హైదరాబాద్, జూన్ 27 (నమస్తే తెలంగా ణ): ఐఐటీలు, ఎన్ఐటీల్లో నాలుగేండ్ల ఇంటిగ్రేటెడ్ బీఎడ్ కోర్సులను ప్రవేశపెట్టే అంశంపై కీలక ముందడుగు పడింది. ఈ విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రంలోని ఎన్ఐటీ వరంగల్లో నాలుగేండ్ల బీఈడీ కోర్సుకు అనుమతి లభించింది. ఎన్ఐటీ వరంగల్లో బీఎస్సీ-బీఎడ్ కోర్సును 50 సీట్లతో నిర్వహిస్తారు.
ఎన్ఐటీ వరంగల్తోపాటు, గచ్చిబౌలిలోని మౌలానా ఆజాద్ జాతీయ ఉర్దూ యూనివర్సిటీ, లక్షెట్టిపేట ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో కలిపి మొత్తం 250 సీట్లకు అనుమతి లభించింది. ఆయా సీట్లను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) నిర్వహించే నేషనల్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (ఎన్సీఈటీ) ద్వారా భర్తీచేయనున్నారు. ఎన్సీఈటీ నోటిఫికేషన్ను ఎన్టీఏ ఇటీవలే విడుదల చేసింది. దరఖాస్తుల స్వీకరణ మంగళవారం నుంచే ప్రారంభమైంది. అభ్యర్థులు జూలై 19 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. వివరాల కోసం www.nta.ac.in, https://ncet .samarth.ac.in వెబ్సైట్లను సంప్రదించవచ్చు.