హైదరాబాద్ : బడుగు, బలహీనవర్గాల ఆశాజ్యోతి జ్యోతిరావ్ ఫూలే (Jyothi rao Phule) కు భారత రత్న (Bharat Ratna) ఇవ్వాలని భారత్ జాగృతి రౌండ్ టేబుల్ సమావేశం కేంద్రాన్ని డిమాంద్ చేసింది. ఈ మేరకు శుక్రవారం జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(MLC Kavitha) అధ్యక్షతన హైదరాబాద్లో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో చేసిన తొమ్మిది తీర్మానాలను ఆమె చదివి వినిపించారు.
అసెంబ్లీ (Assembly) ఆవరణలో పూలే విగ్రహం ఏర్పాటు చేయాలని, ఏప్రిల్ 11 లోగా ప్రభుత్వం నుంచి సానుకూల నిర్ణయం కోసం ఎదురుచూస్తామని అన్నారు. కర్పూరి ఠాకూర్ (Karpuri Thakur) కు భారత రత్న ప్రకటించినందుకు హర్షం వ్యక్తం చేస్తూ పూలేకు భారత రత్న ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేంద్రంలో ఓబీసీల కోసం మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని, త్వరితగతిన బీసీ జనగణన చేపట్టాలని కోరారు. మహిళా రిజర్వేషన్ల(Women Reservations)లో ఓబీసీ మహిళలకు కోటా కల్పించాలి, బీసీ రిజర్వేషన్ బిల్లును తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సూచించారు.
8, 9, 10వ తరగతుల పాఠ్యపుస్తకాల్లో జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే జీవిత చరిత్రను పొందుపర్చాలన్నారు. ఆరు నెలల్లో స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీని అమలు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. సమావేశంలో వచ్చిన సూచనలు, సలహాలను స్వీకరించి తదుపరి కార్యాచరణలో చేర్చుతామని పేర్కొన్నారు. రౌండ్ టేబుల్ సమావేశానికి సీపీఐ పార్టీ హాజరు కావడం పట్ల ఆమె ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అసెంబ్లీ ఆవరణలో పూలే విగ్రహం ఏర్పాటు కోసం తాము చేస్తున్న పోరాటానికి మద్ధతుగా రాజకీయ పార్టీలు ప్రభుత్వానికి లేఖలు రాయాలని పిలుపునిచ్చారు.
ప్రతి జిల్లాలో, యూనివర్సిటీల్లో రౌండ్ టేబుల్ సమావేశాలు
ప్రతి జిల్లాలో, యూనివర్సిటీల్లో రౌండ్ టేబుల్ సమావేశాలు ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్సీ కవిత వెల్లడించారు. విగ్రహ ఏర్పాటు కోసం ధర్నా చౌక్ వద్ద మహాధర్నా నిర్వహణ తేదీలను త్వరలో ప్రకటిస్తామని, ప్రతి గ్రామం నుంచి 10-15 పోస్టు కార్టులు పంపించడం వంటి సూచనలు సమావేశంలో వచ్చాయని ఆమె వివరించారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు.