Karnataka | హైదరాబాద్, ఫిబ్రవరి 19 (నమస్తే తెలంగాణ): తుంగభద్ర నదీ జలాలను కొల్లగొట్టేందుకు కర్ణాటక ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు తెలంగాణ పాలిట శాపంగా మారుతాయనే ఆందోళన వ్యక్తమవుతున్నది. ఇప్పటికే నావలి రిజర్వాయర్ను విస్తరించేందుకు చర్యలు చేపట్టిన కర్ణాటక ప్రభుత్వం మరో బరాజ్ నిర్మాణానికి సిద్ధమవుతున్నది. తాజా బడ్జెట్లో అందుకు రూ.158 కోట్లు కేటాయించింది. అదే జరిగితే తెలంగాణకు కృష్ణా జలాలు వచ్చే అవకాశమే ఉండబోదని ఇంజినీర్లు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. బచావత్ ట్రిబ్యునల్ కేటాయించిన 230 టీఎంసీల నీటిని వినియోగించుకునే లక్ష్యంతో తుంగభద్ర డ్యామ్ను నిర్మించారు. తుంగభద్ర డ్యామ్ కింద కర్ణాటకలో 9,30,626 ఎకరాలు, ఏపీలో 6,25,097, తెలంగాణలో 87 వేల ఎకరాల ఆయకట్టుకు ఉన్నది. డ్యామ్లో పూడిక పెరగడంతోపాటు వరద ప్రవాహాల్లో వచ్చిన మార్పుల ఫలితంగా కేటాయించిన మేరకు నీటిని వినియోగించుకోలేని పరిస్థితి నెలకొన్నది.
అవిరి నష్టాలతో కలుపుకుని 230 టీఎంసీలు ఉపయోగించుకోవాల్సి ఉండగా, ప్రస్తుతం 174.72 టీఎంసీలను కూడా వినియోగించుకోవడం లేదని, మొత్తంగా 55.28 టీఎంసీలను నష్టపోవాల్సి వస్తున్నదని కర్ణాటక వాదిస్తున్నది. ఆ సాకుతో ప్రస్తుతం ఉన్న తుంగభద్ర లోలెవల్ కెనాల్ (ఎల్ఎల్సీ)కి సమాంతరంగా మరో కాలువను తవ్వేందుకు పూనుకున్నది. కొప్పల్ జిల్లాలో ఇప్పటికే 31 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించిన నావలి రిజర్వాయర్ను 52 టీఎంసీలకు విస్తరించి తుంగభద్ర డ్యామ్కు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్గా వినియోగించుకోవాలని గతంలోనే ప్రణాళికలు సిద్ధం చేసింది. ఆ దిశగా వేగంగా అడుగులు వేస్తున్నది. ఇటీవల కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ మాట్లాడుతూ.. నవాలీ వద్ద బ్యాలెన్సింగ్ డ్యామ్ను నిర్మించేందుకు ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసిందని, దీనిపై తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలతో చర్చించి వచ్చే బడ్జెట్లోనే అమలు చేస్తామనడం గమనార్హం. మరోవైపు కర్ణాటక ప్రభుత్వం అప్పర్భద్ర ప్రాజెక్టు పనులను కూడా వేగవంతం చేసింది. దీనిని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించడంతో అందుకు సంబంధించిన నిధులు కేటాయించాలని కేంద్రంపై ఒత్తిడి పెంచుతున్నది.
నావలి రిజర్వాయర్ను విస్తరించేందుకు ఇప్పటికే సిద్ధమైన కర్నాటక తుంగభద్రపై కొత్తగా మరో రోడ్ కమ్ బరాజ్ను నిర్మించేందుకు ప్రయత్నిస్తున్నది. రాయచూరు జిల్లా చికమంచాల సమీపంలో బ్రిడ్జి కమ్ బరాజ్ ప్రాజెక్టును చేపట్టాలని, మంత్రాలయంకు రోడ్డుమార్గాన్ని అనుసంధానించాలని నిర్ణయించింది. అందుకు 158 కోట్లు కేటాయించింది.
కృష్ణా నదికి తుంగ, భద్ర ఉపనదులు. ఆ రెండింటి నుంచే ఏటా దాదాపు 500 టీఎంసీల జలాలు కృష్ణాలోకి వస్తుంటాయి. ఈ నేపథ్యంలో తుంగభద్ర నదిపై ఎక్కడ పడితే అక్క డ ప్రాజెక్టులను నిర్మించకుండా బచావత్ ట్రిబ్యునల్ అనేక ఆంక్షలు, షరతులు విధించిం ది. కర్ణాటక సర్కారు ఆ నిబంధనలను తుంగ లో తొక్కుతూ నిర్మాణాలు చేపడుతున్నది. తాజాగా నావలి, కొత్తగా మరికొన్ని బరాజ్ల నిర్మాణానికి పూనుకున్నది. అదే జరిగితే భవిష్యత్లో తుంగభద్ర నుంచి కృష్ణాలోకి వచ్చే జలాలు పూర్తిగా తగ్గిపోతాయి. ఫలితంగా కృష్ణా జలాలపైనే పూర్తిగా ఆధారపడిన తెలంగాణకు తీరని నష్టం వాటిల్లే ప్రమాదం ఉన్నద ని తెలంగాణ ఇంజినీర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ఇదే విషయాన్ని అసెంబ్లీలో ప్రస్తావించిన ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవై సీ.. కర్ణాటకను అడ్డుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం సత్వరమే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.