న్యాయ వ్యవస్థ ద్వారా స్వార్థ ప్రయోజనాలు చేకూర్చుకోలేని వాళ్లు కోర్టు తీర్పులు, ఆదేశాలకు వక్రభాష్యం చెప్తూ పైశాచిక ఆనందం పొందుతున్నారు. పరిధి దాటినవారిని ఉపేక్షించడం రాజ్యాంగ విరుద్ధం. న్యాయవ్యవస్థలోని ఉన్నత వ్యక్తులపై అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా పరిగణిస్తాం.
– సీజేఐ ఎన్వీ రమణ
హైదరాబాద్, జూన్ 2 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర న్యాయ చరిత్రలో నూతన అధ్యాయనికి తెరలేచింది. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఒకేసారి 32 కొత్త రెవెన్యూ జిల్లా కోర్టులను హైకోర్టు ప్రాంగణంలో గురువారం ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావుతో కలిసి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ వర్చువల్గా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎన్వీ రమణ మాట్లాడుతూ ఒకేసారి 32 కొత్త రెవెన్యూ జిల్లాల్లో కోర్టులను ప్రారంభించటం న్యాయచరిత్రలో చారిత్రక ఘట్టమని అన్నారు. న్యాయ సంస్కరణలు చేపట్టడంలో తెలంగాణ రాష్ట్రం దేశానికే తలమానికంగా నిలిచిందని ప్రశంసించారు.
అద్భుతమైన ఉద్యమాన్ని నిర్మించి రాష్ర్టాన్ని సాధించిన ఉద్యమకారులకు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు. కొత్త రాష్ట్ర ఏర్పాటు సమయంలో ఎన్నో అనుమానాలు, రకరకాల చర్చలు జరిగాయని, 8 ఏండ్లలో ఆ సందేహాలన్నీ పటాపంచలయ్యాయని అన్నారు. ఎనిమిదో రాష్ట్ర ఆవిర్భావ వేడుక సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. పాలనా సంస్కరణలతోపాటు న్యాయవ్యవస్థ అభివృద్ధి కూడా ముఖ్యమని సీఎం కేసీఆర్ గుర్తించి, ఆ దిశగా అడుగులు వేయడంపై ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. విస్తృత సంక్షేమంలో భాగంగా తెలంగాణలో నేడు కొత్త అధ్యాయం మొదలైందని చెప్పారు. సాధారణ పరిపాలనా వికేంద్రీకరణతోపాటు న్యాయ వికేంద్రీకరణకు తెరతీసిందని పేర్కొన్నారు. గడప గడపకు న్యాయం చేరేలా మహాయాగానికి మనమంతా సిద్ధమయ్యామని చెప్పారు.
ఈ మహత్తర కార్యక్రమం తెలుగు నేలపై ప్రారంభమవటం గర్వకారణమని అన్నారు. పది జిల్లా కోర్టులు ఏకంగా 32 జిల్లాలకు పెరగడం చారిత్రకమని, దేశంలో ఇంత భారీస్థాయిలో జిల్లా న్యాయవ్యవస్థ వికేంద్రీకరణ జరగటం ఇదే తొలిసారి అని ప్రకటించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పాలనా సంస్కరణల్లో భాగంగా ఎన్టీఆర్ సీఎంగా ఉండగా మండల వ్యవస్థ ఏర్పాటు తర్వాత అంత పెద్దస్థాయిలో సంస్కరణ తెలంగాణ న్యాయవ్యవస్థలోనే జరిగిందని వర్ణించారు. న్యాయవ్యవస్థ ప్రజలకు చేరువకావాలని సీజేఐగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నట్టు చెప్పారు.
అణగారినవర్గాలను ఆదుకోవడంతోపాటు అవసరమైన వారికి న్యాయం అందించడం సంక్షేమరాజ్యంలో భాగమని సీజేఐ ఎన్వీ రమణ చెప్పారు. జిల్లా కోర్టుల సంఖ్య పెంపు అవకాశాన్ని కక్షిదారులు, న్యాయవాదులు సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తిచేశారు. అప్పుడే వికేంద్రీకరణ ఫలితాలు ప్రజలకు చేరుతాయని చెప్పారు. సత్వర న్యాయం అందేందుకు ఈ న్యాయ సంస్కరణ ఎంతగానో దోహదపడుతుందని పేర్కొన్నారు. కేసుల భారం కారణంగా సత్వరన్యాయం అందని పరిస్థితుల గురించి సీజేఐ వివరించారు.
హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల్లో వేల కేసులు ఏండ్ల తరబడి వాయిదాపడి సత్వర న్యాయం అందడం లేదని చెప్పారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా కోర్టులో 1,81,275 కేసులు పెండింగ్లో ఉంటే, ఇప్పుడు ఆ జిల్లా కోర్టులు మూడుగా విభజించటంతో రంగారెడ్డి జిల్లాలో కేసులు 85,465కు తగ్గాయని, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాకు 77 వేలు, వికారాబాద్ జిల్లా 18 వేల కేసులు బదిలీ అయ్యాయని తెలిపారు. న్యాయాధికారుల నియామకం జరగాల్సి ఉన్నదని పేర్కొన్నారు. 194 పోస్టుల ప్రతిపాదన రాష్ట్రం వద్ద పెండింగ్లో ఉన్నదని, పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటామని సీఎం కేసీఆర్ హామీ ఇవ్వడంపై హర్షం వ్యక్తంచేశారు.
అసలు సిసలు తెలంగాణ బిడ్డలనే న్యాయవాదుల నుంచి న్యాయమూర్తులుగా నియమించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు సీజేఐ ఎన్వీ రమణ చెప్పారు. హైదరాబాద్లో ఇంటర్నేషల్ ఆర్బిట్రేషన్, మీడియేషన్ సెంటర్ ఏర్పాటుకు కూడా సీఎం కేసీఆర్ ఎంతగానో సహకరించారని చెప్పారు. రాష్ట్రంలో న్యాయవ్యవస్థ పటిష్టానికి చర్యలు తీసుకోవడం పట్ల రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఐటీ రంగాన్ని న్యాయవ్యవస్థ సద్వినియోగం చేసుకోవాలని హైకోర్టు సీజేకు విజ్ఞప్తిచేశారు.
అన్ని రాష్ర్టాలు న్యాయవ్యవస్థ బలోపేతానికి సహకరించాలని కోరారు. రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీ తర్వాత ఉపాధి అవకాశాలు బాగా పెరిగాయని చెప్పారు. జ్యుడిషియల్ యూనిట్స్ పెంపు జరగాలని ఆకాంక్షించారు. హైదరాబాద్ అన్నిరంగాల్లో అభివృద్ధి చెందుతున్నందున వాణిజ్య కోర్టుల సంఖ్య పెరగాల్సిన అవసరం ఉన్నదని అన్నారు. హైదరాబాద్లో రెండు, రంగారెడ్డి జిల్లాలో ఒకటి చొప్పున వాణిజ్య కోర్టులు ఉన్నాయని.. వీటి సంఖ్య పెంచాలని కోరారు.
రాష్ట్రంలో పాలనా వికేంద్రీకరణతో అద్భుతాలు సాధించామని, సంస్కరణల ఫలితాలు స్పష్టంగా కనబడుతున్నాయని సీఎం కేసీఆర్ చెప్పారు. అదే పద్ధతిలో న్యాయవవ్యస్థ కూడా పటిష్టంగా ఉంటే, సత్వర న్యాయం లభిస్తే ప్రజల జీవితాలు ఉజ్వలంగా ఉంటాయని ఆశాభావం వ్యక్తంచేశారు. అందులో భాగంగానే కొత్త జిల్లాలను జ్యుడిషియల్ డిస్ట్రిక్ట్స్గా గుర్తించాలన్న వినతిని ప్రధాన న్యాయమూర్తి ఆమోదించడం, కార్యరూపం దాల్చడం చరిత్మ్రాకమని చెప్పారు. సిబ్బంది, పీపీ, జడ్జీలు, సపోర్టింగ్ స్టాఫ్ ఎంతమంది కావాలన్నా నియమించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని ప్రకటించారు.
ఇప్పటికే చాలా పోస్టులను మంజూరుచేశామని, అవసరమైతే మరిన్ని మంజూరు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు. తనకున్న సమచారం ప్రకారం హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టులు, రంగారెడ్డి జిల్లా కోర్టుల్లో కేసుల భారం చాలా అధికంగా ఉన్నదని సీఎం కేసీఆర్ చెప్పారు. ఈ కోర్టులను కూడా విభజన చేసి భారం తగ్గించడం ద్వారా సత్వర న్యాయం అందించే దిశగా చర్యలు చేపట్టాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి విజ్ఞప్తి చేసినట్టు తెలిపారు. జిల్లా పోర్టుఫోలియో జడ్జీలు కూడా ఈ అంశంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరారు.
ఆ కోర్టుల విభజనకు హైకోర్టు నుంచి ప్రతిపాదనలు పంపితే కొత్త కోర్టుల ఏర్పాటుకు ప్రభుత్వం ఆమోదం తెలిపేందుకు సిద్ధంగా ఉన్నదని ప్రకటించారు. హెచ్ఎండీఏలో 1.64 కోట్ల మంది ఉన్నారని, ఏటా వేర్వేరు రాష్ర్టాల నుంచి లక్షల సంఖ్యలో జీవనం కోసం వలస వస్తున్నారని, ఈ కోణంలో ప్రజలకు సత్వర న్యాయం అందించేందుకు వీలుగా ఈ ప్రాంతంలోని కోర్టులను కూడా విభజన చేసే దిశగా హైకోర్టు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. సత్వర న్యాయం అందించేందుకు ఎన్ని కొత్త కోర్టులను ఏర్పాటు చేయాలనే అంశంపై సీజే చర్యలు తీసుకోవాలని కోరారు. న్యాయవ్యవస్థకు సహకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్న్లివేళలా సిద్ధంగా ఉంటుందని హామీ ఇచ్చారు.
పాత జిల్లాల్లో ప్రజలు చాలా కష్టాలు అనుభవించారని సీఎం కేసీఆర్ చెప్పారు. తన సొంత జిల్లా మెదక్ తూర్పు ప్రాంతంలోని సిద్దిపేట నుంచి జిల్లా కేంద్రం సంగారెడ్డికి వెళ్లాలంటే 150 కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సి వచ్చేదని గుర్తుచేసుకొన్నారు. సెషన్స్కోర్టుకు వెళ్లే ప్రజల ఇబ్బందులను కండ్లారా చూశానని చెప్పారు. అందుకే పాలనా సంస్కరణలు చేపట్టి పది జిల్లాలను 33కు పెంచినట్టు తెలిపారు. ములుగు, భూపాలపల్లి రెండు జిల్లాలు అటవీ ప్రాంతంతో ఉంటాయని.. రెండే అసెంబ్లీ నియోజవర్గాలు ఉన్నప్పటికీ జిల్లాలుగా చేసే ముందు ఛత్తీస్గఢ్ సీఎస్తో మాట్లాడి జిల్లాలుగా చేసినట్టు వివరించారు. నాలుగు రాష్ర్టాల మధ్యలో ఉన్న వాటిని జిల్లాలుగా చేయడం వల్ల అక్కడి కక్షిదారులు వరంగల్కు రావాల్సిన అవసరం ఉండబోదని చెప్పారు.
ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్ చెప్పిన సమాచారం ప్రకారం వరంగల్ నుంచి సుమారు 20 మంది న్యాయవాదులు ఆ జిల్లాలకు వెళ్లిపోయారని, అది చాలా సంతోషం కలిగించిందని పేర్కొన్నారు. కొత్త రెవెన్యూ జిల్లాల్లో కోర్టులను ఏర్పాటుకు సీఎం చేసిన ప్రయత్నాలను సభకు అధ్యక్షత వహించిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీశ్చంద్రశర్మ వివరించారు. కొత్త జ్యుడిషియల్ కోర్టుల ఏర్పాటుతో ప్రజలకు సత్వరన్యాయం అందుతుందని చెప్పారు.
ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని.. న్యాయ వ్యవస్థ బలపడుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో న్యాయశాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి, హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఉజ్జల్ భూయాన్, కొత్త జిల్లాల్లో కోర్టుల ఏర్పాటుకు ప్రయత్నించిన జస్టిస్ పీ నవీన్రావు తదితరులు పాల్గొన్నారు. న్యాయ సంస్కరణలకు సహకరించిన సీఎం కేసీఆర్ను.. సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ శాలువాతో సత్కరించారు. జ్జాపికను అందజేశారు. సీజేఐని హైకోర్టు సీజే సత్కరించారు.
గత నెలలో ప్రధాని, సీఎంలు, సీఎస్లతో జరిగిన ఒక సమావేశంలో న్యాయవ్యవస్థ సమర్థంగా పనిచేయాలంటే నిర్మాణాత్మక వ్యవస్థ ఉండాలని సూచించినట్టు జస్టిస్ రమణ తెలిపారు. జాతీయ న్యాయ నిర్మాణవ్యవస్థ ఏర్పాటుపై అవగాహన కొరవడి.. ఈ ప్రతిపాదనను కొన్నిరాష్ర్టాలు చేజార్చుకోవడంపై చింతిస్తున్నట్టు చెప్పారు. ఈ ప్రతిపాదను ఆమోదించి ఉంటే న్యాయవ్యవస్థ బలోపేతమయ్యేదని, న్యాయ వికేంద్రీకరణ జరిగేదని పేర్కొన్నారు.
తెలంగాణలో కొత్త భవనాల నిర్మాణాలకు నిధుల కేటాయింపు, పోస్టుల భర్తీకి చొరవ, మౌలిక వసతుల కల్పన పట్ల చూపుతున్న చిత్తశుద్ధి కొనియాడదగినదని చెప్పారు. తాను సీజేఐ అయ్యాక సుప్రీంకోర్టులో 111 మంది న్యాయమూర్తులు, హైకోర్టుల్లో 155 మంది న్యాయమూర్తులను నియమించినట్టు చెప్పారు. తెలంగాణ హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 24 నుంచి 42కి పెంచటంతోపాటు 19 మంది న్యాయమూర్తులను నియమించామని, మరో ఇద్దరిని వారంలోగా నియమిస్తామని చెప్పారు.
న్యాయవ్యవస్థపై కొందరు అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారంటూ సీజేఐ ఎన్వీ రమణ తీవ్రస్థాయిలో ఘాటువ్యాఖ్యలు చేశారు. కోర్టు తీర్పులు, ఆదేశాలకు వక్రభాష్యం చెప్తూ పైశాచిక ఆనందం పొందేవారి సంఖ్య పెరుగుతున్నదని ఆందోళన వ్యక్తంచేశారు. పరిధి దాటకుండా ఉన్నంతకాలం అందరూ న్యాయవ్యవస్థకు మిత్రులేనని చెప్పారు. పరిధి దాటినవారిని ఉపేక్షించడం రాజ్యాంగ విరుద్ధమని హెచ్చరించారు.
న్యాయవ్యవస్థలోని ఉన్నత వ్యక్తులపై అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా పరిగణిస్తామని స్పష్టంచేశారు. ప్రజల హక్కుల పరిరక్షణ కోసం న్యాయవ్యవస్థ పనిచేస్తుందని, వ్యవస్థ ప్రయోజనం, సమాజశ్రేయస్సే న్యాయవ్యవస్థకు ముఖ్యమని నొక్కి చెప్పారు. న్యాయవ్యవస్థ ద్వారా స్వార్థ ప్రయోజనాలు చేకూర్చుకోలేని వాళ్లు కోర్టు తీర్పులు, ఆదేశాలకు వక్రభాష్యం చెప్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.