వర్షంతో నిలిచిపోయిన కరెంటు
తల్లీబిడ్డ క్షేమం.. స్థానికుల ప్రశంసలు
పెనుబల్లి, జూలై 8 : ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలంలోని ఎడ్లబంజరు గ్రామానికి చెందిన మహిళకు లంకాసాగర్ పీహెచ్సీ వైద్యులు టార్చిలైట్ల వెలుతురులో ప్రసవం చేసి శభాష్ అనిపించుకొన్నారు. మేడిపల్లి దుర్గా భవానికి గురువారం అర్ధరాత్రి పురిటినొప్పులు రావడంతో పీహెచ్సీకి తీసుకొచ్చారు.
సాధారణ ప్రసవం చేసేందుకు శుక్రవారం తెల్లవారుజామున మూడు గంటలకు వైద్యురాలు శాంతారాణి ప్రయత్నిస్తుండగా గాలులు వీయడం, భారీ వర్షం కురవడంతో విద్యుత్తు సరఫరాకు అంతరాయం ఏర్పడింది. దీంతో టార్చిలైట్లు, సెల్ఫోన్ లైట్లు ఉపయోగించి పురుడు పోశారు. ఆడశిశువు జన్మించగా తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారు. వైద్యసిబ్బంది సేవలను గ్రామస్థులు అభినందించారు.