హైదరాబాద్, మే 31 (నమస్తే తెలంగాణ): కేంద్ర ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలకు వ్యతిరేకంగా పెట్రో ల్ బంకుల డీలర్లు దేశవ్యాప్తంగా ఒక్క రోజు సమ్మె చేపట్టారు. ‘నో పర్చేజ్ డే’ నినాదంతో మంగళవారం కంపెనీల నుంచి పెట్రోల్, డీజిల్ కొనుగోళ్లను బంద్చేశారు. అన్ని సేల్స్ పాయింట్ల వద్ద బైఠాయించి ఇంధన సరఫరాను అడ్డుకొన్నారు. గతంలో ఇచ్చిన హామీ ప్రకారం ప్రతి ఆరు నెలలకోసారి డీలర్ల మార్జిన్ను పెంచాలని, ఇంధన ధరల తగ్గింపుతో జరిగిన నష్టాన్ని భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. డీలర్లను సంప్రదించకుండా కేంద్రం ఇటీవల అకస్మాత్తుగా ఇంధన రేట్లను తగ్గించడంతో భారీగా నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేశా రు. అప్పటికే పాత ధరతో కొనుగోలు చేసిన స్టాక్ను తగ్గింపు ధరతో విక్రయించుకోవాల్సి వచ్చిందని, ఒక్కో డీలర్ కనీసం రూ.10-25 లక్షలు నష్టపోవాల్సి వచ్చిందని వాపోయారు. తమ విజ్ఞప్తులను కేంద్రం, చమురు కంపెనీలు వినిపించుకోవడం లేదని, దిక్కుతోచని స్థితిలో ‘నో పర్చేజ్ డే’ నిర్వహించాల్సి వచ్చిందని తెలంగాణ పెట్రోల్ డీలర్ల సంఘం ప్రధాన కార్యదర్శి వినోద్ విశ్వనాథ్ తెలిపారు.
రూ.200-300 కోట్ల నష్టం
ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 3,400 పెట్రోల్ బంకులున్నాయి. ఇటీవల కేంద్రం పెట్రోల్, డీజిల్ ధరలను రూ.9 వరకు తగ్గించడంతో రాష్ట్రంలోని డీలర్లకు మొత్తంగా రూ.200-300 కోట్ల నష్టం వాటిల్లినట్టు అసోసియేషన్ ప్రతినిధులు వెల్లడించారు. దేశవ్యాప్తంగా ఈ నష్టం రూ.3 వేల కోట్ల వరకు ఉంటుందని తెలిపారు. కేంద్రం నిర్వాకంతో గ్రామీణ ప్రాంతాల్లోని బంకులు మూతపడే పరిస్థితి దాపురించిందన్నారు.
బంకుల్లో ‘నో స్టాక్’ బోర్డులు
కేంద్రం దెబ్బతో బంకుల్లో పెట్రోల్, డీజిల్ స్టాక్ పెట్టుకొనేందుకు డీలర్లు జంకుతున్నారు. అవసరమైన మేరకే కొనుగోలు చేస్తున్నారు. ఒక రోజు బంకును మూసివేసేందుకైనా సిద్ధపడుతున్నారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా, ప్రత్యేకించి హైదరాబాద్లో ఎక్కడ చూసి నా బంకుల ముందు ‘నో స్టాక్’ బోర్డులు దర్శనమిస్తున్నాయి. 50% బంకుల్లో ఇదే పరిస్థితి నెలకొన్నది. దీనికితోడు మంగళవారం ‘నో పర్చేజ్ డే’ నిర్వహించనున్నట్టు ప్రకటించడంతో బంకుల్లో పెట్రోల్, డీజిల్ నిల్వలు పూర్తిగా అయిపోయాయి.
కేంద్ర వైఖరి దారుణం..
డీలర్ల పట్ల కేంద్రం వ్యవహరిస్తున్న తీరు దారుణంగా ఉన్నదని తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు అమరేందర్రెడ్డి, వినోద్ విశ్వనాథ్ ధ్వజమెత్తారు. కేంద్రం తమతో కనీసం మాట మాత్రంగానైనా చర్చించకుండా అకస్మాత్తుగా ధరలు తగ్గించి దెబ్బ కొట్టిందని మండిపడ్డారు. ఇలాంటి అనాలోచిత నిర్ణయాలను ఇకపై ఉపేక్షించే పరిస్థితి లేదని, తమ డిమాండ్లను నెరవేర్చే వరకు వరుసగా పోరాటాలు చేస్తామని హెచ్చరించారు.