హైదరాబాద్, జనవరి 4 (నమస్తే తెలంగాణ): గౌరవప్రదమైన జీవితాన్ని కొనసాగించే అవకాశాన్ని కల్పించాలని జాతీయ మహిళా కమిషన్ను కోరే వినతులు రోజురోజుకు ఎక్కువవుతున్నాయి. శారీరక, మానసిక హింసను తట్టుకోలేక, న్యాయం చేయాలని, రక్షణ కల్పించాలని వేడుకొంటున్నారు. గత ఏడేండ్లలో ఎన్నడూలేని విధంగా ఈ సంవత్సరం అత్యధిక ఫిర్యాదులు అందినట్టు తాజా నివేదిక వెల్లడిస్తున్నది. దేశవ్యాప్తంగా 2014లో 33,906 ఫిర్యాదులు అందాయి. ఆ తర్వాత తగ్గుతూ వచ్చాయి. అయితే ఈ ఏడాది ఫిర్యాదులు 30,865కి చేరాయి. ఇందులో సగానికి పైగా 15,828 (51.28శాతం) కేవలం ఉత్తరప్రదేశ్ నుంచే రావడం గమనార్హం. దేశవ్యాప్తంగా నమోదైన మొత్తం కేసుల్లో గౌరవప్రదమైన జీవితాన్ని కొనసాగించే హక్కుల కేసులే 11,085 ఉన్నాయి.
పెరుగుతున్న గృహహింస, సైబర్ దాడులు
కరోనా వల్ల ఆర్థిక వ్యవస్థ దెబ్బతినటం కూడా మహిళలపై ప్రభావం చూపింది. పురుషులు తమ అశక్తతను స్త్రీలపై వెళ్లదీసినట్టు నివేదిక తెలిపింది. 2013-14లో గృహహింస కేసులు 5,294 నమోదు కాగా, గత ఏడాది గృహహింస ఫిర్యాదులు 6,684 నమోదయ్యాయి. సైబర్ నేరాలపైనా మహిళల ఫిర్యాదులు క్రమంగా పెరుగుతున్నాయి. ఈ ఏడాది ఏకంగా 863 ఫిర్యాదులు అందాయి.
మహిళా కమిషన్కు వచ్చిన ఫిర్యాదులు
సంవత్సరం : ఫిర్యాదుల సంఖ్య
2013-14 : 17,562
2019-20 : 20,309
2020-21 : 26,513
2021-22 : 30,865