వ్యక్తిగత ప్రయోజనాలకైతే అనుమతించేదే లేదు: రాష్ట్ర హైకోర్టు
హైదరాబాద్, ఆగస్టు 11 (నమస్తే తెలంగాణ): ప్రజాహితం కోసమే ప్రజాప్రయోజన వ్యాజ్యాలు (పిల్స్) దాఖలుచేయాలని, వ్యక్తిగత ప్రయోజనాల కోసం వేస్తే అనుమతించే ప్రసక్తే లేదని హైకోర్టు తేల్చి చె ప్పింది. గురుకుల పాఠశాలల్లో ఉపాధ్యాయులు, సిబ్బంది పోస్టులను భర్తీ చేయడంలేదంటూ దాఖలైన పిల్పై హైకోర్టు సీజే జస్టిస్ హిమాకోహ్లీ, జస్టిస్ బీ విజయ్సేన్ రెడ్డితో కూడిన ధర్మాసనం బుధవారం విచారించింది. ‘ప్రభుత్వానికి ఏప్రిల్లో వినతిపత్రం ఇచ్చి మేలో పిల్ వేస్తారా? కనీస గడువు కూడా ఇవ్వకుండా హైకోర్టును ఎలా ఆశ్రయిస్తారు?’ అని పిటిషనర్ తరఫు న్యాయవాదిని ప్రశ్నించింది. ‘ప్రస్తుతం పార్ట్టైమ్ ట్యూటర్గా పనిచేస్తున్న పిటిషనర్.. రేపు ప్రభుత్వం నియామకాలు చేపడితే ఉద్యోగానికి దరఖాస్తు చేయకుండా ఉంటాడా?’ అని నిలదీసింది. పిల్ను క్లోజ్ చేస్తామని ధర్మాసనం చెప్పడంతో.. ఉద్యోగం కోసం మధు దరఖాస్తు చేయబోరని, ప్రజాహితానికే కోర్టును ఆశ్రయించారని న్యాయ వాది చెప్పారు. పిటిషనర్ అనుమతి లేకుండానే ఈ తర హా హామీ ఎలా ఇస్తారని హైకోర్టు ప్రశ్నించింది. పిటిషనర్ సమ్మతి ఏమిటో తెలుసుకుని ఈ నెల 18న జరిగే విచారణలో చెప్పాలని స్పష్టం చేసింది.