హైదరాబాద్, జనవరి 3 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు జాతీయ రాజకీయాల్లోకి రావడాన్ని స్వాగతిస్తున్నామని సీపీఐ ప్రధాన కార్యదర్శి డీ రాజా చెప్పారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి ఓటమి తప్పదన్నారు. దేశంలో సమాఖ్య స్వభావాన్ని బీజేపీ దెబ్బ తీస్తున్నదని అన్నారు. హైదరాబాద్ వచ్చిన రాజా సోమవారం ‘నమస్తే తెలంగాణ’కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.
దక్షిణాది రాష్ర్టాల్లో బీజేపీ బలపడుతుందా?
దేశవ్యాప్తంగా, ముఖ్యంగా దక్షిణాదిలో బీజేపీపై అసంతృప్తి పెరుగుతున్నది. హైదరాబాద్ను దక్షిణాదికి గేట్వే అని బీజేపీ వాదించింది. కానీ ఏమీ సాధించలేకపోయింది. ప్రజలను తప్పుదోవ పట్టించి ప్రభావితం చేసేందుకు ప్రయత్నిస్తున్నది.
డబుల్ ఇంజిన్ గవర్నెన్స్ ప్రచారాన్ని ఎలా చూడవచ్చు?
డబుల్ ఇంజిన్ ప్రజాస్వామ్యానికి రెట్టింపు ప్రమాదం. బీజేపీ పాలిత కర్ణాటక, ఉత్తరప్రదేశ్లో ఏమైనా అభివృద్ధి జరిగిందా? మహారాష్ట్రతో కర్నాటకకు సరిహద్దు వివాదం, ఉత్తరప్రదేశ్లో శాంతిభద్రతల సమస్య.
కేంద్రం దక్షిణాది రాష్ట్రాల పట్ల ఎందుకువివక్ష చూపుతున్నది?
ఇది దురదృష్టకరం. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణ, రాజస్థాన్, ఢిల్లీ పట్ల వివక్ష చూపుతున్నది. జీఎస్టీ చెల్లింపుపై తమిళనాడు ప్రభుత్వం బహిరంగంగానే కేంద్రాన్ని తప్పు పట్టింది. రాష్ట్రాల అధికారాలన్నింటినీ కేంద్రం లాక్కుంటున్నది.
బీఆర్ఎస్తో సీపీఐ పొత్తు పెట్టుకుంటుందా?
ఇటీవల మునుగోడు ఉపఎన్నికలో మేము వారికి మద్దతు ఇచ్చాము. జాతీయ స్థాయిలో, ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన అబ్కీ బార్ కిసాన్ సరార్ నినాదాన్ని మేము స్వాగతిస్తున్నాం. జాతీయ స్థాయి పొత్తుల విషయంలో ఇంకా ఎలాంటి నిర్ణయం జరగలేదు. బీఆర్ఎస్ విధానాలు చూసిన తర్వాత మేం తుది నిర్ణయం తీసుకుంటాం. దీనికి ఇంకా సమయం ఉంది.
జాతీయ రాజకీయాల్లో దక్షిణాది పార్టీల పాత్ర ఏమిటి?
కేంద్రంలో బీజేపీ కూటమితో పోరాడటానికి ప్రాంతీయ పార్టీలు మరింత బలోపేతం కావా లి. ఆ దిశగా సీఎం కేసీఆర్ ప్రయత్నిస్తున్నారు.
గవర్నర్ వ్యవస్థను రద్దు చేయాలని సీపీఐ ఎందుకు డిమాండ్ చేస్తున్నది?
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలపై అనవసర పెత్తనం చేసేందుకు ప్రయత్నిస్తున్నది. తన రాజకీయ ఎజెండాను నడపడానికి గవర్నర్ కార్యాలయాన్ని ఉపయోగిస్తున్నది. తమిళనాడులో ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వం కన్నా గవర్నర్ పైచేయిగా వ్యవహరిస్తున్నారు. కేరళ, తెలంగాణలో కూడా అలజడి నెలకొంది. ప్రస్తు త కాలంలో గవర్నర్ల ప్రాముఖ్యత ఏమిటని రాజకీయ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. గవర్నర్లు అన్ని అధికారాలు తమ చేతుల్లో ఉన్నాయని భావిస్తారు. దీన్ని సీపీఐ వ్యతిరేకిస్తున్నది.
సీఎం కే చంద్రశేఖర్రావు నేతృత్వంలోని బీఆర్ఎస్పై మీ అభిప్రాయం?
ఇది సానుకూల పరిణామం. గతంలో జాతీయ రాజకీయాల్లో ప్రాంతీయ పార్టీలు కీలక పాత్ర పోషించాయి. మాజీ ప్రధాని వీపీ సింగ్ ప్రాంతీయ పార్టీ నాయకుడిగా ఉండి జాతీయ గుర్తింపు పొందారు. ఏ పార్టీ నుంచి వచ్చిన నాయకుడైనా జాతీయ నాయకుడు కాగలడు.