవిష్కరించారు. సమతామూర్తి విగ్రహాన్ని జాతికి అంకితం చేసిన అనంతరం మోదీ రామానుజాచార్యులకు నమస్కరించారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, చిన్నజీయర్ స్వామి, మైం హోం గ్రూప్స్ అధినేత జూపల్లి రామేశ్వర్ రావుతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
సమతామూర్తి విగ్రహావిష్కరణకు కంటే ముందు 108 దివ్య దేశాల(వైష్ణవ ఆలయాలు)ను మోదీ సందర్శించారు. ఈ సందర్భంగా మోదీకి చిన్నజీయర్ స్వామి దివ్య దేశాల విశిష్టతను వివరించారు. ఈ సాయంత్రం నిర్వహించిన విష్వక్సేనేష్టి యాగంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. యాగంలో పాల్గొన్న మోదీకి పండితులు ఆశీర్వచనం అందించారు. ఈ సందర్భంగా మోదీకి చిన్నజీయర్ స్వామి ఓ కంకణాన్ని బహుకరించారు. అనంతరం యాగశాల చుట్టూ మోదీ ప్రదక్షిణలు చేశారు. మోదీ బంగారు వర్ణం దుస్తులు ధరించి యాగానికి హాజరయ్యారు.
ముచ్చింతల్లో రూ. 1200 కోట్లతో సమతామూర్తి స్ఫూర్తి కేంద్రాన్ని 45 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించారు. ఈ కేంద్రంలో రామానుజుల భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. భద్ర వేదికపై 216 అడుగుల రామానుజుల విగ్రహం నిర్మించారు. పద్మపీఠంపై ఉన్న రామానుజుల విగ్రహం ఎత్తు 108 అడుగులు. భద్ర వేదికపైకి వెళ్లేందుకు 108 ఉజ్జీవ సోపానాలు ఏర్పాటు చేశారు. సమతామూర్తి విగ్రహం దిగువన మూడంతస్తుల నిర్మాణం చేపట్టారు. భద్ర వేదిక మొదటి అంతస్తులో రామానుజుల స్వర్ణ విగ్రహం నెలకొల్పారు. 120 ఏండ్లు రామానుజులచార్యులు జీవించారని అందుకు గుర్తుగా 120 కిలోల స్వర్ణ విగ్రహం ఏర్పాటు చేశారు. 108 అడుగుల వృత్తాకారంలో అష్టదళ పద్మాకృతిలో మ్యూజికల్ ఫౌంటేన్ నిర్మించారు. మ్యూజికల్ ఫౌంటేన్ స్థూపం ఎత్తు 36 అడుగులు కాగా, ఈ స్థూపంపై 6 అడుగుల రామానుజుల విగ్రహం ఏర్పాటు చేశారు. సమతామూర్తి విగ్రహం చుట్టూ 108 ఆలయాలు నిర్మించారు. దివ్య దేశాల పేరుతో 108 వైష్ణవ ఆలయాలను ఏర్పాటు చేశారు. సమతామూర్తి స్ఫూర్తి కేంద్రానికి ఇరువైపులా హంపీ రథాలను నెలకొల్పారు. 2 లక్షల మొక్కలతో సహస్రాబ్ది ప్రాంగణాన్ని అలంకరించారు. 2014లో సమతామూర్తి కేంద్రానికి శంకుస్థాపన చేసి, ఆరేండ్లలో పూర్తి చేశారు.