హైదరాబాద్, జూలై 18 (నమస్తే తెలంగాణ): బ్యాంకు అధికారుల నుంచి పంపుతున్నట్టు ఎస్ఎంఎస్లు పంపి, వాటిల్లోని లింక్లపై క్లిక్ చేయాలని సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. బ్యాంకు ఖాతా వివరాలు, వ్యక్తిగత సమాచారం, డెబిట్ లేదా క్రెడిట్ కార్డుల నంబర్లు, సీవీవీ నంబర్లు ఇలా వివరాలు సేకరించి మోసగిస్తున్నట్టు క్లౌడ్ సీక్స్ థ్రెట్ రిసెర్చ్ అండ్ ఇన్ఫర్మేషన్ అనలైటిక్స్ సంస్థ వెల్లడించింది. మెసేజ్లలో ఫిషింగ్ సైట్లను ఉంచి, పలు బ్యాంకు ఖాతాదారుల వివరాలు సేకరిస్తున్నట్టు ఆ సంస్థ పేర్కొన్నది. మోసం ఎలా చేస్తున్నారంటే.. మీ బ్యాంకు ఖాతా, క్రెడిట్, డెబిట్ కార్డులు బ్లాక్ కాకుండా ఉండాలంటే వెంటనే ఆ లింక్పై క్లిక్ చేసి వివరాలు నమోదు చేయాలని వరుస ఎస్ఎంఎస్లు పంపుతూ తొందరపెడుతున్నారు. ఎవరైనా నమ్మి ఈ లింక్లపై క్లిక్ చేయగానే అందులో కార్డు నంబర్, సీవీవీ నంబర్, ఎక్స్పైరీ డేట్ వంటివి నమోదు చేయాలని సూచిస్తున్నారు. ఆ వివరాలు వచ్చిన తర్వాత ‘Customer_Soppor_Srvice.apk’ ద్వారా ఓ యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలని సూచిస్తున్నారు. దాన్ని డౌన్లోడ్ చేసుకోగానే ఎస్ఎంఎస్లు పంపేందుకు, రిసీవ్ చేసుకొనేందుకు పర్మిషన్ తీసుకొని, బాధితుడి ఫోన్ను పూర్తిగా తమ కంట్రోల్కి తెచ్చుకొంటున్నారు. తద్వారా బ్యాంక్ ఖాతాల్లోని డబ్బును ఖాళీ చేస్తున్నారు. ‘క్లౌడ్సీక్స్’ సేకరించిన సమాచారం ప్రకారం.. సైబర్ నేరగాళ్లు ‘ఎస్ఎంఎస్-ఫార్వర్డ్’అనే గిట్హబ్ సాఫ్ట్వేర్ నుంచి ఫిషింగ్ లింక్లు పంపుతున్నట్టు తెలిసింది. కాగా, ఏ బ్యాంకు కూడా వివరాలు పంపాలని సందేశాలు పంపదని, అలా ఏవైనా లింక్లతో ఎస్ఎంఎస్లు వస్తే అవి సైబర్ నేరగాళ్ల పని అని గుర్తించాలని పోలీసులు సూచిస్తున్నారు.