కరీంనగర్, అక్టోబర్ 3 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ‘నమ్మి చేరదీసిన వ్యక్తిని.. లీడర్గా తయారుచేసిన వ్యక్తిని మోసం చేసి పక్కోని దగ్గరికి, పక్క పార్టీ వద్దకు పోతే వాళ్లు నమ్ముతరా..?, ఎన్నికలయ్యాక జాడిచ్చితంతే రాజకీయ భవిష్యత్తే నాశనం అవుతుంది.’ ఈ మాటలన్నది ఎవరో కాదు.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. పార్టీ అభ్యర్థి ఈటల రాజేందర్తో కలిసి హుజూరాబాద్లో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో పార్టీ అధ్యక్షుడి నోటి వెంట ఈ మాటలు రావడంతో వేదికపై ఉన్న నాయకులతోపాటు సమావేశానికి హాజరైన కార్యకర్తలు నివ్వెర పోయారు. రాజకీయ జీవితాన్నిచ్చిన కేసీఆర్ను ఈటల మోసం చేసే కదా వచ్చిందని చర్చించుకున్నారు. బండి సంజయ్ ఏరకంగా చెప్పినా.. ఆయన మనసులో మాటను బయటపెట్టారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో బీజేపీని తూర్పారా పట్టిన వ్యక్తిని పార్టీలో చేర్చుకొని ఇప్పుడిలా మాట్లాడారేంటి? అన్న చర్చ కూడా పార్టీ వర్గాల్లో మొదలైంది. ఈటల బీజేపీలో ఇమడలేకపోతున్నారని, త్వరలోనే కాంగ్రెస్లో కలుస్తారనే ప్రచా రం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. ఏదేమైనా బండి మాటలు బీజేపీ శ్రేణుల్లో హాట్ టాపిక్గా మారాయి.
చప్పగా శంఖారావ సభ
హుజురాబాద్ ప్రత్యేక ప్రతినిధి : హుజురాబాద్ ఉప ఎన్నికకు సమయం సమీపిస్తున్న కొద్దీ కమల శిబిరంలో నిరాశా నిస్పృహలు అలుముకుంటున్నాయి. గెలిచి తీరుతామని ప్రగల్భాలు పలుకుతున్నా.. లోలోపల ఓటమి భయం పట్టుకున్నది. హుజురాబాద్లో ఆదివారం నిర్వహించిన బీజేపీ శంఖారావ సభే ఇందుకు నిదర్శనం. సభ ఆద్యంతం చప్పగా సాగగా, నేతల మాటలకు కార్యకర్తలు తలలు పట్టుకునే దుస్థితి నెలకొన్నది. వచ్చామా కూర్చున్నామా.. అన్నట్టుగా సాగింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ల ప్రసంగం పాడిందే పాడరా అన్నట్టు సాగడంతో కార్యకర్తలు బిక్కచచ్చిపోయారు.