హైదరాబాద్, మార్చి 31 (నమస్తే తెలంగాణ): రైతులకు ఇచ్చిన హామీ మేరకు యాసంగి ధాన్యానికి క్వింటాలుకు రూ. 500 బోనస్ ఇవ్వాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేదంటే, ఇచ్చేంత వరకు వెంటాడుతామని హెచ్చరించారు. ఆదివారం పలు జిల్లాల్లో ఎండిన పంటలను పరిశీలించిన అనంతరం కేసీఆర్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. “పోయిన పంట పోగా ఎంతో కొంత పంట వస్తది కాబట్టి ఆ పంటకు ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే రూ. 500 బోనస్ కచ్చితంగా ఇచ్చి తీరాల్సిందే. లేదంటే వెంటాడుతాం. అన్ని పంటలకు బోనస్ ఇస్తమని మ్యానిఫెస్టోలోనే హామీ ఇచ్చారు. ఇప్పుడు ధాన్యం వస్తుంది కాబట్టి రూ. 500 బోనస్ ఇవ్వాల్సిందే. బోనస్ ఇచ్చేంత వరకు ప్రభుత్వాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఇందుకోసం అన్ని జిల్లాల బీఆర్ఎస్ నాయకులకు మనవి చేస్తున్నా, ధాన్యానికి రూ. 500 బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఏప్రిల్ 2న రైతుల పక్షాన జిల్లాల కలెక్టర్లకు మెమొరాండం అందించాలి. అదే రోజున బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హైదరాబాద్లో ప్రభుత్వానికి విజ్ఞప్తులు అందిస్తాం. పంటలకు రూ. 500 బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ 6న అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ఒక రోజు దీక్షలు చేయాలి. ఈ తోలుమందం ప్రభుత్వానికి నిరహార దీక్ష అవసరం లేదు. కడుపునిండా తినే దీక్ష చేయండి చాలు. ఈ ప్రభుత్వం కోసం మనం ఊపవాసం ఉండాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత కొనుగోలు కేంద్రాల వద్ద ప్రభుత్వాన్ని నిలదీయాలి.
కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి
బీఆర్ఎస్ ప్రభుత్వంలో 7600కు పైగా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశాం. కానీ ఇప్పుడు ఎన్ని కేంద్రాలు పెడతారో ఇప్పటికీ చెప్పడం లేదు. రేపటి నుంచే కొనుగోలు అని చెప్పారు. ప్రజలను ఏప్రిల్ ఫూల్ చేద్దామని అనుకుంటున్నారా?. గతంలో కన్నా ఒక్క కేంద్రం తక్కువగా పెట్టిన ఊరుకోం” అని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కేసీఆర్ హెచ్చరించారు.రాజన్న సిరిసిల్ల జిల్లాలో యాసంగి వరి కోతలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి.
కోనరావుపేట మండలం నిజామాబాద్ గ్రామంలోని సబ్ మార్కెట్కు ధాన్యం పోటెత్తింది. అయితే ప్రభుత్వం కొనుగోళ్లలో జాప్యం చేయడంతో రైతులు ధాన్యం విక్రయించేందుకు ఇబ్బందులు పడుతున్నారు. కొనుగోలు చేపట్టకపోతే ధాన్యం దళారుల పాలుకాక తప్పదని రైతులు ఆందోళన చెందుతున్నారు.