హైదరాబాద్ : ఏ ఒక్క రైతు తాను పండించిన పంటను అమ్మడంలో ఇబ్బంది పడకూడదని సీఎం కేసీఆర్ ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఊరూరా పెట్టి పంటను కొంటున్నారని రాష్ట్ర మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ అన్నారు.
గత సంవత్సరం కొవిడ్ కష్టకాలంలోనూ పంటను ప్రభుత్వం కొనుగోలు చేసిందన్నారు. ఈసారి కేంద్రం కొనుగోలు కేంద్రాలు పెట్టవద్దని చెబుతున్నా..రైతుల సంక్షేమమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ పని చేస్తున్నారని తెలిపారు.
ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు, ఇరిగేషన్, కొవిడ్ -19, ఇంటిగ్రేటెడ్ మార్కెట్, ఆర్.ఓ.ఎఫ్.ఆర్ లపై మంత్రులిద్దరు సంబంధిత శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులతో ములుగు జిల్లాలోని కలెక్టరేట్లో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..ఈసారి ధాన్యం కొనుగోలు కోసం ప్రభత్వుం రూ. 20వేల కోట్లను పౌర సరఫరాల శాఖకు బ్యాంక్ గ్యారంటీ ఇచ్చారన్నారు. గత ఏడాది అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఈసారి రవాణా సదుపాయాలలో లోటు లేకుండా గోనె సంచులు తక్కువ కాకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్నారు.
అదేవిధంగా గోదాముల సామర్థ్యం, పంట దిగుబడికి తగ్గట్లుగా ఉండే విధంగా చూసుకోవాలన్నారు.
రైతులు తమ ధాన్యాన్ని తాలు లేకుండా తేమ శాతం 17 మించకుండా ఉండేలా చూసుకోవాలని విజ్ఞప్తి చేశారు.రైతుల ధాన్యాన్ని తాలు, తేమ పేరుతో కోత విధించకుండా మిల్లర్లకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని అధికారులకు సూచించారు.
ప్రతి ఒక్కరు కరోనా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. సాగునీటి పనులు పక్కాగా చేపట్టాలన్నారు. సీఎం కేసీఆర్ వచ్చే ఆరు నెలల్లో ఇంటిగ్రేటెడ్ మార్కెట్లు పూర్తి చేయాలని ఆదేశించిన నేపథ్యంలో మార్కెట్ల పనులు వేగవంతం చేయాలన్నారు.
అంతకు ముందు ములుగు జిల్లా గట్టమ్మ దేవాలయంలో పూజలు చేశారు. అనంతరం సంచార చేపల విక్రయ వాహానాన్ని ప్రారంభించారు. సమావేశంలో ఎంపీ మాలోతు కవిత, ఎమ్మెల్యేలు వెంకటరమణారెడ్డి, పెద్ది సుదర్శన్ రెడ్డి, సీతక్క, జిల్లా కలెక్టర్లు, అధికారులు, ఇతర ప్రజా ప్రతినిధులు, నేతలు పాల్గొన్నారు.