హైదరాబాద్, మార్చి 24 (నమస్తే తెలంగాణ): ‘బియ్యంతో సంబంధం లేకుండా ఒప్పందం ప్రకారం మొత్తం ధాన్యం సేకరించండి’.. ఇదీ కేంద్ర ఆహార శాఖ మంత్రి పీయూష్ గోయల్ ముందు తెలంగాణ మంత్రుల బృందం పెట్టిన సూటి ప్రతిపాదన. దీనిపై సూటిగా సమాధానం చెప్పకుండా ఆయన మళ్లీ పాత పాటే అందుకొన్నారు. బడిలో చిన్న పిల్లలు బట్టీ పట్టి అప్పజెపిప్పట్టు.. కొన్ని నెలలుగా చెప్తున్న మాటలనే మళ్లీ వల్లె వేశారు. రా రైస్ మాత్రమే సేకరిస్తామని వితండ వాదన చేశారు. ధాన్యం సేకరణపై తెలంగాణ మంత్రులు, ఎంపీల బృందంతో గురువారం సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం రైతులను తప్పుదోవ పట్టిస్తున్నదని, రాష్ట్రంలో రైతు వ్యతిరేక ప్రభుత్వం ఉన్నదని అడ్డదిడ్డ వ్యాఖ్యలు చేశారు. పీయూష్ గోయల్ మాటలు, అసలు వాస్తవాలేమిటో చూద్దాం..
గోయల్: పంజాబ్ అయినా, తెలంగాణ అయినా మాకు ఒకటే. తెలంగాణపై ఎలాంటి వివక్ష లేదు.
వాస్తవం: కేంద్ర మంత్రి మాటలు పచ్చి అబద్ధాలని వానకాలం పంట కొనుగోళ్లే నిరూపిస్తున్నాయి. పంజాబ్లో వానకాలంలో ఉత్పత్తి అయ్యే ధాన్యాన్ని, యాసంగిలో పండే గోధుమ పంటను మొత్తం కేంద్రమే సేకరిస్తున్నది. ఈ వానకాలంలో ఎఫ్సీఐ పంజాబ్లో 186 లక్షల టన్నుల ధాన్యం సేకరించగా, తెలంగాణ నుంచి 70 లక్షల టన్నులు మాత్రమే తీసుకొన్నది. అక్కడ రెండు సీజన్ల పంట ఉత్పత్తులను కొన్నట్టుగానే ఇక్కడ కూడా సేకరించాలన్నది తెలంగాణ డిమాండ్.
గోయల్: తెలంగాణ నుంచి ఎంత ధాన్యం ఇస్తారో ఆ రాష్ట్ర ప్రభుత్వం లెక్క చెప్పలేదు.
వాస్తవం: యాసంగి సీజన్లో ధాన్యం కొనుగోలుకు సంబంధించి ఎఫ్సీఐ రెండుసార్లు రాష్ర్టాలతో సమావేశం నిర్వహించింది. ఈ రెండు సమావేశాల్లోనూ రాష్ట్ర ప్రభుత్వం తరఫున పౌరసరఫరాల శాఖ అధికారులు తమ వైఖరిని కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు. యాసంగిలో తమ వద్ద బాయిల్డ్ రైస్ మాత్రమే వస్తుందని, రా రైస్ ఇవ్వలేమని తేల్చి చెప్పారు. యాసంగిలో రాష్ట్రంలో 38 లక్షల ఎకరాల్లో వరి పంట సాగయ్యిందని, సుమారు 75 లక్షల టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని కూడా చెప్పారు. ఎఫ్సీఐ అధికారులు మాత్రం తాము రా రైస్ మాత్రమే తీసుకొంటామని మొండికేశారు. ఇప్పుడు కేంద్ర మంత్రి రాష్ట్రప్రభుత్వంపై నిందలు వేశారు.
గోయల్: తెలంగాణ నుంచి రా రైస్ మాత్రమే సేకరిస్తాం.
వాస్తవం: తెలంగాణలో యాసంగిలో రా రైస్ ఉత్పత్తి కాదని రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఇప్పటికే అనేక మార్లు కేంద్ర ప్రభుత్వానికి తెలిపారు. ఈ విషయం ఎఫ్సీఐకి కూడా తెలుసు. అయినా తమకు రా రైస్ మాత్రమే కావాలని కేంద్రం మొండిపట్టు పడుతున్నది. తెలంగాణలో యాసంగి సీజన్లో ఉష్ణోగ్రతలు అధికంగా ఉండటం వల్ల ధాన్యాన్ని మిల్లింగ్ చేసే సమయంలో బియ్యం విరిగిపోయి సగానికి పైగా నూక (బ్రోకెన్) వస్తుంది. బియ్యం విరిగిపోకుండా ఉండేందుకు ధాన్యాన్ని ఉడికించి మిల్లింగ్ (బాయిల్డ్ రైస్) చేస్తారు. కేంద్రం ఇవేవీ పట్టించుకోకుండా రా రైస్ మాత్రమే కావాలంటూ మొండిగా వాదిస్తున్నది.