సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ సారథ్యంలో నగర శివారు ప్రాంతాల్లో వేల కోట్లతో అభివృద్ధి కొనసాగుతున్నదని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ. వివేకానంద్ అన్నారు. శనివారం నిజాంపేట కార్పొరేషన్ పరిధిలో పలు అభివృద్ధి, నిర్మాణ పనులకు మేయర్ కొలన్ నీలాగోపాల్రెడ్డితో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నగర శివారు ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం రూ.3 వేల కోట్ల నిధులు కేటాయించడం అభినందనీయమన్నారు. నూతనంగా ఏర్పడిన కార్పొరేషన్లు, మున్సిపాలిటీల అభివృద్ధితో పాటు ప్రజలకు మెరుగైన సదుపాయాల కల్పన కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకున్నదన్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని అభివృద్ధి పనులు చేపట్టి హైదరాబాద్ నగరానికి శివారు ప్రాంతాలు మణిహారాలుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటున్నదన్నారు.
నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 2వ వార్డులో రూ.1.57 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. వీటిలో ప్రగతినగర్ కమాన్ వద్ద రూ.40 లక్షలతో ఏర్పాటు చేసిన ట్రాఫిక్ సిగ్నల్స్, ప్రగతినగర్ కమాన్ నుంచి బాచుపల్లి వెళ్లే మెయిన్ రోడ్డులో రూ.48 లక్షలతో ఏర్పాటు చేసిన సెంట్రల్ లైటింగ్ను ప్రారంభించారు. ప్రగతి నగర్ ఎన్ఆర్ఐ కాలనీలో రూ.23.28 లక్షలతో బీటీ రోడ్డు, రూ.20 లక్షలతో సీసీరోడ్లను ప్రారంభించారు.
అనంతరం అపురూప-2 కాలనీలో రూ.30 లక్షలతో ఏర్పాటు చేసిన పంచతత్వ పార్క్ను ప్రారంభించారు. 11వ వార్డు వీకర్ సెక్షన్లో రూ.13 లక్షలతో నూతనంగా చేపడుతున్న మంజీరా నీటి పైపులైన్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ గోపి, డిప్యూటీ కార్పొరేటర్ ధనరాజు యాదవ్తో పాటు పలువురు కార్పొరేటర్లు, కో-ఆప్షన్ సభ్యులు, కార్యకర్తలు, మహిళలు, వివిధ కాలనీల సంక్షేమ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.