హైదరాబాద్, నవంబర్ 16 (నమస్తే తెలంగాణ): పోలీస్ నియామక ప్రక్రియలో అత్యంత కీలకమైన దేహదారుఢ్య పరీక్షలను డిసెంబర్ మొదటి వారం నుంచి నిర్వహించనున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రక్రియను టీఎస్ఎల్పీఆర్బీ (తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక మండలి) వేగవంతం చేసింది. వివిధ విభాగాల్లో ఎస్సై, కానిస్టేబుల్ పోస్టులకు కలిపి ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ (పీఎంటీ), ఫిజికల్ ఎఫీషియెన్సీ టెస్ట్ (పీఎంటీ)ల కోసం 2,37,862 మంది అభ్యర్థులు పార్ట్-2 దరఖాస్తును అందజేశారు. ఒక అభ్యర్థి రెండు పోస్టులకు దరఖాస్తు చేసినా.. దేహదారుఢ్య పరీక్ష ఒకేసారి నిర్వహించనున్నట్టు బోర్డు అధికారులు తెలిపారు. ఒకసారి తీసిన రీడింగ్లు అన్ని విభాగాల్లోని పోస్టులకు వర్తిస్తాయని చెప్పారు.
దేహదారుఢ్య పరీక్షల్లో పాల్గొనే అభ్యర్థులకు అడ్మిట్కార్డుల జారీని ఈ నెలాఖరులో ప్రారంభించేలా బోర్డు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అభ్యర్థులు టీఎస్ఎల్పీఆర్బీ వెబ్సైట్లోకి వెళ్లి తమ లాగిన్ ఐడీల ద్వారా అడ్మిట్ కార్డులను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇందుకు మూడు నుంచి ఐదు రోజుల సమయం సరిపోతుందని బోర్డు వర్గాలు భావిస్తున్నట్టు తెలిసింది.
పోలీస్ నియమాక ప్రక్రియలో వీలైనంత వరకు సాంకేతికతను వినియోగిస్తున్నారు. అవకతవకలకు తావులేకుండా పారదర్శకంగా పూర్తి చేసేలా ఈ సారి ఫిజికల్ ఈవెంట్స్లో కూడా సాంకేతికతను వినియోగించనున్నారు. బయోమెట్రిక్ పరికరాలు, ఎత్తును కొలిచే డిజిటల్ మీటర్లు, సీసీటీవీ కెమెరాలు సహా ఇతర సాంకేతిక సామగ్రిని ఫిజికల్ ఈవెంట్స్ నిర్వహణ తేదీకి వారం ముందే అన్ని కేంద్రాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. వాటి పనితీరు సంతృప్తికరంగా ఉందా లేదా అన్నది ముందుగానే నిర్ధారించుకోనున్నట్టు అధికారులు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 11 నుంచి 12 కేంద్రాల్లో ఈవెంట్స్ నిర్వహణకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ముందస్తుగా గ్రౌండ్ల పరీశీలన తర్వాత ఆయా యూనిట్ల అధికారులకు, నోడల్ ఆఫీసర్లకు హైదరాబాద్లో టీఎస్ఎల్పీఆర్బీ బోర్డు ఉన్నతాధికారులు డెమో తరగతులు నిర్వహించనున్నారు. ఆ తర్వాత ఈవెంట్స్ను ప్రారంభించనున్నట్టు తెలిసింది.