మీ తెలంగాణ పర్యటన వెనుక అంతరార్థం ఏమిటి? మాకు (తెలంగాణకు) ఏమైనా ఇవ్వడానికి వస్తున్నారా?
లేక నిస్సిగ్గుగా బయటపడిన ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారాన్ని ఏమార్చడానికి వస్తున్నారా?
ఇప్పటికే పని మొదలుపెట్టిన ఫ్యాక్టరీని జాతికి అంకితం చేస్తున్నామన్న మిషతో తెలంగాణకు మీ రాక వెనుక మతలబేంటి? మీ పర్యటన ఎవరికోసం? ఎందుకోసం? అసలు ఉపయోగమేంటి?
మాయమాటలు చెప్పి మాయమవడం మీ సహజ నైజం! నాడు అమరావతికి వచ్చి.. పిడికెడు మట్టి, చెంబెడు నీళ్లిచ్చిపోయారు.. అంతకుమించి ఏం చేశారు?
తెలంగాణలో కోమటిబండ దగ్గర మిషన్ భగీరథను నల్లా తిప్పి మొదలుపెట్టి.. పోచికోలు ముచ్చట్లు పెట్టిపోయారు. అంతకుమించి ఏం చేశారు?
మొన్నటికి మొన్న హైదరాబాద్లో మెగా టెక్స్టైల్ పార్కు పెడుతున్నట్టు ఊదరగొట్టారు.. అంతకుమించి ఏం చేశారు?
మీరు ప్రధాని అయి ఎనిమిది ఏండ్లయింది. గుజరాత్కు తప్ప ఏ ఇతర రాష్ర్టానికైనా మేలు చేసిన గొప్పమనసు మీకు ఉన్నదా ?
రోజుల వ్యవధిలో గుజరాత్కు లక్షల కోట్లు మంజూరు చేసిన మీరు దేశమంతటికీ ప్రధాని అన్న మాట మరిచారా?
తెలంగాణ విభజన హామీలు ఏమయ్యాయని ఇక్కడి సమాజం నిలదీస్తున్నది.
తెలంగాణ ప్రగతిని ఆర్థిక ఆంక్షలతో, అస్థిరతతో అణచివేయాలన్న మీ కుట్రలపై ఆగ్రహం వ్యక్తంచేస్తున్నది.
తెలంగాణను మసిపూసి మారేడు కాయ చేయడం కోసమే మీరొస్తున్నారని సబ్బండవర్ణాలూ ముక్తకంఠంతో ఘోషిస్తున్నాయి. ఇంకెక్కడైనా మీ ఈ నాటక ప్రదర్శనను జనం నమ్మవచ్చేమో. కానీ… ఇది తెలంగాణ సమాజం..
మీ నాటకాన్ని ఇప్పటికే చాలాసార్లు చూసింది! మా ప్రజలకు మీపై ఎలాంటి భ్రమలూ లేవు.
మీకేమైనా ఉంటే తొలగించుకోండి. తెలంగాణ సమాజం మిమ్మల్ని సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నది!
ప్రధాని మోదీ.. నాటకం బట్టబయలైన తరుణంలో మీరు తెలంగాణకు ఎలా వస్తారు? ఏమని వస్తారు?
వచ్చేందుకు మీకు నైతిక అర్హత ఏది? ప్రియమైన మోదీ..
1. బీసీలు
నేను బీసీ బిడ్డనని గొప్పలు చెప్పుకొంటారు. దేశంలో బీసీ ప్రజలు ఎంతమంది ఉన్నారో లెక్కించడానికి మీకు ఉన్న అభ్యంతరం ఏమిటి? తామెంత మంది ఉన్నామో లెక్క తెలియని బీసీలు అడుగుతున్న ప్రశ్న ఇది!
2. ఉద్యోగులు
ఆదాయం పన్ను పరిమితిని పెంచాలని ఎనిమిదేండ్లుగా ఉద్యోగ సంఘాలు మొరపెట్టుకోని సందర్భం లేదు. కనీస పరిమితిని పది లక్షలకు పెంచాలన్న వేతన జీవుల విజ్ఞప్తి.. మీకు వినిపించనైనా లేదా?
ట్యాక్సులు కట్టుకుంటూ పోగామిగిలిన జీతాన్ని లెక్కేసుకుంటున్న ఉద్యోగుల గోస ఇది!
3. బొగ్గుగని కార్మికులు
సిరులు కురిపిస్తున్న సింగరేణిపైనా విషం చిమ్ముతున్నారు. సంస్థను నష్టాల్లోకి పంపి ప్రైవేటుకు అప్పగించాలని కుట్ర చేస్తున్నారు. బొగ్గు బ్లాకులను ప్రైవేటుకు అప్పగించి.. 1.75 లక్షల కోట్లు కొల్లగొట్టాలని చూడటం మీ ైస్టెల్కు కొలమానమా?
తెలంగాణ సిరుల తల్లి సింగరేణిని ఉరికంబమెక్కిస్తున్న తీరును నిరసిస్తూ బొగ్గు కార్మికుడు అడుగుతున్న ప్రశ్న ఇది!
4. నేతన్నలు
ఏడున్నర దశాబ్దాల స్వతంత్ర భారతంలో ఏ ప్రధానమంత్రి కూడా చేపట్టని చర్య..
చేనేతపై జీఎస్టీ విధింపు! అది మీరు చేశారు. ఇది చేనేత వృత్తిని దెబ్బతీయడం కాదా?
ఇది సాంచలాడినా పూటగడవని నేతన్నలు అడుగుతున్న ప్రశ్న
5. గృహిణులు
మీరు అధికారంలోకి వచ్చేనాటికి వంట గ్యాస్ ధర రూ.400, ఎనిమిదేండ్లలో మీరు పెంచిన ధర రూ.1200 అకారణంగా, అసాధారణంగా గ్యాస్ ధర పెంపునకు మీరు ఇచ్చే సమాధానమేంటి?
ఇది వంటింట్లో మంట పుట్టించిన గ్యాస్బండ ధర భరించలేని సగటు గృహిణుల ప్రశ్న
6. వినియోగదారులు
మీరు అధికారంలోకి వచ్చేనాటికి ముడి చమురు ధర బ్యారెల్కు 108 డాలర్లు.. ఈ ఏడాది ఏప్రిల్ నాటికి 100 డాలర్లు. మీరు అధికారంలోకి వచ్చిన్నాడు పెట్రోలు లీటరు ధర రూ.71.. ఇప్పుడు అదే పెట్రోలు రూ.110. ముడి చమురు ధర పెరుగకపోయినా పెట్రో ధరలు అడ్డగోలుగా పెంచడంపై మీ జవాబేమిటి?
రోజు రోజుకూ పెరుగుతున్న పెట్రోధరలు భరించలేని వినియోగదారులు ముక్తకంఠంతో అడుగుతున్న ప్రశ్న
7. దళితులు
అధికారంలోకి వస్తే వంద రోజుల్లో ఎస్సీ వర్గీకరణ చేస్తామని 2014 ఎన్నికల్లోనే వాగ్దానం చేశారు.
మీరు అధికారంలోకి వచ్చి ఎనిమిదేండ్లయింది. ఇప్పటివరకూ ఆ వాగ్దానం మాటే ఎత్తలేదు?
ఏ, బీ, సీ, డీ క్యాటగిరీలుగా ఎస్సీలను వర్గీకరించాలని దశాబ్దాలుగా మొత్తుకుంటున్న దళితుల ఆగ్రహం ఇది!
8. యువత
యూనివర్సిటీల్లో కామన్ రిక్రూట్మెంట్ బోర్డు కోసం బిల్లును ఆమోదించడానికి మీ ఆదేశాల మేరకు గవర్నర్ మోకాలడ్డుతున్నారు. వర్సిటీల్లో విద్యార్థుల భవిష్యత్తుతో మీరాడుతున్న చెలగాటం ఎటు దారి తీస్తుంది?
ఇది ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న పట్టభద్రులైన యువత మదిలో సందేహం!
9. విద్యుత్తు సిబ్బంది
విద్యుత్తు వ్యవస్థలను ప్రైవేటుకు అప్పనంగా అప్పజెప్పడానికి సంస్కరణల పేరుతో కుట్ర చేస్తున్నారు. డిస్కంలను దివాలా దిశగా నెడుతున్నారు? ఎవరి ప్రయోజనాలకోసం ఇదంతా చేస్తున్నారు?
కేంద్ర ప్రభుత్వ చర్యతో రోడ్డున పడబోతున్న 27 లక్షల మంది విద్యుత్తు ఉద్యోగులు సంధిస్తున్న ప్రశ్నాస్త్రం ఇది!
10. గిరిజనులు
రిజర్వేషన్లు 50 శాతం దాటొచ్చని సుప్రీంకోర్టే తాజాగా తేల్చిచెప్పింది. తెలంగాణలో గిరిజనులకు రిజర్వేషన్లు పెంచాలని తెలంగాణ అసెంబ్లీ పంపించిన తీర్మానాన్ని ఇంకెంతకాలం తొక్కిపెడతారు? గిరిజనులపై మీకున్న ప్రేమ ఇదేనా?
కొండకోనల్లో ఉంటూ తమ బిడ్డలైనా మెరుగైన జీవితం పొందాలని కలగనే అమాయక ఆదివాసులు
అడుగుతున్న ప్రశ్న ఇది!
హైదరాబాద్, నవంబర్ 8 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వం అంటే ప్రజలకు మేలు చేయాలి. పాలకుడు తనను నమ్మిన ఓటర్లకు న్యాయం చేయాలి. కానీ.. ప్రధాని మోదీకి, బీజేపీ ప్రభుత్వానికి ప్రజల రక్తాన్ని పీల్చడం మాత్రమే తెలుసు. ఎనిమిదేండ్ల పాలనను చూస్తే ఇది స్పష్టంగా అర్థమవుతుంది. మోదీ పాలనలో దేశంలోని కొందరు కార్పొరేట్లు మినహా ఏ ఒక్క వర్గం కూడా ప్రశాంతంగా లేదు. పెట్రోల్, డీజిల్ ధరలు పెంచి సామాన్యుడి నడ్డి విరిస్తే.. నిత్యావసరాల ధరలు 300% పెంచి వంటింట్లో కుంపటి పెట్టారు. వర్గీకరణ చేస్తామని చెప్పి దళితులను నమ్మించి మోసం చేశారు. ఎస్టీలకు రిజర్వేషన్ పెంచకుండా అన్యాయం చేస్తున్నారు. తాను బీసీనని చెప్పుకుంటూ దొంగ డ్రామాలు ఆడే మోదీ.. కనీసం కులగణన చేయకుండా బీసీలకు తీరని అన్యాయం చేస్తున్నారు. చేనేతపై జీఎస్టీ పిడుగు వేశారు. ఓవైపు ఉద్యోగులకు ఆదాయ పన్ను ఊరటను అందరాని ద్రాక్షగా మార్చుతూ.. విద్యుత్ రంగ ప్రైవేటీకరణతో 27 లక్షల కుటుంబాలను రోడ్డుమీద పడేసే కుట్రకు తెరలేపారు. మహిళల బాధలు అర్థం కావు, విద్యార్థుల గోడు విన్న పాపాన పోలేదు. ఇలా దేశంలోని సబ్బండ వర్ణాలపై పగబట్టినట్టు పాలన చేస్తున్న మోదీ.. ఇప్పుడు తెలంగాణకు వస్తున్నారు. దీంతో రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ ‘ఏం ఒరగబెట్టావని వస్తున్నావ్ మోదీ?’ అంటూ నిలదీస్తున్నారు.
బీసీ గణన చేయరు.. మంత్రిని పెట్టరు
‘నేను బీసీ బిడ్డను’ అని మోదీ చెప్పుకొంటారు.. కానీ.. బీసీల కోసం ఏం చేశారంటే.. ఎనిమిదేండ్లలో ఒక్కటీ కనపడదు. ఇన్నేండ్లుగా బీసీలకు తీవ్ర అన్యాయం చేస్తూనే ఉన్నారు. విద్య, ఉద్యోగాలు, పదవుల్లో దామాషా ప్రకారం బీసీలకు, ఉప కులాలకు న్యాయమైన వాటా దక్కడం లేదన్న వాదన ఎప్పటినుంచో ఉన్నది. చివరిసారిగా 1931లో ఆంగ్లేయులు కులగణన చేయించారు. అంటే.. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఇప్పటివరకు బీసీలకు సంబంధించి శాస్త్రీయమైన గణన, సమగ్ర సమాచారం లేదు. అందుకే అందుకే బీసీ జనగణన చేపట్టాలని దేశవ్యాప్తంగా బీసీలు డిమాండ్ చేస్తున్నారు. 2011 జనాభా లెక్కల సందర్భంగా 2010లో అప్పటి మన్మోహన్సింగ్ ప్రభుత్వం సోషియో,ఎకనమిక్ సర్వే నిర్వహించింది. కులాలవారీ లెక్కలు తీయాలని నిర్ణయించింది. అప్పట్లో ప్రతిపక్ష నేతగా ఉన్న సుష్మాస్వరాజ్ కూడా అంగీకరించారు. తర్వాత ప్రతిపాదన మూలనపడింది.
2014లో మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత ‘నేనూ బీసీనే’ అని చెప్పుకోవడంతో దేశవ్యాప్తంగా బీసీలు తమ కలలు నెరవేరుతాయని ఆశపడ్డారు. కానీ.. ఎనిమిదేండ్లుగా నిరాశే ఎదురవుతున్నది. బీసీ సంఘాలు అనేకసార్లు విజ్ఞప్తిచేసినా పెడచెవిన పెట్టింది. పైగా దానిని ఎన్నికలకు ముందు అవకాశంగా వాడుకొన్నది. గత సార్వత్రిక ఎన్నికలకు ముందు 2018లో బీసీ కులగణనకు బీజేపీ ప్రభుత్వం ఒప్పుకొన్నది. ఎన్నికల్లో లబ్ధి పొందింది. తీరా రెండోసారి అధికారంలోకి వచ్చాక మోదీ మళ్లీ తన నైజాన్ని బయటపెట్టారు. బీసీ కులగణన చేయాలని తెలంగాణ సహా ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, బీహార్, ఒడిశా, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ తదితర 8 రాష్ర్టాలు తీర్మానం చేశాయి. మండల్ కమిషన్తోపాటు సుప్రీంకోర్టు, పలు రాష్ర్టాల హైకోర్టులు సైతం బీసీ కులగణనకు అనుకూలంగా తీర్పులు వెలువరించాయి. అయినా కేంద్రంలోని బీజేపీ సర్కారు దీన్ని పట్టించుకోవడం లేదు. బీసీల అభివృద్ధి కోసం కేంద్రంలో బీసీ మంత్రిత్వశాఖనైనా ఏర్పాటు చేయాలని కొన్నేండ్లుగా డిమాండ్ చేస్తున్నా.. కనీసం ఆ మాట వినే ఓపిక కూడా ప్రధానికి లేకుండా పోయింది. ‘బీజేపీలో ఓబీసీ మోర్చా ఉం డొచ్చు కానీ.. కేంద్రంలో బీసీ మంత్రిత్వ శాఖ ఉండొద్దా’ అని తెలంగాణ మొదటి నుంచీ నిలదీస్తున్నా, మోదీకి చీమ కుట్టినట్టు లేదు.
ఎస్సీ వర్గీకరణ.. 8ఏండ్ల అన్యాయం
‘మేం అధికారంలోకి వస్తే 100 రోజుల్లోనే ఎస్సీ వర్గీకరణ చేస్తాం’.. 2014 ఎన్నికల సమయంలో బీజేపీ చేసిన ప్రకటన. 100 రోజులు కాదు.. ఇప్పటికి ఎనిమిదేండ్లు గడిచింది. మోదీ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ గురించి పట్టించుకోకుండా దళితులకు రోజూ అన్యా యం చేస్తున్నది. ఉమ్మడి రాష్ట్రంలో 2000 నుంచి 2004 వరకు నాలుగేండ్లపాటు ఎస్సీ వర్గీకరణ అమలులో ఉన్నది. ఆ తర్వాత నాటి యూపీఏ ప్రభుత్వం దానికి మోకాలడ్డింది. వర్గీకరణను రద్దు చేసింది. యూపీఏ ప్రభుత్వం ఎస్సీ వర్గాలకు తీరని అన్యాయం చేసిందని, తాము అధికారంలోకి వస్తే 100 రోజుల్లోనే ఎస్సీ వర్గీకరణకు ఆమోద ముద్ర వేస్తామని 2014 ఎన్నికల సమయంలో బీజేపీ బీరాలు పలికింది. ఎనిమిదేండ్లయినా అతీగతీ లేదు. ఎస్సీ వర్గాలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం అనేక పర్యాయాలు కేంద్రాన్ని కోరింది. వర్గీకరణ చేయాలని రాష్ట్ర అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్రానికి నివేదించింది. 2016 మే 10న ముఖ్యమంత్రి కేసీఆర్, నాటి ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరిని వెంటబెట్టుకొని ప్రధాని మోదీని కలిశారు. వర్గీకరణ చేయాలని వినతిపత్రం అందజేశారు. న్యాయం చేయాలని విన్నవించారు. అయినా మోదీలో ఇప్పటికీ ఉలుకూపలుకూ లేదు.
విద్యుత్తు ఉద్యోగులు రోడ్డుపాలు
దేశవ్యాప్తంగా ఉన్న లక్షల మంది విద్యుత్తు ఉద్యోగులు దశాబ్దాలపాటు శ్రమించి నిర్మించిన విద్యుత్తు సరఫరా వ్యవస్థను అప్పనంగా ప్రైవేట్కు అప్పగించాలని మోదీ కంకణం కట్టుకున్నారు. ప్రభుత్వ వ్యవస్థను నేరుగా ప్రైవేట్కు అప్పగిస్తే ప్రజలు తిరగబడతారు. అందుకే.. తెలివిగా మెల్లిగా ప్రైవేట్ పంపిణీదారులను రంగంలోకి దింపి, కచ్చితంగా వారి విద్యుత్తునే కొనేలా నిబంధనలు పెట్టి, ప్రజలను ప్రలోభ పెట్టి, డిస్కంలను దివాలా తీయించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు. తద్వారా ప్రభుత్వ విద్యుత్తు రంగంలో పనిచేస్తున్న సుమారు 27 లక్షల కుటుంబాలను రోడ్డున పడేసే కుట్రకు తెరలేపారు. ఉత్పత్తి, పంపిణీ, కొనుగోలు అంశాల్లో ప్రభుత్వ రంగంపై గొడ్డలిపెట్టులాంటి నిర్ణయాలు తీసుకొన్నారు.
రాష్ర్టాలు రెన్యువల్ పవర్ పర్చేజ్ ఆబ్లిగేషన్లో భాగంగా గాలి, సౌర విద్యుత్తును ఎంత కొనాలో, ఎంత ధరకు కొనాలో కేంద్రమే నిర్ణయిస్తుంది. దానిని వాడకుంటే ఫైన్ వేస్తుంది. అంటే.. బలవంతంగా ప్రభుత్వ విద్యుత్తు కేంద్రాల్లో ఉత్పత్తిని తగ్గించుకోవాల్సి వస్తుంది. విద్యుత్తు పంపిణీ కనిష్ట, గరిష్ఠ విద్యుత్తు చార్జీలను రాష్ర్టాల ఈఆర్సీలే నిర్ణయిస్తాయి. కానీ కొత్త విధానంలో విద్యుత్తు టారిఫ్, మీటరింగ్పై పూర్తి అధికారం సెంట్రల్ ఈఆర్సీకే ఉంటుంది. కస్టమర్కు ఇప్పటివరకు ప్రభుత్వ సరఫరా వ్యవస్థ ద్వారానే విద్యుత్తు అందుతున్నది. ఇప్పుడు చాయిస్ టూ కన్జూమర్స్ విధానంలో వినియోగదారుడు నచ్చిన డిస్కంను ఎంపిక చేసుకొనే అవకాశం రానున్నది. దీంతో ప్రైవేట్ సంస్థలు మొదట్లో ఆకట్టుకోవడానికి ఆఫర్లు ఇస్తాయి. ఈ పోటీ తట్టుకోలేక ప్రభుత్వ డిస్కంలు దివాలా తీసి మూతబడతాయి. ఆ తర్వాత ప్రైవేట్ సంస్థలు ఇష్టారాజ్యంగా ధరలు నిర్ణయించి ప్రజల నడ్డి విరుస్తాయి. అదే సమయంలో క్రాస్ సబ్సిడీని ఎత్తివేసేలా వ్యూహం పన్నారు. అలాగే స్మార్ట్మీటర్ల పేరుతో వ్యవసాయ మోటర్లకు కూడా మీటర్లు పెట్టి.. రైతన్నల నుంచి రూ.వేల బిల్లులను వసూలుకు రంగం సిద్ధంచేశారు. ఈ విధానాలను ఉపసంహరించుకోవాలని దేశవ్యాప్తంగా ఉన్న 27 లక్షల కుటుంబాలు డిమాండ్ చేస్తున్నాయి.
చేనేత కార్మికుల ఉసురు పోసుకొంటున్న మోదీ
కునారిల్లుతున్న చేనేత రంగాన్ని చేయిచ్చి ఆదుకోవాల్సింది పోయి.. గొంతు పిసికే చర్యలకు మోదీ తెగబడ్డారు. మోదీకి ముందు పాలించిన ప్రధానులు చేనేత రంగాన్ని మానవతా కోణంలోనే చూశారు. పన్ను భారం వేయకుండా.. రాయితీలు ఇచ్చి ప్రోత్సహించారు. కానీ ప్రధాని మోదీ మాత్రం చేనేతకు గొడ్డలిపెట్టుగా మారారు. 5 శాతం జీఎస్టీ విధించారు.
2017 జూన్ 11న జరిగిన జీఎస్టీ కౌన్సిల్లో చేనేతపై పన్నును ప్రతిపాదించగా, తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకించింది. నాడు సీఎం కేసీఆర్ ప్రధానికి, కేంద్ర మంత్రులకు లేఖలు రాశారు. టీఆర్ఎస్ ప్లీనరీలోనూ తీర్మానం చేశారు. అయినా కేంద్రం వెనక్కి తగ్గలేదు. తనకున్న బలాన్ని ఉపయోగించి.. 2017 జూలై 1 నుంచి అమల్లోకి తెచ్చింది. అంతేకాదు.. ఈ ఏడాది జనవరిలో మరో ఘోరానికి తెరలేపారు. జీఎస్టీని 12 శాతానికి పెంచాలని ప్రతిపాదించారు. దీనిపై తెలంగాణ భగ్గుమన్నది. జీఎస్టీ పెంచడం కాదు.. పూర్తిగా ఎత్తివేయాలని డిమాండ్ చేసింది. ‘జీరో జీఎస్టీ’ నినాదంతో ప్రజా ఉద్యమం మొదలుపెట్టింది. తెలంగాణ స్ఫూర్తిగా అనేక రాష్ర్టాలు ‘జీరో జీఎస్టీ’ నినాదాన్ని అందుకొన్నాయి. ఇటీవల రాష్ట్ర టెక్స్టైల్ శాఖ మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న నేతన్నలు ప్రధాని మోదీకి ‘పోస్ట్కార్డ్’ ఉద్యమం మొదలుపెట్టారు. అయినా కేంద్రం వారి మొర ఆలకింలేదు. ఇప్పటికైనా ఆ పాపాన్ని కడిగేసుకొని పవిత్రంగా తెలంగాణలో అడుగుపెట్టాలని నేత కార్మికులు డిమాండ్ చేస్తున్నారు.
ఈ ఎనిమిదేండ్లలో మోదీ ప్రభుత్వ అసమర్థ విధానాలు, పన్నుల బాదుడు ఫలితంగా నిత్యావసరాల ధరలు 300 శాతం పెరి గాయి. అంటే 2014కు ముందు రూ.వెయ్యితో ఇల్లు గడిస్తే.. ఇప్పుడు రూ.3 వేల దాకా ఖర్చు చేయాల్సిన పరిస్థితి. దీంతో వంటిల్లు భగ్గుమంటున్నది.
పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను విచ్చలవిడిగా పెంచడం వల్ల రవాణ చార్జీలు పెరిగి.. ప్రతి ఒక్క సరుకు ధర ఆకాశానికి అంటింది. దీంతో సగటు జీవి సేవింగ్స్ హారతి కర్పూరంలా కరిగిపోతున్నాయి. నెలజీతం సరిపోక.. ప్రతినెల అప్పులు చేస్తున్నవారు అత్యధికులు ఉన్నారు. ధరల పెరుగుదల భరించలేక పోషకాహారానికి దూరమవుతున్న వారు కోట్లలో ఉన్నారు. అందుబాటు ధరలో పోషకాలు అందించే పప్పులనూ మోదీ వదల్లేదు. ఈ ఎనిమిదేండ్లలో కందిపప్పు ధర 140 శాతం పెరిగితే, మినప పప్పు ధర 231 శాతం పెరిగింది. శనగపప్పు ధర ఏకంగా 200 శాతం పెరిగింది. బియ్యం రేట్లు డబుల్ అయ్యాయి. చింతపండు ధరకు రెక్కలొచ్చాయి. గోధుమపిండి.. పాలు.. ఇలా రోజూవాడే వస్తువులన్నింటి ధరల మంటతో వంటిండ్లు కుంపట్లుగా మారాయి. మేం అధికారంలోకి వస్తే పెట్రోల్ దర సగానికి తగ్గిస్తాం.. తద్వారా నిత్యావసరాల ధరలన్నీ తగ్గుతాయని 2014కు ముందు మోదీ, బీజేపీ ఊదరగొట్టారు. ఇప్పుడు ఈ ధరాభారం నుంచి మాకు ఊరట కల్పించేది ఎన్నడు? అని దేశంలోని ప్రతి ఒక్కరూ అడిగే స్థితికి దిగజారింది.
యూనివర్సిటీల్లో రిక్రూట్మెంట్ అంటేనే ఓ తేనెతుట్టె వ్యవహారంగా మారింది. ఫిర్యాదులు, ఆరోపణలు, కోర్టు కేసులు.. ఇలా ఎన్నో చికాకులు. వీటికితోడు నిబంధనల ప్రకారం ఒక్కో అభ్యర్థిని కనీసం అరగంట ఇంటర్వ్యూ చేయాల్సి వస్తున్నది. రోజుల తరబడి సమయం వృథా అవుతున్నది. ఇంత చేశాక.. ఒక వర్సిటీలో నియామకమైన వ్యక్తి మరో వర్సిటీలో అవకాశం వచ్చి చేరితే అప్పటివరకు చేసిన ప్రక్రియంతా వృథా అయినట్టే.
ఆ స్థానంలో మళ్లీ కొత్తగా నియామకాలు చేపట్టాల్సి వస్తున్నది. దీంతో నియామకాలు ఏండ్లపాటు నిలిచిపోతున్నాయి. విద్యార్థులకు సరైన విద్య అందటం లేదు. వర్సిటీల్లో ప్రమాణాలు పడిపోతున్నాయి. వీటన్నింటికీ పరిష్కారం ‘యూనివర్సిటీస్ కామన్ రిక్రూట్మెంట్’. రాష్ట్రంలో 15 యూనివర్సిటీలు ఉన్నాయి. వీటన్నింటికీ కలిపి ఒకే పరీక్ష ద్వారా బోధన, బోధనేతర పోస్టులను భర్తీచేయాలని ప్రభుత్వం భావించింది. వీటిల్లో 3,500లకు పైగా ఖాళీలను ప్రభుత్వం గుర్తించింది. వర్సిటీలు, పోస్టుల వారీగా ఖాళీలను సిద్ధంచేసింది. వాటిని ఒకేసారి భర్తీ చేసేందుకు వీలుగా.. ‘ది తెలంగాణ యూనివర్సిటీస్ కామన్ రిక్రూట్మెంట్ బోర్డు బిల్లు’ను రెండు నెలల కిందటే అసెంబ్లీ ఆమోదించింది. దీనిని గవర్నర్ పెండింగ్లో పెట్టారు. రెండు నెలలు దాటుతున్నా ఎటూ తేల్చడం లేదు. అడిగితే ‘యూజీసీ’ నిబంధనలు అడ్డుగా ఉన్నాయని చెప్తున్నట్టు తెలిసింది. యూనివర్సిటీలు సొంతంగా రిక్రూట్మెంట్ చేసుకొనే వెసులుబాటు యూజీసీ కల్పించింది. దీనిని మార్చాలని అనేక రాష్ర్టాలు కేంద్రాన్ని కోరుతున్నాయి. ఇప్పటికే బీహార్లో కామన్ రిక్రూట్మెంట్ బోర్డు నడుస్తున్నది. తెలంగాణ ప్రయత్నిస్తున్నది. ఇలాగే అన్ని రాష్ర్టాలు కామన్ బోర్డు ఏర్పాటు చేసుకొనేలా ఆదేశాలివ్వాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అయినా మోదీ గవర్నర్ పట్టించుకోవడం లేదు. దీంతో నియామకాలు జరుగక విద్యార్థుల భవిష్యత్తు ఆగం అవుతున్నది.
సిరుల సింగరేణిపై మోదీ విషపు పడగ
సిరులు కురిపిస్తున్న ప్రభుత్వ రంగ సంస్థ సింగరేణిపై కేంద్ర ప్రభుత్వం విషం కక్కుతున్నది. ప్రభుత్వ రంగ సంస్థలను బలవంతంగా నష్టాల్లోకి పంపి, ప్రైవేట్కు అప్పగించడం మోదీ ైస్టెల్. ఇదే తరహాలో దేశంలో 500 బొగ్గు బ్లాక్లను ప్రైవేటు పరం చేసి రూ.1.75 లక్షల కోట్లు కొల్లగొట్టాలని మోదీ చూస్తున్నారు. ఇప్పుడు కన్ను సింగరేణిపై పడింది. సింగరేణి సంస్థ రూ.వందల కోట్ల లాభాల్లో నడవటం కండ్ల మంటగా మారింది. దాని నడ్డి విరిచి, ప్రైవేట్పరం చేసేందుకు కుట్ర మొదలు పెట్టారు. ఇందులో భాగంగా తొలి దశలో శ్రావణ్పల్లి, కేకే 6, సత్తుపల్లి, కోయగూడెం బ్లాక్లను కేంద్రం వేలానికి పిలిచింది. నాలుగు బ్లాక్లను ప్రైవేట్ పరం చేసేందుకు ప్రయత్నించింది. ఇప్పటికే ఇందులో ఒకటి వేలానికి వెళ్లింది. మిగతావి అమ్మకానికి సిద్ధంగా ఉన్నాయి. అలాగే విదేశీ బొగ్గును 10 శాతం కొనాలనే నిబంధనను విధించి.. స్థానిక బొగ్గును తగ్గించే ప్రయత్నం చేస్తున్నది. దీనిపై యావత్ సింగరేణి కార్మిక లోకం మండిపడుతుంది. ఉవ్వెత్తున ఉద్యమించేందుకు సిద్ధమవుతున్నది.
వాహనదారులపై పగబట్టాడు
బీజేపీ అధికారంలోకి వస్తే పెట్రోల్, డీజిల్ను రూ.35-40 మధ్యే ప్రజలకు అందిస్తాం’ 2014 ఎన్నికలకు ముందు బీజేపీ నేతలు చేసిన ప్రచారమిది. అప్పుడు పెట్రోల్ ధర సుమారు రూ.71, డీజిల్ ధర రూ.55. కానీ.. అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచీ మోదీ దేశంలోని వాహనదారులందరిపై పగబట్టారు.
పెట్రోల్, డీజిల్ ధరలను ఇష్టమొచ్చినట్టు పెంచుతూనే ఉన్నారు. దేశ చరిత్రలోనే మొదటిసారి మోదీ హయాంలో పెట్రోల్, డీజిల్ ధరలు సెంచరీ కొట్టాయి. పెట్రోల్పై రూ.40, డీజిల్పై రూ.50 వరకు పెంచాడు. వాహనదారుల భారం రెట్టింపు అయ్యింది. ఒకప్పుడు ఆఫీస్కు వెళ్లి వచ్చేందుకు రూ.వెయ్యి పెట్రోల్ సరిపోయే సగటు ఉద్యోగి.. ఇప్పుడు రూ.2 వేలకు పైగా వెచ్చించాల్సి వస్తున్నది. ముడి చమురు ధర తగ్గినా.. ధర తగ్గించకుండా దేశ ప్రజలందరి జీవితాలపై దెబ్బకొడుతూనే ఉన్నాడు. నేరుగా ఎక్సైజ్ డ్యూటీ పెంచితే వచ్చే ఆదాయంలో రాష్ర్టాలకు వాటా ఇవ్వాల్సి వస్తుందనే ఉద్దేశంతో ‘సెస్సు’ల పేరుతో పన్నులు బాదుతున్నారు. ఎనిమిదేండ్లలో డీజిల్పై 512 శాతం పన్ను పెరగగా, పెట్రోల్పై 194 శాతం పెంచారు. వాహనదారుల నుంచి రూ.లక్షల కోట్లు అడ్డదారిన వసూలుచేసి ఖజానా నింపుకుంటున్నారు. వీటిని కార్పొరేట్ దోస్తులకు పంచిపెడుతున్నారు. పైగా.. ఇటీవల కేరళ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో తాము గెలిస్తే పెట్రోల్ రూ.60 కే లీటర్ అందిస్తామని నిస్సిగ్గుగా ప్రచారం చేసుకున్నారు. ఇది దేశ ప్రజలందరినీ అవమానించడమే.
చేతిలో పని.. అయినా మనసొప్పదు
గిరిజనులకు న్యాయం దక్కాలంటే జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లు కల్పించడం ఒక్కటే మార్గం. తద్వారా వెనుకబడిన వర్గాల వారు అభివృద్ధిలోకి వచ్చే అవకాశం ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం ఒక్క జీవోతో రిజర్వేషన్లను పెంచేందుకు అవకాశం ఉంటుంది. రెండు రోజుల కిందట సుప్రీంకోర్టు సైతం రిజర్వేషన్లు 50% దాటొచ్చని చెప్పింది. అంటే ప్రజల అవసరాన్ని బట్టి మార్చుకోవచ్చు.
ఎస్టీలకు రిజర్వేషన్ల పెంపు కేంద్రం చేతిలో పనే అయినా.. మోదీకి మనసొప్పదు. ఉమ్మడి రాష్ట్రంలో గిరిజనులు 7.11% ఉండగా, తెలంగాణలో 9.08%కి పెరిగింది. జనాభా దామాషాకు అనుగుణంగా గిరిజనుల రిజర్వేషన్ పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం 2017, ఏప్రిల్ 16న ఎస్టీ రిజర్వేషన్ల పెంపు కోసం అసెంబ్లీ తీర్మానం చేసి ఏకగ్రీవంగా ఆమోదించింది. తీర్మానాన్ని కేంద్ర హోం, గిరిజన సంక్షేమశాఖకు పలుమార్లు నివేదించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా 2018 ఆగస్టు 4న కేంద్రానికి లేఖ రాశారు. 2019 అక్టోబర్ 4న ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధానమంత్రికి మరొకసారి లేఖ రాశారు. ఎస్టీ రిజర్వేషన్ పెంపును కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని లేఖలు రాసినా కేంద్రం స్పందించలేదు. అయితే కేంద్రం పట్టించుకోకపోయినా రాష్ట్రంలోని గిరిజన బిడ్డలకు తామిచ్చిన హామీని నిలబెట్టుకొని తన చిత్తశుద్ధిని చాటుకోవటానికి సీఎం కేసీఆర్ ఇటీవల (సెప్టెంబర్ 30న) ఎస్టీలకు విద్యా, ఉద్యోగ రంగాల్లో 10 శాతం రిజర్వేషన్ పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.
స్లాబ్ పెంపు.. ఏటా ఎదురుచూపు
‘అయ్యా.. మీ అసంబద్ధ పన్ను విధానాల వల్ల మేము ఏటా నెల నుంచి రెండు నెలల జీతాన్ని పన్ను రూపంలో కట్టాల్సి వస్తున్నది. ఏడాదంతా కష్టపడ్డా.. 10 నెలల జీతంతోనే బతుకుతున్నం. మాకు ఆదాయ పన్ను పరిమితిని రూ.10 లక్షలకు పెంచి కాస్త ఊరట కల్పించండి’.. ఇదీ దేశంలోని ప్రభుత్వ ఉద్యోగి విన్నపం.
ఉద్యోగుల ఆదాయపు పన్ను మినహాయింపును రూ.2.5 లక్షలకే పరిమితం చేశారు. రూ.4 లక్షల వరకు 10% పన్ను విధిస్తున్నారు. కొత్తగా ఉద్యోగంలో చేరిన వారికి తప్ప మిగతా అందరికీ వార్షిక వేతనం రూ.2.5 లక్షలపైనే ఉంటుంది. అంటే దాదాపు ఉద్యోగులంతా పన్ను పరిధిలోకే వస్తున్నారు. ఓవైపు తెలంగాణ ప్రభుత్వం ఎంప్లాయీ ఫ్రెండ్లీ విధానాల్లో రెండు పీఆర్సీలతో వేతనాలను భారీగా 73% పెంచింది. తెలంగాణ పెంచిన జీతాన్ని.. కేంద్రం పన్ను రూపంలో గద్దలా తన్నుకుపోతున్నది. వార్షిక పన్ను పరిమితిని రూ.10 లక్షలకు పెంచాలని ఎనిమిదేండ్లుగా బడ్జెట్ ప్రవేశపెడుతున్న ప్రతి సందర్భంలోనూ అన్ని ఉద్యోగ సంఘాలు కేంద్ర పెద్దలను కలిసి చేస్తున్న డిమాండ్చేస్తున్నారు. ప్రధాని మోదీ మాత్రం పెడచెవిన పెట్టి, ఉద్యోగుల ఉసురు పోసుకొంటున్నారు. వాస్తవానికి దేశంలో కచ్చితంగా పన్ను కట్టే అతి కొద్దిమందిలో ప్రభుత్వ ఉద్యోగులు ముందు వరుసలో ఉంటారు. అలాంటివారికి కాస్త ఊరట కల్పించాల్సిన కేంద్రం పన్నులు వేస్తూ ఖజనా నింపుకుంటున్నది.
మోదీ మా వేతనాలను లాక్కుంటున్నారు
ప్రభుత్వ ఉద్యోగుల ఆదాయ పన్ను పరిమితిని రూ.10 లక్షలకు పెంచాలని కేంద్రాన్ని ఏడేండ్లుగా కోరుతున్నాం. తెలంగాణ సహా రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగులకు పెద్ద ఎత్తున వేతనాలు పెంచి అమలు చేస్తున్నాయి. కేసీఆర్ కుడిచేత్తో వేతనాలు పెంచితే.. మోదీ ఎడమ చేత్తో మా వేతనాలను లాక్కుంటున్నారు. ఇది సరికాదు. తెలంగాణ పర్యటనకు వస్తున్న ప్రధాని మోదీ ఆదాయ పన్ను పరిమితి పెంపుపై స్పష్టమైన ప్రకటన చేయాలని కోరుతున్నాం.
– మామిళ్ల రాజేందర్, టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు
ఓపీఎస్ను పునరుద్ధరించాలి
దేశవ్యాప్తంగా ఉన్న 84 లక్షల ఉద్యోగులకు నష్టం చేకూరుస్తున్న కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీంను కేంద్రం రద్దుచేసి.. పాత పెన్షన్ను పునరుద్ధరించాలి. 2004లో యూపీఏ, ఎన్డీయే ప్రభుత్వాలు ఈ బిల్లును తీసుకొచ్చి ఉద్యోగులపై రుద్దాయి. ఈ స్కీంతో 2004 తర్వాత నియామకమైన ఉద్యోగులకు తీవ్ర నష్టం వాటిల్లుతున్నది. సీపీఎస్ను అన్ని రాష్ర్టాల ఉద్యోగులు వ్యతిరేకిస్తున్నారు. రైతు చట్టాల తరహాలో సీపీఎస్ను సైతం వెనక్కి తీసుకోవాలి.
– స్థితప్రజ్ఞ, నేషనల్ సెక్రటరీ జనరల్ నేషనల్ మూవ్మెంట్ ఫర్ ఓల్డ్ పెన్షన్ స్కీం,
మా పన్నులతోనే ఖజానా నింపుకొంటున్నారు
ఆదాయ పన్ను పరిమితిని రూ.10 లక్షలకు పెంచాలని చాలాకాలంగా కేంద్రాన్ని కోరుతున్నాం. కేంద్ర ఆదాయంలో ఐదు శాతం ఉద్యోగులు కట్టే పన్నుల నుంచే సమకూరుతున్నది. మా పన్నులతోనే కేంద్రం ఖజానా నింపుకొంటున్నది. ప్రజలకు నాణ్యమైన సేవలందిస్తున్నా పన్ను చెల్లింపు నుంచి మాకు మినహాయింపు ఇవ్వకపోవడం బాధ కలిస్తున్నది. జీతం పన్నుల రూపంలో వెళ్తుండటాన్ని జీర్ణించుకోలేకపోతున్నాం.
– హన్మంత్నాయక్, గ్రూప్ -1 అధికారుల సంఘం ప్రధాన కార్యదర్శి
జాతీయంగా రిక్రూట్మెంట్ చేపట్టాలి
గత పాలకుల నిర్లక్ష్యంతో వర్సిటీల రిక్రూట్మెంట్లో అనేక అవకతవకలు జరిగాయి. అక్రమాలకు తావులేకుండా పూర్తి పారదర్శకంగా నియామకాలు చేపట్టేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం కామన్ రిక్రూట్మెంట్ బోర్డును ఏర్పాటు చేయడం శుభపరిణామం. గవర్నర్ ఈ బిల్లును ఆపడంతో నియామకాలు నిలిచి నిరుద్యోగులు నష్టపోతున్నారు. వర్సిటీల ప్రతి అంశాన్ని యూజీసీతో ముడిపెట్టొద్దు. తెలంగాణ తరహాలో జాతీయంగా అన్ని రాష్ర్టాలు రిక్రూట్మెంట్ బోర్డులను ఏర్పాటు చేయాలి.
– జట్టి రాజేందర్, కేయూ విద్యార్థుల వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
విద్యుత్తు చట్టాన్ని ఉపసంహరించుకోవాలి
విద్యుత్తు సంస్థలు.. పూర్తిగా ప్రజల సొమ్ముతో వారి అవసరాల కోసం ఏర్పాటైనవి. వేల కోట్ల విలువైన ప్రజల ఆస్తులను బుక్వ్యాల్యూ పేరుతో నామమాత్రపు ధరలకే కార్పొరేట్లకు కట్టబెట్టేందుకు విద్యుత్తు సవరణ బిల్లు పేరుతో కొత్త నాటకానికి కేంద్రం తెరలేపింది. విద్యుత్తు సంస్థల నష్టాలకు పూర్తి బాధ్యత కేంద్రానిదే. కార్పొరేట్ల చుట్టమైన ఈ విద్యుత్తు చట్టాన్ని ఉద్యోగులుగా మేం ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించం. రాష్ర్టానికి వస్తున్న ప్రధానమంత్రి మోదీ ఈ బిల్లును ఉపసంహరించుకుంటామని స్పష్టమైన ప్రకటన చేయాలి.
– ఎన్ శివాజీ, తెలంగాణ విద్యుత్తు ఇంజినీర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు
అలా ఆర్డర్లు ఇవ్వడం అప్రజాస్వామికం
రైతు సంఘాల నేతలతో చర్చించిన తర్వాతే విద్యుత్తు సవరణ బిల్లుపై నిర్ణయం తీసుకుంటామని సంయుక్త కిసాన్ మోర్చా నేతలకు కేంద్రం హామీనిచ్చి తుంగలో తొక్కింది. రైతు సంఘాల నేతలతో చర్చించకుండానే పార్లమెంట్లో ఈ బిల్లును ప్రవేశపెట్టి.. తీరా విపక్షాలు.. ఎంపీలు వ్యతిరేకించడం, ఉద్యోగుల ఆందోళనలతో వెనక్కి తగ్గి, ఈ బిల్లును పార్లమెంటరీ స్టాడింగ్ కమిటీకి పంపించింది. ఈ కమిటీ ఇప్పటివరకు ఎలాంటి చర్చలు.. సంప్రదింపులు జరపలేదు. ఈ బిల్లు ఆమోదం పొందకుండా.. కమిటీ పరిశీలనలో ఉండగానే కేంద్ర విద్యుత్తుశాఖ నుంచి ఈ బిల్లును అమలుచేయాలని 20 ఆర్డర్లు పంపించారు. ఇలాంటి చర్యలకు పాల్పడటం అప్రజాస్వామికం. ఈ బిల్లును వ్యతిరేకిస్తూ నవంబర్ 23 చలో ఢిల్లీ తలపెట్టాం. కేంద్రం మొండిగా ముందుకెళితే దేశవ్యాప్త సమ్మెకు మేం సిద్ధం.
– పీ రత్నాకర్రావు, తెలంగాణ స్టేట్ పవర్ ఇంజినీర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు