హైదరాబాద్, ఫిబ్రవరి 24 (నమస్తే తెలంగాణ) : ఇంటర్ వార్షిక పరీక్షలకు హాల్టికెట్ ఉంటేనే అనుమతిస్తామని ఇంటర్బోర్డు ప్రకటించింది. లేదంటే అస్సలు అనుమతించబోమని బోర్డు స్పష్టంచేసింది. ఇంటర్ వార్షిక పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభంకానున్నాయి. వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న హాల్టికెట్లను పరీక్షకు అనుమతిస్తారు. హాల్టికెట్పై ప్రిన్సిపాల్ సంతకం లేకపోయినా ఎంట్రీ ఉంటుంది.
ఒక్క హాల్టికెట్ వెంట ఉంటే సరిపోతుంది. ఎలాంటి గుర్తింపు పత్రాలు అవసరంలేదు. బుధవారం ఫస్టియర్ విద్యార్థులకు పరీక్షలు జరుగనుండగా, గురువారం నుంచి సెకండియర్ విద్యార్థులకు పరీక్షలు ప్రారంభమవుతాయి. మొత్తంగా 9.97లక్షల విద్యార్థులు పరీక్షలు రాయబోతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 1,495 పరీక్షకేంద్రాలు ఏర్పాటు చేశారు.
తాజాగా సమాధాన పత్రాల మూల్యాంకనం షెడ్యూల్ను ఇంటర్బోర్డు ప్రకటించింది. మార్చి 4 నుంచి సంస్కృతం పేపర్ల మూల్యాంకనం ప్రారంభమవుతుంది. మార్చి 15నుంచి మొదటి విడత, మార్చి 18నుంచి రెండో విడత, మార్చి 20 నుంచి మూడో విడత మూల్యాంకనం ప్రారంభమవుతుంది. ఏప్రిల్ రెండో వారంలో ఫలితాలు విడుదల చేస్తారు.
ఇంటర్, పదోతరగతి పరీక్షలు రాసే విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆర్టీసీ అన్ని రకాల చర్యలు చేపట్టాలని ఉన్నతాధికారులను మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు. బస్సు ఆపరేషన్స్పై సచివాలయంలో మంత్రి పొన్నం సమీక్ష నిర్వహించారు. బస్సు స్టాప్ ఉన్నా.. లేకున్నా.. బస్సులు ఆగేలా, హాల్టికెట్ ఆధారంగా పరీక్ష కేంద్రం వద్ద విద్యార్థులను దింపేందుకు చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఈ విషయాన్ని కండక్టర్, డ్రైవర్లకు తెలియజేయాలని ఆదేశించారు.