హైదరాబాద్, జూలై 17 (నమస్తే తెలంగాణ) : ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం అభివృద్ధికి పార్టీలకు అతీతంగా తెలంగాణ ఎంపీల సహకారం తీసుకుంటున్నామని వర్సిటీ ఉపకులపతి అల్దాస్ జానయ్య పేర్కొన్నారు. శుక్రవారం హైదరాబాద్ సైఫాబాద్లోని కమ్యూనిటీ కళాశాలలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. విశ్వవిద్యాలయం బోధన సిబ్బంది ఏడవ వేతన సంఘం బకాయిల విషయంలో పత్రికల్లో అవాస్తవాలతో కూడిన కథనాలు రావడం దురదృష్టకరమని అన్నారు.
2016 నుంచి 2019 మధ్య కాలానికి సంబంధించిన సుమారు 42 నెలలు బకాయిలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఐకార్ కొత్త డీజీ ఎంఎల్ జాట్తో చర్చించానని చెప్పారు. పలువురు ఎంపీ ల సాయంతో కేంద్ర ఆర్థికమం త్రి నిర్మలా సీతారామన్ని కలిసి సు మారు రూ.30 కోట్ల బకాయిలని విడుదల చేయించగలిగానని వివరించారు. యూనివర్సిటీకి రూ.500 కోట్ల ప్రత్యేక గ్రాంట్ ఇవ్వాలని కేంద్రాన్ని కోరుతున్నట్టు చెప్పారు.
దామరచర్ల, జూలై 17: నల్లగొండ జిల్లా దామరచర్ల మండలంలోని యాదాద్రి పవర్ప్లాంటులో ఎలాంటి ఆందోళనలు, నిరసనలు తెలుపకుండా యాజమాన్యం నిషేధాజ్ఞలను విధించడంపై ఉద్యోగ సంఘాలు ఆగ్రహం వ్యక్తంచేశాయి. పవర్ప్లాంటులోని స్టేజీ-1, స్టేజీ-2లోని యాష్, కోల్ప్లాంట్లను ప్రైవేటీకరణ చేస్తూ పిలిచిన టెండర్లను రద్దుచేయాలని కోరుతూ ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో ప్లాంటులో నెల రోజులుగా భోజన విరామ సమయంలో నల్లబ్యాడ్జీలు ధరించి ర్యాలీలు, నిరసనలు తెలుపుతున్నారు. వీరికి మద్దతుగా రాష్ట్రంలోని అన్ని విద్యుత్తు సంఘాలు నిరసనలకు దిగాయి.
ఈ క్రమంలో యాజమాన్యం ఆరు నెలల పాటు ఎలాంటి ఆందోళనలు, నిరసనలు చేయకుండా నిషేధాజ్ఞలు విధిస్తూ ఈ నెల 16న ఉత్తర్వులు జారీ చేయడంతో ఉద్యోగ జేఏసీ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ నిరసనలు తెలుపుకునే హక్కులేకుండా చేయడంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఏర్పాటు చేసిన వైటీపీఎస్లో నాలుగు యూనిట్ల ద్వారా 3,200 మెగావాట్ల విద్యుత్తును రాష్ర్టానికి అందిస్తున్న తరుణంలో ప్రైవేటీకరణ చేయడం పట్ల తెలంగాణవాదులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఉత్వర్వులను వెంటనే రద్దుచేయాలని, టెండర్ల ప్రక్రియ ఉపసంహరించుకోవాలని ఉద్యోగ జేఏసీ నాయకులు కోరుతున్నారు.