బంగారు తెలంగాణ లక్ష్య సాధనలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే అనేక విజయాలు సాధించారనీ, సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక పునరుజ్జీవంతో దేశానికే తెలంగాణ దిక్సూచిలా మారిందని అంటున్నారు పీపుల్స్స్టార్ ఆర్. నారాయణ మూర్తి. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో రాణించి, సమాఖ్య స్ఫూర్తికి విఘాతం కలిగించే ప్రతీప శక్తులపై విజయం సాధించాలని ఆకాంక్షించారు. తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని ఆయన ‘నమస్తే తెలంగాణ’తో ప్రత్యేకంగా సంభాషించారు. గత పదేండ్లలో తెలంగాణలో జరిగిన అభివృద్ధి, సినీ రంగం సాధించిన విజయాలపై నారాయణ మూర్తి అంతరంగం..
అప్పట్లో తెలుగు సినిమా రంగంలో తెలంగాణ ప్రాతినిధ్యం చాలా తక్కువగా ఉండేది. అలాంటి
పరిస్థితుల్లోనూ తెలంగాణకు చెందిన కాంతారావు అగ్ర హీరోలైన ఎన్టీఆర్, ఏఎన్నార్ల తర్వాత అంతటి పాపులారిటీ సంపాదించుకున్నారు. నటుడు, రచయిత, నిర్మాత ప్రభాకర్రెడ్డి ఆగమనంతో తెలుగు సినీరంగంలో తెలంగాణ వారి ప్రాబల్యం క్రమంగా పెరగడం ప్రారంభమైంది. ఆయన ప్రోత్సాహంతో తెలంగాణకు చెందిన ఔత్సాహిక ప్రతిభావంతులు మద్రాస్ బాట పట్టారు. అనంతర కాలంలో బి.ఎస్.నారాయణ, బి.నర్సింగ రావు, శ్యామ్ బెనగల్ వంటి దర్శకులు అభ్యుదయ, సమాంతర చిత్రాల దర్శకులుగా తెలుగు సినిమాల్లో కొత్త ఒరవడి సృష్టించారు. హెచ్.ఎం.రెడ్డి రూపొందించిన ‘భక్త ప్రహ్లాద’ చిత్రానికి సాహిత్యాన్ని అందించిన చందాల కేశవదాసు తెలంగాణకు చెందినవారే. తెలుగు సినీ చరిత్రలో తొలి గీత రచయితగా ఆయన ఖ్యాతినార్జించారు.
తెలంగాణ సినిమా చరిత్రలో ప్రముఖ నటుడు పైడి జయరాజ్ స్థానం విశిష్టమైంది. ధర్మేంద్ర వంటి అగ్ర హీరోలు రాకముందే హిందీ సినిమాను శాసించిన నటుల్లో ఆయన ఒకరు. దాదాసాహెబ్ ఫాల్కే వంటి అత్యున్నత పురస్కారంతో తెలంగాణకు గౌరవాన్ని తీసుకొచ్చారు. ఇక సాహిత్యపరంగా తెలంగాణ నేల జానపదాలకు తల్లి లాంటిది. ఇక్కడ ప్రతి ఇంట్లో ఓ కవి కనిపిస్తాడు. అమోఘమైన జానపద సాహిత్యం ఈ మాగాణం నుంచి ఉద్భవించింది. దాశరథి సోదరులు, సినారె, గద్దర్, గోరటి వెంకన్న, సుద్దాల అశోక్ తేజ, అందెశ్రీ, చంద్రబోస్, జయరాజ్, సదాశివ మాస్టారు, వరంగల్ శ్రీనివాస్, రామ నర్సయ్య, గూడ అంజన్న వంటి రచయితలు చక్కటి విద్వత్తును ప్రదర్శించి తెలంగాణ పాటను సుసంపన్నం చేశారు. అలాగే ఒగ్గుకథ, యక్షగానం వంటి కళారూపాలు ఈ నేలకు ప్రాశస్త్యాన్ని తీసుకొచ్చాయి.
తెలంగాణ ప్రజల్లో అణువణువునా ఉద్యమ స్ఫూర్తి కనిపిస్తుంది. ప్రజా పోరాటాలకు వాళ్లెప్పుడూ సిద్ధంగా ఉంటారు. రైతాంగ సాయుధ పోరాటం, నిజాం వ్యతిరేక పోరాటం, తెలంగాణ తొలి, మలి దశ ఉద్యమాలు నేపథ్యంగా బి.నర్సింగరావు, శ్యామ్బెనగల్, ఎన్.శంకర్ వంటి దర్శకులు గొప్ప చిత్రాల్ని తీశారు. ఆ పరం
పరలో నేనూ ఒకడిని కావడం గర్వంగా భావిస్తున్నా. వీర తెలంగాణ, పోరు తెలంగాణ చిత్రాల ద్వారా తెలంగాణ ఉద్యమానికి నావంతు చేయూతనందించాననే సంతృప్తి ఉంది.
ప్రధాన స్రవంతి తెలుగు చిత్రాల్లో కొన్ని దశాబ్దాల పాటు తెలంగాణ యాస, భాషను కామెడీ, విలన్ పాత్రలకు ఆపాదించి చూపెట్టారు. కేసీఆర్ తెలంగాణ రాష్ర్టాన్ని సాధించిన తర్వాత ఈ ధోరణికి అడ్డుకట్ట పడింది. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని, మట్టి పరిమళాలను, సంస్కృతి, సంప్రదాయాలను గుండెల్లో నింపుకొన్న యువ దర్శకులు వెలుగులోకి వస్తున్నారు. గొప్ప గొప్ప కథలు వెండితెర మీద ఆవిష్కృతం అవుతున్నాయి. తెలంగాణ కవులు, కళాకారులు, సాంకేతిక నిపుణులు అద్భుత ప్రతిభతో విరాజిల్లుతున్నారు. ఈ రోజు టాలీవుడ్ దర్శకుల్లో తెలంగాణ బిడ్డల హవా నడుస్తున్నది. ఇండస్ట్రీలోనే అగ్ర నిర్మాతగా దిల్రాజు కొనసాగుతున్నారు. ఒకప్పుడు తెలంగాణ దర్శకులంటే బి.ఎస్.నారాయణ, బి.నర్సింగరావు, ఎన్.శంకర్ పేర్లు మాత్రమే వినిపించేవి. నేడు ఆ జాబితా చాలా పెద్దదైపోయింది. ఇటీవల వచ్చిన ‘దసరా,’ ‘బలగం’ చిత్రాలతో శ్రీకాంత్ ఓదెల, వేణు ఎల్దండి తెలంగాణ మట్టికథల సత్తా చాటారు.‘బలగం’ చిత్రానికి ఆస్కార్ కూడా రావొచ్చనే ఊహాగానాలు సంతోషాన్ని కలిగిస్తున్నాయి.
అన్యాయాలపై తిరగబడి పోరాడే సత్తా కేసీఆర్లో పుష్కలంగా ఉంది. తెలంగాణ కోసం ఆయన ప్రాణాలకు తెగించి ఆమరణ దీక్ష చేశారు. రాష్ర్టాన్ని సాధించుకున్నారు. ఓరకంగా తెలంగాణ రాష్ర్టానికి ఆయనను జాతి
పితగా అభివర్ణించవచ్చు. రాజకీయ ఎత్తుగడలు, తెలివితేటల్లో కేసీఆర్.. దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావులా చాణక్య నీతిని ప్రదర్శిస్తారు. మడమతిప్పని పోరాటంలో ఎన్టీఆర్ను తలపిస్తారు. ఈ రెండు గొప్ప లక్షణాలూ ఉన్నాయి కాబట్టే, ఆయన దేశ రాజకీయాల్లో విజయం సాధించాలని, కేంద్రం పెత్తనంపై పోరు సాగించాలని, సమాఖ్య స్ఫూర్తిని నిలబెట్టాలని నేను బలంగా ఆకాంక్షిస్తున్నా. కేసీఆర్ స్వయంగా రైతు కాబట్టి ఆయనకు రైతులంటే ఎనలేని ప్రేమ. నేడు దేశవ్యాప్తంగా రైతన్నలు ఎన్నో కష్టాలు ఎదుర్కొంటున్నారు. ఆ మట్టి మనుషుల సమస్యలను తీర్చేలా కేసీఆర్ జాతీయ స్థాయిలో పోరాటం చేస్తారని భావిస్తున్నా. తెలంగాణ వస్తే రాష్ట్రం చీకట్లో మగ్గుతుందని నాటి సీఎం కిరణ్కుమార్ రెడ్డి అన్నారు. కానీ నేడు రైతులకు 24 గంటలు ఉచిత విద్యుత్ అందుతున్నది. బంగారు తెలంగాణ లక్ష్యసాధనలో ఇప్పటికే కేసీఆర్ చాలా విజయాలు సాధించారు. రాజకీయ, సామాజిక, ఆర్థిక రంగాలతో పాటు కళారంగంలోనూ తెలంగాణ దూసుకు పోతున్నది. సమస్త ప్రజానీకానికి ‘దశాబ్ది’ శుభాకాంక్షలు.
ఒకప్పుడు అవహేళనకు, అవమానాలకు గురైన తెలంగాణ యాస నేడు వెండితెర సక్సెస్ ఫార్ములాగా మారింది. అగ్ర హీరోలు కూడా తెలంగాణ యాసలో మాట్లాడటానికి మక్కువ చూపిస్తున్నారు. సినిమాల పరంగా తెలంగాణ సాధించిన గొప్ప సాంస్కృతిక పరివర్తన ఇది. తెలంగాణ యాస, భాషల్లో దాగిఉన్న మహాద్భుత సౌందర్యం నేడు వెండితెరను పులకింపజేస్తున్నది. వినసొంపైన ఈ యాసను ప్రాంతాలకు అతీతంగా అందరూ ఇష్టపడుతున్నారు. సినిమా షూటింగ్ లొకేషన్స్కు కూడా తెలంగాణ కేంద్రంగా మారింది. ఎక్కడ కెమెరా పెట్టినా మనోహర దృశ్యాలు కనిపిస్తున్నాయి. కాళేశ్వరంతో పాటు కృష్ణా నది మీద కడుతున్న ప్రాజెక్ట్లతో తెలంగాణ సస్యశ్యామలంగా మారిపోతున్నది. ఐ యామ్ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ తెలంగాణ.
కళాధర్ రావు జూలపల్లి