వ్యవసాయ యూనివర్సిటీ, నవంబర్ 23: రాష్ట్రంలో వరికి ప్రత్యామ్నాయ పంటను ప్రోత్సహించాల్సిన అవసరం ఉన్నదని ఇండియన్ సొసైటీ ఆఫ్ అగ్రానమీ ప్రెసిడెంట్, ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ వర్సిటీ వైస్చాన్స్లర్ డాక్టర్ వీ ప్రవీణ్రావు తెలిపారు. రైతులు తక్కువ నీటితో ఎక్కువ సాగు చేయగలిగే పంటలను వేయాలని సూచించారు. వ్యవసాయ వర్సిటీ, ఇండియన్ సొసైటీ ఆఫ్ అగ్రానమీ సంయుక్తంగా నిర్వహించిన 5వ అంతర్జాతీయ అగ్రానమీ కాంగ్రెస్ సదస్సు మంగళవారం రాజేంద్రనగర్లోని పీజేటీఎస్ఏయూ ఆడిటోరియంలో ఆన్లైన్, ఆఫ్లైన్ ద్వారా జరిగింది. ప్రవీణ్రావు మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి ఆరు రెట్లు, హార్టికల్చర్ ఉత్పత్తి 10 రెట్లు పెరిగిందన్నారు. 2050 నాటికి ప్రపంచ జనాభా అధికం అవుతుందని, దానికి తగ్గట్టు రైతులకు నూతన టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చి ఆహార ధాన్యాల ఉత్పత్తిని 60 శాతం పెంచాలని పేర్కొన్నారు. అందుబాటులో ఉన్న భూ వనరులతో అధిక ఉత్పత్తి సాధించాల్సిన అవసరాన్ని క్రాప్ సైన్స్ సొసైటీ ఆఫ్ అమెరికా ప్రెసిడెంట్ ప్రొఫెసర్ పీవీ వరప్రసాద్ నొక్కిచెప్పారు. దేశంలో 30 శాతం ఆహార ఉత్పత్తులు వృథా అవుతున్నాయని తెలిపారు. దేశంలో 50 శాతం మెట్ట వ్యవసాయమే సాగు అవుతున్నదని.. ఉత్పత్తి, ఉత్పాదకలు పెరుగుదలతో పాటు రైతుల ఆర్థిక స్థితిని మెరుగుపర్చే చర్యలు తీసుకోవాలని ఇంటర్నేషనల్ వీడ్ సైన్స్ సొసైటీ ప్రెసిడెంట్ ప్రొఫెసర్ సముందర్ సింగ్ చెప్పారు. వ్యవసాయ రంగంలో దేశం అసమాన పురోగతి సాధించిందని రాణి లక్ష్మీబాయి సెంట్రల్ అగ్రికల్చర్ యూనివర్సిటీ చాన్స్లర్ ప్రొఫెసర్ పంజాబ్సింగ్ అన్నారు. నూనెగింజల ఉత్పత్తిలో వెనుకబడి ఉన్నామని, దానిపై ప్రత్యేక దృష్టి సాధించాలని అన్నారు. కార్యక్రమానంతరం వర్సిటీలో వివిధ శాఖలు నిర్వహించిన స్టాల్స్ను వీరు వీక్షించారు. పలు వ్యవసాయ సంచికలు, సావనీర్ను విడుదల చేశారు.