హైదరాబాద్, ఆగస్టు 11 (నమస్తే తెలంగాణ): దళితులకు రక్షణ కల్పించడంలో కేంద్రంలోని మోదీ ప్రభుత్వం విఫలమైందని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి బీ వెంకట్ ఆగ్రహం వ్యక్తంచేశారు. దేశవ్యాప్తంగా దళితులపై దాడులు, హత్యలు, లైంగికదాడులు, నగ్న ఊరేగింపులు పెరిగాయని విమర్శించారు. రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్లు సైతం అమలు కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ నేపథ్యంలో ‘రిజర్వేషన్లు- దళిత ఎజెండా’ అనే అంశంపై ఈ నెల 26, 27 తేదీల్లో హైదరాబాద్లోని టూరిజం ప్లాజాలో జాతీయ స్థాయి సదస్సు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. శుక్రవారం ఆయన ఢిల్లీలోని తెలంగాణభవన్లో మీడియాతో మాట్లాడుతూ.. ఈ సదస్సుకు వందకుపైగా దళిత సంస్థలకు చెందిన 300 మంది ప్రతినిధులు హాజరవుతారని చెప్పారు. యూజీసీ మాజీ చైర్మన్ ధరూర్, సీనియర్ మాజీ ఐఏఎస్ అధికారి రాజశేఖర్ నేతృత్వంలో దళిత ఎజెండా కీ నోట్ రూపొందించి జాతీయ కన్వెన్షన్ ముందు ఉంచుతారని చెప్పారు. రాజ్యాంగ పరిరక్షణ కోసం విశాల ఉద్యమాల రూపకల్పనకు కార్యాచరణను రూపొందిస్తామని చెప్పారు. సమావేశంలో మల్లేపల్లి లక్ష్మయ్య (సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్), రామచంద్ర డోమ్ (దళిత్ శోషణ్ ముక్తిమంచ్) తదితరులు పాల్గొన్నారు.