తొర్రూరు, డిసెంబర్ 14 : ప్రణాళికాబద్ధంగా తొర్రూరు మున్సిపాలిటీని అభివృద్ధి చేద్దాం. అన్ని రంగాల్లో అగ్రగామిగా తీర్చిదిద్దుదామని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తొర్రూరు పట్టణ ప్రజలకు పిలుపునిచ్చారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మున్సిపాలిటీ సర్వ సభ్య సమావేశంలో మంత్రి ఎర్రబెల్లి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా తొర్రూరు వార్డుల వారీగా సమస్యలను చర్చించి పలు సమస్యలకు వెంటనే పరిష్కారాలు చూపారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తొర్రూరు పట్టణం కొత్తగా అభివృద్ధి చెందుతున్న, ఇంకా బాగా అభివృద్ధి చేయగలిగిన పట్టణం అన్నారు. ఈ పట్టణాన్ని అన్ని రంగాల్లో తీర్చిదిద్దటానికి సరికొత్త ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశించారు. మంచి డ్రైనేజీ వ్యవస్థ నిర్మాణానికి ప్రణాళికలు రూపొందించాలను సూచించారు.
కొత్త ఇంటి నిర్మాణాలకు ప్లానింగ్ ప్రకారం పర్మిషన్లు ఇవ్వాలని, రూ.6 కోట్లతో బిటి రోడ్లను సీసీ రోడ్లుగా మార్చడానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని చెప్పారు. కౌన్సిలర్లు వారి వారి వార్డులలో పర్యటించి, సమస్యలను పరిష్కరంచాలన్నారు.
పట్టణంలో సెంట్రల్ లైటింగ్ ను మరింత అభివృద్ధి చేస్తాం. డ్రైనేజ్ వ్యవస్థ ను మరింత మెరుగు పరచాలి. 100 శాతం మిషన్ భగీరథ మంచినీరు తొర్రూరు ప్రజలకు నల్లాల ద్వారా అందించాలన్నారు. అధికారులు సంన్వయంతో పని చేయాలని మంత్రి సూచించారు.
సమావేశంలో..మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ శశాంక్, అడిషనల్ కలెక్టర్ అభిలాష అభినవ్, తొర్రూరు మున్సిపాలిటీ చైర్మన్ రామచంద్రయ్య, వైస్ చైర్మన్ సురేందర్ రెడ్డి, కౌన్సిలర్లు, కమిషనర్ బాబు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.