దుండిగల్, ఏప్రిల్ 6: మాదిగలను నమ్మించి.. వంచిస్తున్న పార్టీ బీజేపీ అని మాదిగ జేఏసీ చైర్మన్ పిడమర్తి రవి ఆరోపించారు. మాదిగలను ఓటు బ్యాంకుగా వాడుకొని ఎస్సీ వర్గీకరణ డిమాండ్ను నీరుగార్చేందుకు యత్నిస్తున్న కేంద్రప్రభుత్వ కుట్రలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. మాదిగల పట్ల కేంద్రం అనుసరిస్తున్న వ్యతిరేక విధానాలను తిప్పికొట్టేందుకు మాదిగ జేఏసీ, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో త్వరలో నిర్వహించే బ్లూషర్ట్స్ నీలి కవాతు పోస్టర్ను మంగళవారం హైదరాబాద్లోని వివేకానందనగర్లో ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆదినుంచి మాదిగలను వంచిస్తూ పాలన కొనసాగిస్తున్నదని దుయ్యబట్టారు. ప్రభుత్వ సంస్థలను ప్రైవేటుపరం చేస్తూ రిజర్వేషన్లు లేకుండా చేసేందుకు కుట్ర పన్నుతున్నదని మండిపడ్డారు. బీజేపీ ప్రభుత్వ తీరును నిరసిస్తూ బీఆర్ అంబేద్కర్ జయంతి రోజున పెద్దఎత్తున బ్లూషర్ట్స్ నీలికవాతు చేపడుతున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో ప్రజాసంఘాల జేఏసీ చైర్మన్ గజ్జల కాంతం, కమ్మెట భూపాల్, గిడి జయన్న తదితరులు పాల్గొన్నారు.