ఇబ్రహీంపట్నం, జనవరి 22 : రాష్ట్ర ప్రభుత్వం ఫార్మా సిటీని ఏర్పాటు చేసి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయటంతోపాటు నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నదని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. దీన్ని జీర్ణించుకోలేని కాంగ్రెస్, బీజేపీ నేతలు దుష్ప్రచారానికి ఒడిగట్టారని ఆయన ఆరోపించారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం లో సుమారు 60 రోజులపాటు తన కుమారుడు మంచిరెడ్డి ప్రశాంత్కుమార్రెడ్డి చేపట్టిన ప్రగతి నివేదన పాదయాత్రను ఆదివారం యాచారం నందినపర్తిలో కిషన్రెడ్డి ప్రారంభించి మాట్లాడారు.
యాచారం మండలం మేడిపల్లి, కందుకూరు మండలంలోని మీరఖాన్పేట్ తదితర ప్రాంతాలను కలుపుతూ.. సుమారు 19 వేల ఎకరాల్లో ఫార్మాసిటీని ఏర్పాటు చేసిందని అన్నారు. ఫార్మాసిటీ ఏర్పాటుకు గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే ప్రతిపాదనలు రూపొందించారని, దాని ఆధారంగానే తమ ప్రభుత్వం ముందుకొచ్చిందని తెలిపారు. ఫార్మాసిటీ ఏర్పాటుకు ప్రస్తుత కేంద్ర ప్రభుత్వమే అనుమతులు మంజూరు చేసిందని చెప్పారు. ఫార్మాసిటీ ఏర్పాటులో భూములు కోల్పోయిన ప్రతి ఒక్కరికి పరిహారంతోపాటు ఇంటి స్థలాన్ని కూడా కేటాయించిందని చెప్పారు. కాంగ్రెస్ నాయకులు పరిహారం తీసుకున్న కొంతమంది రైతులను వెంటేసుకొని పాదయాత్రను చేపట్టడం సిగ్గుచేటన్నారు.