హైదరాబాద్, జూలై 5 (నమస్తే తెలంగాణ): సర్వేంద్రియాణాం నయనం ప్రధానం. అవయవాల్లో అతి ముఖ్యమైన కంటిచూపుపై కూడా జనాల్లో నిర్లక్ష్యం పెరుగుతున్నది. మారిన ఆహార అలవాట్ల కారణంగా 50 ఏండ్లు నిండకుండానే చాలా మందిలో కంటిచూపు మందగిస్తున్నది. ముఖ్యంగా కంటిశుక్లం పెరిగిపోతున్నది. క్యాటరాక్ట్ నివారణకు ఆధునిక వైద్యం అందుబాటులోకి వచ్చినప్పటికీ నిర్లక్ష్యం చేస్తున్నారు. శస్త్రచికిత్స చేయించుకుంటే ఎక్కడ ఉన్న చూపు పోతుందోననే భయంతోనే దృష్టి సమస్యల నివారణకు ముందుకు వెళ్లడం లేదు. క్యాటరాక్ట్ అవేర్నెస్ నెలను పురస్కరించుకొని ప్రముఖ ప్రిస్టన్ కేర్ సంస్థ సర్వే నిర్వహించింది. 7000కు పైగా కంటిశుక్లం శస్త్రచికిత్సలను అధ్యయనం చేసింది. లక్షకుపైగా కంటిశుక్లం రోగులను ప్రశ్నించి అభిప్రాయాలను సేకరించింది.
దేశవ్యాప్తంగా ఎన్సీఆర్, ముంబై, కోల్కతా, బెంగళూరు, పుణె, హైదరాబాద్, చెన్నై మెట్రో నగరాల్లో 1,000 కంటే ఎకువ మంది నుంచి కంటిశుక్లం సమస్యలపై అభిప్రాయాన్ని సేకరించింది. వాటన్నింటినీ క్రోడికరించి ‘ది గ్రేట్ ఇండియన్ క్యాటరాక్ట్ సర్వే రిపోర్ట్ను ఇటీవలే వెల్లడించింది. ఆ నివేదిక ప్రకారం 50 ఏండ్లు నిండకుండానే దేశంలో చాలా మంది కాటరాక్ట్ సంబంధిత సమస్యల బారిన పడుతున్నారు. మొత్తంగా కంటిశుక్లం సమస్యలతో బాధపడుతున్న వారిలో 59 శాతం మంది 56 ఏండ్ల్ల వయస్సుపైబడిన వారే. అదే సమయంలో 55 శాతం కంటే ఎకువ మంది భారతీయులు కంటిశుక్లం శస్త్రచికిత్సలను నిర్లక్ష్యం చేస్తున్నారు. కంటి చూపు కోల్పోవడం, బాధాకరమైన విధానాలు, కోలుకునేందుకు సుదీర్ఘ సమయం పడుతుందనే అపోహలతోనే దాదాపు 73 శాతం మంది కాటరాక్ట్ ఆపరేషన్లను చేయించుకునేందుకు వెనకడుగు వేస్తున్నారు. అదీగాక ఇప్పటికీ చాలా మంది వృద్ధులే కంటిశుక్లం సమస్యకు గురవుతారనే భ్రమలో ఉంటున్నారని ఆ నివేదిక తేల్చిచెప్పింది.
పర్యావరణ కారకాలే ప్రధాన కారణం
అతి నీలలోహిత (యూవీ) కిరణాలకు ఎకువ కాలం బహిర్గతం కావడం, మధుమేహం, ధూమపానం, మద్యపానం, ఆహార కల్తీ, కాలుష్యం వంటి పర్యావరణ కారకాలే కంటిశుక్లం సమస్యకు ఎక్కువ కారణాలుగా నిలుస్తున్నాయని నివేదిక వెల్లడించింది. అందుకు యువ జనాభాలో పెరుగుతున్న కంటిశుక్లం కేసులు నిదర్శనమని ఉదహరించింది. కంటిశుక్లం శస్త్రచికిత్సలు 98 శాతం కంటే ఎకువ విజయవంతమవుతున్నాయని, శస్త్రచికిత్స చేయించుకున్న 10 మందిలో తొమ్మిది మందికి స్పష్టమైన చూపు వస్తున్నదని తెలిపింది. నేషనల్ ఐ ఇన్స్టిట్యూట్ చేసిన పరిశోధన ఈ విషయాన్ని తేల్చిచెప్పిందని ప్రిస్టన్ సర్వే వెల్లడించింది.
52 శాతం మంది భారతీయులు ప్రత్యేకమైన, అత్యంత అనుభవజ్ఞులైన సర్జన్లను ఎంచుకుంటున్నారని, 41 శాతం మంది అధునాతన సాంకేతికత చికిత్సకు మొగ్గు చూపుతున్నారని వివరించింది. కేవలం 26 శాతం మంది శస్త్రచికిత్స ప్రదేశం, కంటి వైద్యశాల ఆధారంగా తమ నిర్ణయం తీసుకుంటున్నారని నివేదిక తెలిపింది. ఆర్థిక స్థోమత, శస్త్రచికిత్స ఖర్చు భరించలేని స్థాయిలో 24 శాతం మంది మాత్రమే ఉన్నారని స్పష్టంచేసింది. కంటిశుక్లం శస్త్రచికిత్సలు చేయించుకున్న 83 శాతం మంది సంతృప్తి వ్యక్తం చేయడంతోపాటు శస్త్రచికిత్సపై ఉన్న అపోహలను కొట్టిపారేస్తున్నారని ఆ సర్వే వివరించింది. శస్త్రచికిత్స చేయించుకున్న 97 శాతం మంది, ఇతరులను కూడా అందుకు సిఫారసు చేస్తున్నారని ప్రిస్టన్ నివేదిక వెల్లడించింది.