హైదరాబాద్, సెప్టెంబర్ 15 (నమస్తే తెలంగాణ): ఒకప్పుడు ప్రభుత్వ వైద్యంపై ప్రజలకు పెద్దగా నమ్మకం ఉండేది కాదు. చిన్న జ్వరం నుంచి పెద్ద రోగాల వరకు ప్రైవేట్కు పరిగెత్తడానికే మొగ్గు చూపేవారు. కానీ స్వరాష్ట్రంలో పరిస్థితి మారింది. వైద్యరంగాన్ని సీఎం కేసీఆర్ బలోపేతం చేస్తుండటం, మౌలిక వసతులు కల్పిస్తుండటంతో ప్రజావైద్యంపై నమ్మకం పెరిగింది. ‘నేను రాను బిడ్డో..’ అంటూ గతంలో బెంబేలెత్తిన ప్రజలే ఇప్పుడు ‘పోదాం పద సర్కారు దవాఖానకు’ అంటున్నారు. ఇందుకు టీచింగ్ హాస్పిటళ్లలో పెరిగిన ఔట్పేషెంట్ (ఓపీ) సేవలే నిదర్శనం. కొవిడ్ కారణంగా రెండున్నరేండ్లుగా ఓపీ తగ్గుముఖం పట్టింది. కానీ.. 2015-2019 మధ్య బోధనా దవాఖానల్లో ఓపీ ఏకంగా 70 శాతం పెరిగింది. ఇదే కాలంలో వ్యాధి నిర్ధారణ పరీక్షలు, డయాగ్నోస్టిక్స్ పరీక్షలు సైతం గణనీయంగా పెరిగాయి. దవాఖానల్లో పడకల సంఖ్యను సైతం ప్రభుత్వం పెంచుతున్నది. 2015లో 8,215 పడకలు ఉండగా.. అవి 2021 నాటికి 11,215కు పెరిగాయి. అంటే సర్కారు దవాఖానల సామర్థ్యం 36 శాతం పెరిగింది.
43 లక్షల నుంచి 73 లక్షలకు..
2015లో రాష్ట్రవ్యాప్తంగా 19 టీచింగ్, అనుబంధ దవాఖానలు ఉన్నాయి. ఆ ఏడాది వీటిల్లో 43.60 లక్షలమంది ఔట్పేషెంట్లుగా సేవలు వినియోగించుకున్నారు. ప్రభుత్వం సదుపాయాలు కల్పిస్తుండటంతో ఓపీ క్రమంగా పెరిగింది. 2019 నాటికి ఏకంగా ఆ సంఖ్య 73.80 లక్షలకు చేరుకున్నది. కేవలం ఐదేండ్లలోనే ఓపీ 70 శాతం పెరగడం గమనార్హం. 2020లో కొవిడ్ విజృంభించడం, ఇప్పటికీ పూర్తిగా అదుపులోకి రాకపోవడంతో రెండేండ్లపాటు ఓపీ కొంత తగ్గింది. ఈ ఏడాది మళ్లీ ఓపీ సేవలు పుంజుకున్నాయని వైద్యులు చెప్తున్నారు.
పరీక్షలు డబుల్.. డెలివరీలు ట్రిపుల్
టీచింగ్ హాస్పిటళ్లలో పాథాలజీ, బయోకెమిస్ట్రీ, మైక్రోబయాలజీ, ఎక్స్రే, ఈసీజీ, యూఎస్జీ, సీటీ స్కాన్, ఎంఆర్ఐ స్కాన్, టీబీ, హెచ్ఐవీ, మధుమేహం వంటి వ్యాధుల నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఏడేండ్లలో ఈ వ్యాధి నిర్ధారణ, డయాగ్నోస్టిక్ సేవలు రెట్టింపయ్యాయి. ప్రసవాల సంఖ్య ఏకంగా మూడు రెట్లు పెరిగింది.
2015లో 16 లక్షల బయో కెమిస్ట్రీ పరీక్షలు నిర్వహించగా, 2021లో 36.72 లక్షల పరీక్షలు నిర్వహించారు.
మైక్రోబయాలజీ పరీక్షలు 5.13 లక్షల నుంచి.. 11.29 లక్షలకు పెరిగాయి.
2015లో పాథాలజీ పరీక్షలు 12.55 లక్షలు జరుగగా.. 2021 నాటికి 14.19 లక్షలకు చేరుకున్నాయి.
2015లో 64,308 ప్రసవాలు జరుగగా.. 2021 నాటికి ఈ సంఖ్య 1,89,390కి పెరిగింది.
టీచింగ్ హాస్పిటళ్లలో నార్మల్ డెలివరీలు సైతం పెరిగాయి. 2015లో 57 శాతం సాధారణ కాన్పులు కాగా, 20 21 నాటికి అది 63 శాతానికి పెరిగింది.