వరంగల్ : రాష్ట్రంలోని పీజీ డెంటల్ సీట్ల భర్తీకి ఆన్లైన్లో దరఖాస్తులను ఆహ్వానిస్తూ కాళోజి ఆరోగ్య విశ్వవిద్యాలయం బుధవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. విశ్వవిద్యాలయ పరిధిలోని కన్వీనర్ కోటా సీట్లను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. జాతీయ స్థాయి అర్హత పరీక్షా నీట్ ఎండీఎస్-2022లో అర్హత సాధించిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నెల 25న ఉదయం 8 గంటల నుంచి 31వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఆన్లైన్లో దరఖాస్తు సమర్పించాలని సూచించారు. దరఖాస్తుతో పాటు సర్టిఫికెట్లను స్కాన్ చేసి వెబ్సైట్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుందని తెలిపారు.
సమర్పించిన దరఖాస్తులు, సర్టిఫికెట్లను యూనివర్సిటీ అధికారులు పరిశీలించిన అనంతరం అర్హుల తుది జాబితాను విడుదల చేయనున్నారు. దరఖాస్తులను https://tsmds.tsche.in వెబ్ సైట్ ద్వారా నమోదు చేసుకోవచ్చు. ప్రవేశాలకు సంబంధించిన పూర్తి వివరాల కొరకు యూనివర్సిటీ వెబ్సైట్ www.knruhs.telangana.gov.in ను సంప్రదించాలని యూనివర్సిటీ వర్గాలు ఒక ప్రకటనలో తెలిపారు.