హైదరాబాద్ : మొక్కలు నాటడం, పచ్చదనం పెంచటం జీవన విధానంలో భాగం కావాలి అని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర వృక్షం జమ్మిని ప్రతి ఊరిలో, ప్రతి గుడిలో నెలకొల్పాలనే ఉద్దేశంతో గ్రీన్ ఇండియా చాలెంజ్ ప్రారంభించిన వినూత్న కార్యక్రమం రెండో యేడాదిలోకి అడుగుపెట్టింది.
ఈ సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్,ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఫారెస్ట్ కార్పొరేషన్ చైర్మన్ ఒంటేరు ప్రతాప్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు రమణాచారి తో కలిసి కొత్తగూడ బొటానికల్ గార్డెన్స్ అర్బన్ ఫారెస్ట్ పార్క్ లో జమ్మి మొక్కలు నాటి రెండో విడతను లాంఛనంగా ప్రారంభించారు.
దసరా పండగ సందర్భంగా అన్ని గ్రామాలు, గుడుల్లో కలిపి లక్షా ఇరవై వేల జమ్మి మొక్కలను నాటేలా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ తో కలిసి అటవీ, దేవాదాయ శాఖలు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను కూడా విడుదల చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..తెలంగాణలో దసరా నాడు జమ్మి చెట్టును పూజించడం ఆచారం. జమ్మి ఆకులను బంధుమిత్రులకు ఇచ్చిపుచ్చుకుని అందరికీ మంచి జరగాలని కోరుకోవటం కూడా ఆనవాయితీ. ఈ ప్రాధాన్యతల దృష్ట్యా రానున్న దసరా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఊరుఊరుకో జమ్మిచెట్టు- గుడిగుడికో జమ్మి చెట్టు కార్యక్రమం ఎంపీ సంతోష్ కుమార్ తీసుకోవటాన్ని ఆహ్వానిస్తున్నామని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు.
వాకర్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడిగా ఎంపీ సంతోష్ కుమార్..
కొత్తగూడ బొటానికల్ గార్డెన్స్ వాకర్స్ అసోసియేషన్ తమ గౌరవ అధ్యక్షుడిగా ఎంపీ సంతోష్ కుమార్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. బొటానికల్ గార్డెన్స్ విశిష్టతను కాపాడేందుకు తనవంతుగా ప్రయత్నం చేస్తానని ఈ సందర్భంగా ఎంపీ హామీఇచ్చారు. వజ్రోత్సవ వేడుకల సదర్భంగా వాకర్స్ అసోసియేషన్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన రన్ ఫర్ పీస్ కార్యక్రమం పోస్టర్, టీషర్ట్స్ ను మంత్రితో కలిసి ఎంపీ సంతోష్ కుమార్ ఆవిష్కరించారు.